ఇకపై ఈ మారుతీ కార్లలో మీ ఫ్యామిలీతో కలిసి ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు! ఇప్పుడు ఫుల్ సేఫ్టీ
భారతదేశం మొత్తంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల బ్రాండ్ జాబితాలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి ప్రజల మనస్సు ఎలా గెలవాలో బాగా తెలుసు. గతంలో మారుతి కార్లకు భద్రత లేదు అంటూ చాలా విమర్శలు వచ్చినా, కంపెనీ వాటిని భరించింది. అయితే ఇప్పుడు , తన కొత్త మోడళ్లతో భద్రత పరంగా ఏ ఇతర బ్రాండ్ కంటే తక్కువేమీ లేదని నిరూపిస్తోంది. గతంలో డిజైర్ మోడల్, భారత్ NCAP క్రాష్ టెస్ట్లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో కంపెనీ సేఫ్టీ పరంగా వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా పోయింది. దీనిని కొనసాగిస్తూ, గ్రాండ్ విటారా కూడా పూర్తి సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇక బాలెనో కూడా 4-స్టార్లు సాధించి, సేఫ్టీ పరంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.
కేవలం క్రాష్ టెస్ట్లలోనే కాదు, ఎయిర్బ్యాగ్ల విషయంలోనూ మారుతి ఓ విప్లవం తీసుకువస్తోంది. ఇప్పటివరకు చిన్న కార్లలో లభించని 6 ఎయిర్బ్యాగ్లు, ఇప్పుడు ఆల్టో సహా పలు మోడళ్లలో ప్రామాణికంగా అందిస్తున్నామంటూ కంపెనీ ప్రకటించింది. ఇదిలా ఉంటే తన కస్టమర్లకు మరింత సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండు మోడళ్లైన ఎర్టిగా, బాలెనోకు 6 ఎయిర్బ్యాగ్లు అధికారికంగా ప్రవేశపెట్టినట్లు మారుతి ధృవీకరించింది.

మారుతి సుజుకి ఆల్టో కె10, సెలెరియో, ఈకో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి మొత్తం కార్ల లైనప్ ఇప్పుడు 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా పొందుతోంది. ఇంతకు ముందు కొన్ని మోడళ్లకు మాత్రమే పరిమితంగా అందిన ఈ భద్రతా ఫీచర్, ఇప్పుడు అన్ని మోడళ్లకూ వర్తింపజేయడం ద్వారా మారుతి తన భవిష్యత్ దృష్టిని స్పష్టంగా చూపించింది. కొత్త సేఫ్టీ అంశాలతో వీటి ధరలు పెరిగాయి.
7-సీటర్ MPV ఎర్టిగా ధరలో 1.4 శాతం పెరుగుదల ఉండగా, ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో ధర 0.5 శాతం పెరిగింది. దీంతో, ఎర్టిగా సిరీస్ ధర ఇప్పుడు రూ. 8.96 లక్షల నుంచి రూ. 13.25 లక్షల వరకు ఉంది. అదే బాలెనో ధర రూ.6.70 లక్షల నుంచి రూ. 9.92 లక్షల వరకు చేరుకుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్రోడ్ వచ్చేసరికి నగరాలను బట్టి మారుతుంది.

పెరిగిన ఈ ధరలు జూన్ 16 నుంచి అమల్లోకి వస్తాయని మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్లలో 6 ఎయిర్బ్యాగులతో పాటు అదనంగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD), అలాగే ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ మౌంట్లు కూడా ఈ మోడళ్లలో భాగమయ్యాయి. ఈ మార్పులు చూస్తే, ధర పెరిగినా భద్రతకు ప్రాధాన్యత అనే మారుతి ధోరణి స్పష్టమవుతుంది.
భారతదేశంలో రోడ్ సేఫ్టీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(MoRTH) గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 అక్టోబర్ నుండి ప్రారంభించే అన్ని ప్రయాణికుల కార్లలో 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరిగా ఉండాలి స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికుల భద్రతలో మెరుగుదల ఆశించవచ్చు. ఇప్పటికీ పలు బ్రాండ్లు ముందు రెండు ఎయిర్బ్యాగ్లతో మాత్రమే కార్లు అందిస్తున్న సమయంలో, ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం చాలా మందికి ఉపయోగపడనుంది.

ఇప్పటికే అన్ని ప్రధాన వాహన తయారీదారులు మారుతి సుజుకి, హ్యూండాయ్, టాటా, కియా, మహీంద్రా తదితర కంపెనీలు తమ కార్లను ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేయడం ప్రారంభించాయి. చాలా మోడళ్లలో ఇప్పటికే 6 ఎయిర్బ్యాగ్లు, అలాగే ఇతర భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా అందిస్తున్నాయి. ఈ చర్య భారతదేశంలో భద్రతా ప్రమాణాల పరంగా ఒక కీలక మలుపు అని చెప్పాలి.


Click it and Unblock the Notifications








