చరిత్ర సృష్టించిన మారుతి.. 3 కోట్ల అమ్మకాలు.. ఎక్కువగా అమ్ముడైన మోడల్ ఇదే
భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది, అందుబాటులో ఉండే ధర, నమ్మకమైన పనితీరు, ప్రజల నిత్యజీవితంలో భాగమైన కార్లు. పేద, మధ్యతరగతి ప్రజలకు కార్లు కల కాదు అనే భావనను మార్చిన కంపెనీగా మారుతి సుజుకి ఎంతో కాలంగా పేరు గాంచింది. ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా వంటి మోడళ్లు ఒక్కో ఇంటికి చేరి దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందించాయి. ఇప్పుడు ఈ కంపెనీ మరో గొప్ప మైలురాయిని అధిగమించింది. దేశీయంగా 3 కోట్ల కార్ల విక్రయాలను పూర్తి చేసినట్లు మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 2025 నాటికి ఈ ఘనతను సాధించడం ద్వారా ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా అత్యధికంగా వాహనాలు విక్రయించిన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
1983లో మారుతి 800 మోడల్తో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు దేశవ్యాప్తంగా ప్రతి మూలలో కనబడే విజయగాధగా మారింది. కాలక్రమేణా కంపెనీ సాంకేతికతను మెరుగుపరుస్తూ, భద్రతా ప్రమాణాలను పెంచుతూ, కస్టమర్ల అవసరాలను గుర్తించి విభిన్న మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఇప్పుడు CNG, హైబ్రిడ్ టెక్నాలజీలలో కూడా అడుగుపెట్టి పర్యావరణానుకూల దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఘనత సాధించడం వెనుక భారత ప్రజల విశ్వాసం ఉంది.

అందుబాటు ధరలు, విస్తృత డీలర్ నెట్వర్క్, నమ్మకమైన సర్వీస్ సపోర్ట్ ప్రధాన కారణాలుగా ఒక్కో కుటుంబం, ఒక్కో తరానికి మారుతి ఒక గుర్తుగా మారింది. ఇది భారత ఆటోమొబైల్ రంగంలో సక్సెస్కు ప్రతీకగా నిలిచింది. కంపెనీ ప్రయాణం డిసెంబర్ 1983లో ప్రారంభమై భారతీయ కుటుంబం కోసం కొత్త యుగానికి నాంది పలికింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ధర, సులభమైన నిర్వహణతో మారుతి త్వరగానే ప్రతి ఇంటి పేరుగా మారింది.
1983లో మొదలైన ఈ ప్రయాణం, ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 2012లో, అంటే ప్రారంభం నుంచి 28 సంవత్సరాలు 2 నెలలు గడిచిన తర్వాత, కంపెనీ తన మొదటి 1 కోటి కార్ల విక్రయాల మైలురాయిని చేరుకుంది. ఇది భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక పెద్ద ఘట్టం. అయితే, ఆ తర్వాత మారుతి సుజుకి అమ్మకాలు మరింత వేగం అందుకున్నాయి.

మరో 7 సంవత్సరాలు 5 నెలల తర్వాత, 2019 జూలైలో కంపెనీ 2 కోట్ల కార్ల అమ్మకాల రికార్డును సాధించింది. ఇది సంస్థపై ప్రజల నమ్మకాన్ని, నాణ్యతను స్పష్టంగా చూపింది. ఇక ఇప్పుడు, 2025 నవంబర్ నాటికి, కేవలం 6 సంవత్సరాలు 4 నెలల వ్యవధిలోనే 3 కోట్ల కార్ల విక్రయాలను పూర్తిచేసి మరో చరిత్ర సృష్టించింది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా గణనీయమైన విజయంగా మారింది.
ఈ 3 కోట్ల వాహన విక్రయాల్లో ఆల్టో అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది, ఇప్పటి వరకు 47 లక్షల యూనిట్లు విక్రయించబడ్డాయి. దానికి దగ్గరగా వ్యాగన్ ఆర్ (34 లక్షలు), స్విఫ్ట్ (32 లక్షలు) ఉన్నాయి. ఈ మూడు మోడళ్లు కలిసి మారుతి సుజుకి విజయానికి పునాది వేశాయి. ఈ మూడు మోడళ్లు మాత్రమే కలిపి ఇప్పటి వరకు 1 కోటి 13 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.

ఈ మూడు కార్లు భారత రోడ్లపై ప్రతి ఇంటి కలను సాకారం చేశాయి. ఆల్టో తక్కువ ధరతో మొదటి కారు కలను నిజం చేసింది. వ్యాగన్ ఆర్ ఫ్యామిలీ కంఫర్ట్కి ప్రతీకగా నిలిచింది. ఇక స్విఫ్ట్ యువతరానికి స్టైలిష్, స్పోర్టీ డ్రైవింగ్ అనుభవాన్ని అందించింది. ఈ అమ్మకాలతో భారత రోడ్లపై ప్రతి రెండో లేదా మూడో కారు మారుతిదే అనే స్థాయికి ఈ బ్రాండ్ చేరింది.


Click it and Unblock the Notifications








