రెండు కుటుంబాలకు బాగా సెట్ అయ్యే కారు.. రూ.8 లక్షల ధరలో 28 కి.మీల మైలేజ్..
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో తాజాగా తన కార్ల అమ్మకాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో 7 సీటర్ కారు అయినటువంటి ఎర్టిగాకు సంబంధించిన అమ్మకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఏప్రిల్ 2025లో ఎర్టిగా(Ertiga) మరోసారి తన సత్తా చాటుతూ అత్యధిక డిమాండ్ ఉన్న 7-సీటర్ల వాహనంగా నిలిచింది. నెల మొత్తం అమ్మకాల పరంగా దేశవ్యాప్తంగా టాప్ 10 కార్ల జాబితాలో, ఈ కుటుంబ ప్రయాణ వాహనం నాలుగవ స్థానాన్ని అందుకుంది. ఈ అమ్మకాలను చూసినట్లయితే భారతీయ కుటుంబాల హృదయాలను ఆకర్షించిన మల్టీ పర్పస్ వాహనాల పట్ల ఉన్న డిమండ్కు నిదర్ననంంగా నిలుస్తోంది.
విశాలమైన ఇంటీరియర్, మంచి మైలేజ్, మెరుగైన రైడింగ్ కంఫర్ట్ వంటి అంశాల కారణంగా ఎర్టిగా బలమైన అమ్మకాలను నమోదు చేసింది. ఒకే వాహనంలో కుటుంబ ప్రయాణం చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ట్రిప్స్ను నిర్వహించాలనుకునే మధ్యతరగతి భారతీయ కుటుంబానికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. అదే సమయంలో, మహీంద్రా నుండి వచ్చిన మరో శక్తివంతమైన 7-సీటర్ ఎస్యూవీ అయిన స్కార్పియో కూడా పోటీలో ఏమాత్రం తగ్గలేదు.

ఐదవ స్థానంలో నిలిచిన ఈ వాహనం, తక్కువ తక్కువ సమయంలో భారీ డిమాండ్ను సంపాదించి, ఎర్టిగా పట్ల గట్టి పోటీని నెలకొల్పింది. ఏప్రిల్ 2025లో మారుతీ సుజుకీ ఎర్టిగా మొత్తం 15,780 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇదే సమయంలో, మహీంద్రా స్కార్పియో కూడా 15,534 యూనిట్ల అమ్మకాలతో చాలా దగ్గరలో పోటీ నిచ్చింది. ఈ రెండు మోడళ్ల మధ్య కేవలం 246 కార్ల తేడా ఉండడం గమనార్హం.
ఎర్టిగా ఈ రేంజ్లో అమ్మకాలను సాధించడానికి ప్రధాన కారణం, మంచి మైలేజ్, ఎక్కువ మంది సౌకర్యంగా కూర్చోడానికి అనుకూలమైన స్థలం అలాగే దీని ధర. ఈ కారు ప్రారంభ ధర రూ.8,96,500 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బడ్జెట్కు అనుగుణమైన ఎంపికగా నిలుస్తోంది. ఇది ప్రత్యేకించి పెద్ద కుటుంబాలు కలిగిన వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. కేబిన్ స్పేస్, సౌకర్యవంతమైన సీటింగ్, లేటెస్ట్ ఫీచర్లు వినియోగదారులను ఆకర్షించాయి.

ఎంపీవీలకు ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో మారుతీ సుజుకీ ఎర్టిగా అమ్మకాల్లో దూసుకుపోతుంది. ఇంజిన్ విషయానికి వస్తే, పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంజిన్లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను జోడించారు. ఇది దాదాపు 28kmpl వరకు మైలేజ్ను అందిస్తుంది. ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న కాలంలో మైలేజ్ పరంగా ఈ కారు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది.
ఎర్టిగా పెట్రోల్ మోడల్ నాలుగు వేరియంట్లు LXi, VXi, ZXi, ZXi+ లలో లభిస్తుంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.13.95 లక్షల వరకు ఉంది. ఈ కారు క్యాబిన్లో అధునాతన ఫీచర్లను కంపెనీ అందించింది. లోపల 9-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు, నావిగేషన్, రియర్వ్యూ కెమెరా సెటప్, మూడు వరుసల సీటింగ్ ఆప్షన్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు వంటివి ఉన్నాయి.

బయటి నుంచి కారు అందాన్ని పెంచడంలో కొత్త 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, వెనుక AC వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్, ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBDతో కూడిన ABS సిస్టం, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








