మనోళ్లకు మన కార్లు నచ్చట్లేదా? విదేశాల్లో జోష్.. మన దేశంలో మాత్రం డౌన్! ఎందుకిలా?
భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) తాజాగా గత నెలకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. ఇతర కంపెనీలకు ధీటుగా చాలా కాలంగా అమ్మకాలతో దూసుకుపోతున్న మారుతీ మే 2025 నెలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. మొత్తం అమ్మకాలు 1,80,077 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ఇది మే 2024లో నమోదైన 1,74,551 యూనిట్లతో పోలిస్తే 3.2 శాతం పెరుగుదలగా చెప్పవచ్చు. ఈ మొత్తం గణాంకాల్లో దేశీయ మార్కెట్ అమ్మకాలు, టయోటాకు పంపిన ఎగుమతులు, ఇతర సరఫరాల నుంచి వచ్చిన యూనిట్లు కూడా ఉన్నాయి. దేశీయంగా చూసినట్లయితే కంపెనీ 1,38,690 యూనిట్ల వాహనాలను తన డీలర్ నెట్వర్క్కు పంపింది. ఈ సంఖ్యలో తేలికపాటి వాణిజ్య వాహనాలు కూడా భాగంగా ఉన్నాయి.
వీటిలో ప్యాసింజర్ వాహనాల సంఖ్యను చూసినట్లయితే(PV) అమ్మకాల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మే 2025లో పీవీ విభాగం అమ్మకాలు 1,35,962 యూనిట్ల విక్రయాలకే పరిమితమైంది. అదే మే 2024లో 1,44,002 యూనిట్లను అమ్మిన కంపెనీ ఈ సారి మాత్రం తక్కువ గణంకాలను నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 5.6 శాతం తగ్గుదల కావడం గమనార్హం. మారుతున్న వినియోగదారుల అభిరుచుల కారణంగా ప్రయాణీకుల వాహనాల సెగ్మెంట్లో వెనుకబడింది.

మారుతీ సుజుకీ మే 2025 ప్రయాణికుల అమ్మకాల గణాంకాలు విభాగాలవారీగా చూస్తే, కంపెనీ కొన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనను నమోదు చేసినప్పటికీ, కొన్ని సెగ్మెంట్లలో స్పష్టమైన తగ్గుదల ఎదురైంది. ప్రయాణీకుల వాహనాల్లోని ఈకో మోడల్ మంచి స్పందన అందుకుంది. మొత్తం 12,327 యూనిట్ల విక్రయాలతో ఈ వాహనం తన స్థిర స్థానాన్ని నిలబెట్టుకుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సూపర్ క్యారీ వాహనం కూడా 2,728 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఇతర విభాగాల్లో, మినీ సెగ్మెంట్కు చెందిన ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మే 2024లో 9,902 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, మే 2025లో కేవలం 6,776 యూనిట్లే విక్రయమైనట్లు రికార్డైంది. ఇది దాదాపుగా 31.5 శాతం తగ్గుదలగా నమోదైంది. వినియోగదారుల అభిరుచులు మారడం, మార్కెట్లో కొత్త ప్రత్యర్థుల ప్రభావం వల్ల ఈ తగ్గుదల చోటుచేసి ఉండవచ్చు. కస్టమర్లు ఇతర మోడళ్లపై ఆసక్తి చూపించడం కారణంగా అమ్మకాలు తగ్గాయి.

అలానే, కాంపాక్ట్ సెగ్మెంట్లో బాలెనో, స్విఫ్ట్, వ్యాగన్ఆర్, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్ వంటి ప్రముఖ మోడళ్ల అమ్మకాలు 9.6 శాతం తగ్గుదలతో 61,502 యూనిట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో 68,206 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక, యుటిలిటీ వాహనాల విభాగం మాత్రం కంపెనీకి ఊరటనిచ్చే రీతిలో ప్రదర్శించింది. బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, XL6, ఇన్విక్టో, జిమ్నీ వంటి మోడళ్లతో ఈ సెగ్మెంట్లో అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి.
మే 2024లో 54,204 యూనిట్లు విక్రయించగా, మే 2025లో ఇది 54,899 యూనిట్లకు చేరింది. అంతేకాక, ఇతర తయారీదారులకు (OEMs) అందించిన వాహనాల పరంగా, ముఖ్యంగా టయోటాకు కంపెనీ కొద్దిగా వెనుకబడింది. గత ఏడాది 10,490 యూనిట్లు సరఫరా చేసిన మారుతీ, ఈసారి 10,168 యూనిట్లకే పరిమితమైంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, మారుతీ సుజుకీ చిన్న, కాంపాక్ట్ వాహనాల సెగ్మెంట్లలో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మారుతీ సుజుకీ మే 2025లో ఎగుమతుల రంగంలో అద్భుతమైన ప్రదర్శనను చూపింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 17,367 యూనిట్లను విదేశాలకు రవాణా చేయగా, ఈసారి సంఖ్య గణనీయంగా పెరిగి 31,219 యూనిట్లకు చేరింది. ఇది సుమారు 80 శాతం వృద్ధి కావడం గమనార్హం. ఈ బలమైన ఎగుమతుల ప్రదర్శన, దేశీయ మార్కెట్లో ప్రయాణీకుల వాహనాల విక్రయాల్లో కనిపించిన తగ్గుదలని కొంతమేర భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications








