బైక్ కొనే బదులు కారు కొనచ్చు.. ధరల తగ్గింపుతో మారుతి షోరూమ్లకు క్యూ కట్టడం ఖాయం!
జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్ రంగం మొత్తం కదిలిపోయింది. దేశంలోని ప్రధాన బ్రాండ్లు తమ కొత్త ధరలను వరుసగా ప్రకటిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టాటా మోటార్స్ నుండి హ్యుందాయ్ వరకు, రెనాల్ట్, మహీంద్రా, టయోటా, స్కోడా, కియా, ఎంజీ వంటి కంపెనీలు తమ మోడళ్ల ధరల్లో గణనీయమైన తగ్గింపులు చేస్తూ మార్కెట్లో హంగామా సృష్టించాయి. అయితే, ఇంత హడావుడి జరుగుతున్న సమయంలో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు అయిన మారుతి సుజుకి కూడా ధర తగ్గింపును చేయడానికి సిద్దమైంది. ప్రతి నెలా లక్షల్లో కార్లను విక్రయించే స్థాయికి చేరిన మారుతి సుజుకి మోడళ్ల వారీగా ధరల్లో మార్పులు చేసి కస్టమర్లను ఆకర్షించనుంది.
కొత్త జీఎస్టీ రేట్లను అనుసరించి మారుతి సుజుకీ తన విస్తృత మోడల్ శ్రేణిలో ధరలను కనీసం రూ.35,000 నుంచి గరిష్టంగా రూ.2.25 లక్షల వరకు తగ్గించనుందని సమాచారం. అంటే, బడ్జెట్ కార్ల నుంచి ప్రీమియం మోడళ్ల వరకు, విభిన్న వర్గాల వినియోగదారులు అందరికీ ఈ తగ్గింపుల వల్ల లాభం చేకూరే అవకాశముంది. పండుగ సీజన్లో ఈ తగ్గింపు మారుతికి జోష్ ఇవ్వనుంది.

జీఎస్టీ తగ్గింపు ప్రభావం మారుతి సుజుకి కస్టమర్లకు నిజంగా పెద్ద గిఫ్ట్లా మారింది. ఇప్పటికే మార్కెట్లో బలమైన డిమాండ్ ఉన్న మారుతి స్విఫ్ట్ నుంచి ఇతర మోడళ్ల వరకు తగ్గడం వినియోగదారుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి మాస్ మోడళ్ల ధరల్లో కూడా గణనీయమైన తగ్గింపులు జరగనున్నాయి. ఉదాహరణకు, ఆల్టో ధర దాదాపు రూ.40,000 వరకు తగ్గనుంది.
అంటే, హ్యాచ్బ్యాక్ ప్రారంభ ధర రూ.4.09 లక్షల నుంచి రూ.3.79 లక్షలకు చేరుతుంది. అలాగే, వ్యాగన్ఆర్ ధర రూ.57,000, సెలెరియో ధర రూ.50,000, ఎస్-ప్రెస్సో ధర రూ.38,000 వరకు తగ్గనుందని సమాచారం. కేవలం ఎంట్రీ లెవల్ మోడళ్లే కాదు, కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో కూడా స్విఫ్ట్తో పాటు డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వీటిలో వరుసగా రూ.58,000, రూ.61,000, రూ.60,000, రూ.68,000 వరకు తగ్గింపు ఉంటుంది.

దీంతో, ఫ్యామిలీ బడ్జెట్ కార్లలో ఈ మోడళ్లకు మరింత డిమాండ్ పెరగడం ఖాయం. అంతేకాకుండా, యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ కూడా జీఎస్టీ ప్రభావంతో చవకగా మారుతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రెజ్జా ధర రూ.78,000 తగ్గుతుండగా, ఎర్టిగా ధర కూడా దాదాపు రూ.41,000 తగ్గనుంది. జీఎస్టీ తగ్గింపు ప్రభావం కేవలం చిన్న కార్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్లోనూ వినియోగదారులు లాభపడే పరిస్థితి ఏర్పడింది.
మారుతి XL6 MPV ధరలో రూ.35,000 తగ్గింపు పోటీదారులపై ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఫీచర్లతో XL6 ఎప్పటి నుంచో మంచి ఆదరణ పొందుతుండగా, ధర తగ్గింపుతో ఇది మధ్య తరగతి కుటుంబాలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఇక, సాహసయాత్రలు చేసే వారికి ప్రత్యేకంగా ఆకర్షణీయమైన మారుతి సుజుకి జిమ్నీ ధరలో గణనీయమైన రూ.1.14 లక్షల తగ్గింపు రావడం ఒక పెద్ద ఆకర్షణగా నిలిచింది.

4x4 సామర్థ్యం, కాంపాక్ట్ డిజైన్, ఆఫ్-రోడింగ్ ఫీచర్లతో జిమ్నీ ఇప్పటికే యూత్, అడ్వెంచర్ లవర్స్కి ఇష్టమైన వాహనం. ఇప్పుడు ధర తగ్గడంతో మరింత మందిని తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. అదే సమయంలో, కంపెనీ ఇటీవల మిడ్-సైజ్ SUV విభాగంలో తన రెండవ మోడల్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త SUV కూడా తగ్గిన జీఎస్టీ శ్లాబుల ప్రభావంతో మరింత పోటీ ధరలో లభించనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications








