కార్ల ధరలు పెరిగాయి సుమీ.. మరి ఏ కంపెనీ ఎంత పెంచిందో తెలుసుకోవాలిగా! అయితే ఇది చదవండి
కొత్త ఏడాదిలో కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి దేశీయ వాహన తయారీ దారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇన్పుట్, తయారీ ఖర్చులు పెరగటం కారణంగా తమ కార్ల ధరలను జనవరి 1, 2025 నుంచి పెంచుతామని గతంలోనే కంపెనీలు ప్రకటించగా, తాజాగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్ ఇండియా, స్కోడా, కియా ఇండియా, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటివి తమ కార్ల ధరలను జనవరి నుంచి పెంచాయి. దీంతో కొత్తగా కార్లను కొనుగోలు చేసే వారు కొద్ది రోజుల వ్యవధిలోనే అదనంగా మరింత ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో భారతీయ వాహన పరిశ్రమ మంచి వృద్ధిని కనబరుస్తుంది.
ఈ నేపథ్యంలో కార్ల సేల్స్ పెరిగి కంపెనీలకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నప్పటి పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా ఆదాయం తక్కువగానే ఉంటుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఖర్చులను భర్తీ చేయడానికి కస్టమర్లపై ధరల పెంపు భారం మోపారు. ధరల పెంపుదలకు సంబంధించి గత నెలలోనే కార్ల కంపెనీలు ఒక దాని తర్వాత ఒకటి ప్రకటన చేశాయి. ఎంత మేరకు ధర పెంపుదల ఉంటుందో కూడా వెల్లడించాయి.

దేశీయ దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా(Maruti Suzuki) తన కార్ల ధరలను జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు గతంలోనే ప్రకటించింది. తన మోడళ్ల ధరలను 4 శాతం పెంచింది. డిసెంబర్లో ప్రకటించగా, కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. సాధారణంగా మారుతీ కార్లు మధ్యతరగతి వినియోగదారులకు అనుకూలంగా ఉండే ధరల్లో లభిస్తాయి. అయితే ఇప్పుడు నిర్ణయంతో ఈ కంపెనీ కార్ల ధరలు ఆకాశాన్నంటాయి.
టాటా మోటార్స్(Tata Motors) ఇండియాలో మైలేజ్తో పాటు, ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత నమ్మకమైన కంపెనీ. తన కార్ల ధరలను కొత్త ఏడాదిలో మూడు శాతం వరకు పెంచింది. దీంతో ఎంతో సంతోషంగా టాటా కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు అదనంగా ఈ పెరిగిన ధరలను చెల్లించాల్సి ఉంటుంది. హ్యాచ్బ్యాక్, ఎస్యూవీల ధరలు అన్ని కూడా పెరిగాయి. రాబోయే ఎలక్ట్రిక్ కార్లు కూడా పెరిగిన ధరల ప్రకారం అందుబాటులో ఉంటాయి.

హ్యుందాయ్ మోటార్స్ (Hyundai) కంపెనీ తన అన్ని మోడళ్ల ధరలను రూ.25,000 వరకు పెంచింది. పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, రవాణా ధరలు పెరుగుదల కారణంగా తప్పనిసరి పరిస్ధతుల్లో ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra And Mahindra) కంపెనీ తన కార్ల ధరలను జనవరి 1 నుంచి మూడు శాతం వరకు పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇన్పుట్ ఖర్చులతో ఈ పెంపుదల చేసింది.
ఎంజీ మోటార్ ఇండియా(Mg Motor India) అన్ని కార్ల ధరలను మూడు శాతం వరకు పెంచింది. ప్రస్తుతం కంపెనీ కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 2025 ఏడాదిలో కొత్తగా పలు కార్లను లాంచ్ చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలతోనే వీటిని విక్రయిస్తుంది. కియా ఇండియా(Kia India) తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచింది.

స్కోడా కంపెనీ జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం పెంపుదల చేసింది. అయితే ఇటీవల విడుదల అయిన కైలాక్ మోడల్ మినహా మిగతా కార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కైలాక్ బుకింగ్స్ 33,333 చేరే వరకు ధరల పెంపు నిర్ణయాన్ని ఈ మోడల్కు వర్తింప చేయట్లేదు. ఆడి(Audi) కార్ల ధరలను 3 శాతం పెంచింది. మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) కార్ల ధరలను 3 శాతం పెంపుదల చేసింది.


Click it and Unblock the Notifications








