మారుతీ బ్రెజ్జా దూసుకెళ్లింది! ఏకంగా హ్యుందాయ్ క్రెటాకే ముచ్చెమటలు పట్టించింది!
ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోదారుల అభిరుచుల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా మే నెల ముగియగానే తయారీదారులు తమ అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ సేల్స్ గణంకాలను చూసినట్లయితే గతంలో మెరుగైన అమ్మకాలు సాధించిన మోడల్ ఇప్పుడు తక్కువగా సేల్స్ నమోదు చేస్తుండగా, గతంలో అమ్మకాలు పడిపోయిన మోడల్ ఈ సారి పుంజుకుంది. తాజాగా దేశీయ అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా (Brezza) మే 2025లో సేల్స్ పరంగా గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇది ఈ ఒక్క నెలలోనే 15,566 యూనిట్లు అమ్ముడైంది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు 10 శాతం వృద్ధి.
గతంలో క్రెటా, టాటా పంచ్లు అధికంగా విక్రయమైన SUVలుగా నిలిచినప్పటికీ, మే నెలలో బ్రెజ్జా కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవలి కాలంలో హ్యుందాయ్ క్రెటా పేరు చెప్పగానే SUV ప్రీమియం సెగ్మెంట్లో మొదటగా గుర్తొచ్చే మోడల్గా నిలిచింది. బలమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్, లేటెస్ట్ ఫీచర్లతో ఈ సెగ్మెంట్లో అగ్రస్థానాన్ని నెలల తరబడి కాపాడుకుంది. కానీ మే 2025లో చిత్రమే మారిపోయింది. ఇప్పుడు బ్రెజ్జా ప్రసిద్ధ మోడల్గా అవతరించింది.

బ్రెజ్జా ప్రస్తుతం SUV విభాగంలో మాత్రమే కాకుండా, మధ్యతరగతి కుటుంబాల మనస్సులు గెలుచుకునే కారు కూడా అయింది. మే 2024లో బ్రెజ్జా అమ్మకాలు 14,186 యూనిట్లకు పైగా నమోదు కాగా, కేవలం సంవత్సరం వ్యవధిలోనే మారుతీ బ్రెజ్జా తన స్థాయిని మరింత పెంచుకొని, 15,566 యూనిట్ల అమ్మకాలతో నెక్స్ట్ లెవెల్కి చేరింది. ఇదే సమయంలో, హ్యుందాయ్ క్రెటా కూడా తన స్థిరమైన డిమాండ్ను కొనసాగించినప్పటికీ, పెద్ద వృద్ధిని మాత్రం చూపించలేకపోయింది.
మే 2025లో క్రెటా 14,860 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. ఇది గత ఏడాది అదే నెలలో విక్రయించిన 14,662 యూనిట్లతో పోల్చితే కేవలం 1 శాతం వృద్ధి. అంటే మార్కెట్ పోటీలో బ్రెజ్జా తన శబ్దాన్ని స్పష్టంగా వినిపించింది. ఈ పోటీలో టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో బ్రెజ్జా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానాన్ని డిజైర్ స్వాధీనం చేసుకోగా, రెండవ స్థానంలో మారుతీ ఎర్టిగా నిలిచింది.

ఒక 7-సీటర్ MPV అయిన ఎర్టిగా, పలు ప్రయోజనాలతో పాటు కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండటంతో వృద్ధి సాధించింది. అయితే, ఈ మధ్యతరగతి SUV విభాగంలో బ్రెజ్జా అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. చాలా మంది వినియోగదారులు దీన్ని 'మధ్యతరగతి వ్యక్తి సొంత SUV' అని అభిమానంగా పిలుచుకుంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలు.. ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజ్, విశ్వసనీయ ఇంజిన్ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చు.
మారుతీ సుజుకీ బ్రెజ్జా SUV యువత నుంచి కుటుంబ వినియోగదారుల వరకు ప్రతి ఒక్కరిలోను విశేష ఆకర్షణ పొందుతోంది. ఈ కారులో 1.5-లీటర్, నాలుగు సిలిండర్ల K15C సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మారుతీ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడినది, అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ మెరుగ్గా ఉంటుంది, అలాగే డ్రైవింగ్ అనుభవం కూడా స్మూత్గా ఉంటుంది.

ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 103.1 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు, అలాగే 4,400 rpm వద్ద గరిష్టంగా 136.8 Nm టార్క్ను అందించగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో పాటు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్తో కూడా లభిస్తుంది.
అంతేకాదు, బ్రెజ్జాను ఇప్పుడు CNG వేరియంట్లో కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పెట్రోల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఇది మరింత ప్రాక్టికల్ ఆప్షన్గా నిలుస్తోంది. ధర పరంగా చూస్తే, మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.8.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రారంభమవుతుంది, టాప్ వేరియంట్ రూ.14.14 లక్షల వరకూ వెళుతుంది.


Click it and Unblock the Notifications








