ఇక ఎదురు చూపులు ముగిసినట్లే కొత్త మారుతి ఎర్టిగా షోరూంలకు వచ్చేసింది..ఈ సారి మైలేజ్ ఎంతో తెలుసా ?
మారుతి ఎర్టిగా.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ ఎమ్పీవీలలో ఒకటి. తన సెగ్మెంట్లో టయోటా రుమియన్, కియా కారెన్స్ వంటి మోడళ్లను కూడా వెనక్కి నెట్టి ఈ కారు భారీ డిమాండ్ను సాధించింది. ఇప్పుడు ఈ కారు కొత్త మోడల్ అంటే 2025 ఎర్టిగా షోరూమ్లకు చేరుకుంది. ఈ కొత్త మోడల్ అనేక అద్భుతమైన అప్డేట్లు, సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. మీరు కొత్త ఎర్టిగా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కొత్త 2025 ఎర్టిగాను దాని పొడవైన రూఫ్ మౌంటెడ్ రేర్ స్పాయిలర్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఇది కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇస్తుంది. కొత్త మోడల్ పొడవు 40 మి.మీ. పెరిగింది. ఇప్పుడు దీని మొత్తం పొడవు 4,435 మి.మీ. దీని వల్ల కారులోపల మరింత విశాలమైన స్థలం లభిస్తుంది.

బయటి భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్లు, కొత్త టెయిల్గేట్, రేర్ క్వార్టర్ ప్యానెల్లు కూడా మార్చబడ్డాయి. ఈ మార్పులు మినహా ముందు గ్రిల్ డిజైన్, లైటింగ్ సెటప్ లాంటి చాలా ఫీచర్లు పాత మోడల్ మాదిరిగానే ఉన్నాయి. కొత్త 2025 మారుతి ఎర్టిగా అన్ని వేరియంట్లలో ఇప్పుడు స్టాండర్డ్ ఫీచర్గా 6 ఎయిర్బ్యాగ్లను అందిస్తున్నారు. ఇది సేఫ్టీ పరంగా ఒక పెద్ద అప్డేట్.
ఇంతకు ముందు మోడల్లో తక్కువ వేరియంట్లలో 2 ఎయిర్బ్యాగ్లు, టాప్ వేరియంట్లో 4 ఎయిర్బ్యాగ్లు మాత్రమే ఉండేవి. దీంతో ఇప్పుడు ప్రతి వేరియంట్లోనూ ప్రయాణికులకు మెరుగైన భద్రత లభిస్తుంది. అంతేకాకుండా, టాప్ మోడల్లో TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) కూడా ఉంది. అన్ని 7 సీట్లలో ఇప్పుడు 3-పాయింట్ సీట్బెల్ట్లను కూడా ఇచ్చారు.

పాత మోడల్లో రెండో వరుసలోని మధ్య ప్రయాణికుడికి కేవలం ల్యాప్ బెల్ట్ మాత్రమే ఉండేది. కొత్త 2025 ఎర్టిగాలో ఏసీ సెటప్లో కూడా మార్పులు చేశారు. రెండో మరియు మూడో వరుస ప్రయాణికులకు మెరుగైన కూలింగ్ లభించేలా ఈ మార్పులు చేశారు. పాత మోడల్లో రూఫ్-మౌంటెడ్ ఏసీ వెంట్ ఉండేది. కానీ ఇప్పుడు రెండో వరుస ఏసీ వెంట్లను ముందు సెంటర్ కన్సోల్లో అమర్చారు.
దీనివల్ల మధ్య వరుసలో కూర్చునే వారికి గాలి మరింత వేగంగా అందుతుంది. ఏసీ వెంట్ కింద రెండు టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉన్నాయి. మూడో వరుస ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా ఏసీ వెంట్లను ఏర్పాటు చేశారు, అవి అడ్జస్టబుల్ ఫ్యాన్ స్పీడ్తో వస్తాయి. మూడో వరుసలో రెండు టైప్-సీ యూఎస్బీ పోర్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో పీఎం 2.5 ఫిల్టర్ను కూడా జోడించారు.

2025 మారుతి ఎర్టిగాలో పాత మోడల్లో ఉన్న 1.5-లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్నే ఉపయోగించారు. ఇది 103 పీఎస్ పవర్, 139 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది.
అంతేకాకుండా, ఎర్టిగా సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 87 పీఎస్ పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కి.మీ మైలేజ్ ఇస్తే, సీఎన్జీ వెర్షన్ దాదాపు కిలోకు 26.11 కి.మీ మైలేజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








