పెట్రోల్, కరెంట్ ఖర్చులకు గుడ్ బై.. పూర్తిగా ఇథనాల్తో నడిచే మారుతి కారు వచ్చేస్తోంది
ఇండియాలో వాహన పరిశ్రమ ఒక కొత్త మార్పునకు సిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, కాలుష్యం సమస్య ఎక్కువవుతున్నా, వీటికి పరిష్కారంగా కొత్తతరం ఇంధనాలను తీసుకురావడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అగ్రగామి వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్తో పాటు పూర్తిగా ఇథనాల్తో కూడా నడిచే ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును త్వరలో భారత మార్కెట్కు తీసుకురానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మారుతి సుజుకి సంస్థ ఇటీవల జపాన్లో జరిగిన మొబిలిటీ ఎక్స్పో 2025లో ఈ సరికొత్త ఫ్రాంక్స్ కారును ప్రదర్శించింది. ఈ ఫ్రాంక్స్ కారును ఫ్లెక్స్ ఫ్యూయెల్ రూపంలో విడుదల చేయబోతున్నామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కారులో 1.2 లీటర్, 1.5 లీటర్ కెపాసిటీ గల రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. ఈ రెండు ఇంజిన్లు కూడా పూర్తిగా ఫ్లెక్స్ ఫ్యూయెల్తో నడిచే కెపాసిటీ కలిగి ఉంటాయి. ఈ కొత్త కారు 2026 నాటికి అమ్మకాలకు వచ్చే అవకాశం ఉంది.

ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్ ప్రస్తుతం మన దేశంలో లభిస్తున్న ఇ20 పెట్రోల్లో (అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) మాత్రమే కాకుండా, పెట్రోల్లో ఇథనాల్ శాతం మరింత ఎక్కువగా ఉన్నా కూడా సమర్థవంతంగా పనిచేసేలా తయారుచేశారు. ఇక 1.5 లీటర్ ఇంజిన్ అయితే ఏకంగా పెట్రోల్ను అస్సలు వాడకుండా, పూర్తిగా ఇథనాల్ తో కూడా నడిచే విధంగా రూపొందించారు. దీని వలన భవిష్యత్తులో ఇథనాల్ లభ్యత పెరిగినా, ధరలు తగ్గినా కస్టమర్లకు పెద్ద ప్రయోజనం ఉంటుంది.
సాధారణంగా పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల మైలేజ్ తగ్గుతుందని చాలామంది వాహనదారులు భావిస్తున్నారు. కొన్ని కంపెనీలు కూడా ఇ20 పెట్రోల్ వాడటం వల్ల వాహనం పర్ఫామెన్స్ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పాయి. మారుతి సంస్థ ఈ సమస్యకు పరిష్కారంగానే ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును తీసుకువస్తోంది.

సాధారణ పెట్రోల్ ఇంజిన్లో ఇథనాల్ వాడితే, అది గాలిలోని తేమను లాక్కొని, ఇంధనం సరఫరా అయ్యే మార్గాలలో తుప్పు పట్టేలా చేయవచ్చు. కానీ, ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లలో ఇథనాల్ను తట్టుకునే కెపాసిటీ ఉన్న లోహాలను ఉపయోగించి ఈ సమస్యను పూర్తిగా నివారిస్తారు.
మారుతి సుజుకి ఈ ఫ్రాంక్స్ కార్లను గుజరాత్లోని తమ ప్లాంట్లో తయారు చేసి, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. కాబట్టి, ఇది జపాన్లో ప్రదర్శించబడినా, భారత్లో త్వరగా విడుదలవుతుందని ఆశించవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల తయారీని మారతి ప్రారంభించే అవకాశం ఉంది.

ఇది మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇంధనాల లభ్యత కోసం, మారుతి సంస్థ పాల సహకార సంఘాల ద్వారా బయోగ్యాస్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రయత్నంలో కూడా ఉంది. ఇక్కడ తయారుచేసిన గ్యాస్ను సీఎన్జీగా కూడా వాడుకోవచ్చు. ఇథనాల్ వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో మారుతి తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశం పెట్రోల్ కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.


Click it and Unblock the Notifications








