అందరూ ఈ చిన్న కార్లే అడుగుతున్నారు! 6 ఎయిర్బ్యాగులతో మారుతి ఎంట్రీ కార్లకు భారీ డిమాండ్!
భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ధర, మైలేజ్ వంటి అంశాలు మాత్రమే కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తే, ఇప్పుడు భద్రత కూడా అంతే ముఖ్యమైన ప్రమాణంగా మారింది. వినియోగదారులు తమ కుటుంబం ప్రయాణించే కారులో అత్యంత రక్షణ ఉండాలని కోరుకోవడం వల్ల భద్రతా ఫీచర్లపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికుల రక్షణను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కొన్ని సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసింది. ఇకపై కార్లలో 6 ఎయిర్బ్యాగులు, ఏబిఎస్, ఇఎస్పి వంటి ముఖ్యమైన భద్రతా అంశాలు తప్పనిసరి కావడంతో ఆటోమొబైల్ రంగం కూడా తన దృష్టిని మార్చుకుంది.
అంతేకాకుండా, ప్రభుత్వం భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారతీయ కారు భద్రతా అంచనా కార్యక్రమం (Bharat NCAP)ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా కారు భద్రతను తేలికగా అంచనా వేసే వీలైంది. ఒకప్పుడు భద్రతాపరంగా విమర్శలు ఎదుర్కొన్న మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా ఇప్పుడు తన పోర్ట్ఫోలియోలో పెద్ద మార్పులు చేస్తోంది. తన ముఖ్య మోడళ్లలో 6 ఎయిర్బ్యాగులు వంటి ఫీచర్లను స్టాండర్డ్గా అందిస్తుంది.

ఒకప్పుడు ధరను ప్రధానంగా చూసిన ఎంట్రీ-లెవల్ కారు కొనుగోలుదారులు, ఇప్పుడు భద్రతపైనా దృష్టి సారిస్తున్నారు. దీనిని గుర్తించిన మారుతి, ఇప్పుడు తన ప్రసిద్ధ మోడళ్లైన ఆల్టో K10, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్ వంటి వాటిలో 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా అందిస్తుంది. ఈ నిర్ణయం మార్కెట్లో తక్షణ ప్రభావాన్ని చూపించింది. తక్కువ ధరలో మంచి సేఫ్టీ కోసం చూసే వారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
కంపెనీ ప్రతినిధుల ప్రకారం, 6 ఎయిర్బ్యాగ్ల ఏర్పాటు చేసిన తర్వాత, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ మోడళ్లపై షోరూమ్లో అడగటం, బుకింగ్లు భారీగా పెరిగాయి. ప్రత్యేకంగా వ్యాగన్ఆర్ వంటివాటిపై వినియోగదారుల నమ్మకం గణనీయంగా పెరిగిందని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. కొత్త ఫీచర్స్తో ధరలు పెరిగినప్పటికి కస్టమర్లు మాత్రం వెనకడుగు వేయట్లేదు.

ధర విషయంలో కొంత మార్పు వచ్చినప్పటికీ, మారుతి ఆల్టో కారు 6 ఎయిర్బ్యాగులతో దేశంలోనే అత్యంత చౌకైన కారు అనే గుర్తింపును కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇది రూ. 4.23 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభ్యమవుతోంది. ఇది చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే సేఫ్ కార్గా నిలుస్తోంది. సెలెరియో, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్లకు జూలై నెలలో బుకింగ్లు 7 శాతం వరకు పెరిగినట్లు మారుతి తెలిపింది.
అయితే కొంతమంది ఈ కార్ల గురించి విచారణ చేసినప్పటికి కొనుగోలు చేయడం లేదని బెనర్జీ తెలిపారు. కొత్త సేఫ్టీ ప్రమాణాలను అమర్చడం వలన వాటి ధర మోడల్ను బట్టి రూ. 10,000 నుండి రూ. 35,000 వరకు పెరిగింది. ఇది చాలా మందికి భారం అయింది. అయినప్పటికి కొన్ని ప్రముఖ మోడళ్ల బుకింగ్స్ గతంలో కంటే కొంత పెరిగాయి. అదే సమయంలో మరిన్ని మోడళ్లకు మాత్రం ప్రజల ఆదరణ కరువైంది.

భద్రతపై పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, మారుతి సుజుకి ఈ సంవత్సరం చివరి నాటికి తన మొత్తం కార్ల పోర్ట్ఫోలియోలో 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణిక భద్రతా ఫీచర్గా అందించనున్నది. ఇప్పటికే ఆల్టో, సెలెరియో, స్విఫ్ట్, వ్యాగన్ఆర్, డిజైర్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఈ మార్పును అమలు చేసిన మారుతి, ఇప్పుడు అన్ని సెగ్మెంట్లలోనూ, ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం వరకూ భద్రతను ప్రామాణికంగా అందించేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications








