అలాంటి డ్రైవింగ్కి పైసా కూడా ఇవ్వద్దని కోర్టు ఆదేశం! వాహన యజమానులకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక!
వాహన బీమా పరిధి, బాధ్యతలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వాహనాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యం లేదా వారి స్వంత తప్పిదం కారణంగా జరిగే ప్రమాదాలపై బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తన తీర్పులో తాజాగా స్పష్టంగా తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే, జూన్ 18, 2014న కర్ణాటకకు చెందిన రవీషా తన కుటుంబంతో కలిసి ఒక సాధారణ ప్రయాణానికి బయలుదేరాడు. అరషిగరే నుంచి మల్లచంద్రకు వెళ్ళే రోడ్డుపై తన సొంత కారులో అతను తండ్రి, సోదరి, ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ రోజు దురదృష్టం కూడా వారితోనే ప్రయాణం చేసింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో రవీషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. తరువాత ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే రవీషాకు గాయల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన మరణించారు. మిగిలిన వారు మాత్రం గాయాలతో ప్రాణపాయం నుంచి తప్పించుకోగలిగారు. రవీషా చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదానికి ఆయన కారును వేగంగా డ్రైవ్ చేయడమేనని సంఘటనను బట్టి కొందరు తెలిపారు.

కారు వెలుతున్న టైంలో స్టీరింగ్ తిప్పడంతో ఒక్కసారిగా అది బోల్తా పడింది. రవీషా మరణించిన తరువాత కారు బీమా కోసం క్లెయిమ్ చేయగా, బీమా కంపెనీ కారు ఓనర్, అదే సమయంలో డ్రైవర్ అయిన రవీషా తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఎలాంటి పరిహారం చెల్లించమని స్పష్టం చేసింది. బీమా షరతుల్లో డ్రైవర్ నిర్లక్ష్యం, తప్పిదం వల్ల సంభవించే ప్రమాదాలకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.
ఈ కారణాన్ని చూపుతూ బీమా కంపెనీ పరిహారం చెల్లించడానికి నిరాకరించడంతో దీనిపై రవీషా భార్య, కుమారుడు సవాలు చేస్తూ కోర్టులో కేసు వేశారు. కర్ణాటక హైకోర్టు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించింది. వాదనలు, సాక్ష్యాలు అన్ని విన్న తర్వాత, 2023 నవంబర్లో హైకోర్టు తుది తీర్పు చెప్పింది. రవీషా పొరపాటు, నిర్లక్ష్యం ప్రధాన కారణమని, ఆ పరిస్థితిలో బీమా కంపెనీని పరిహారం చెల్లించమనడం సరి కాదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది.

దీనితో రవీషా భార్య, కుమారుడు చివరి దారిని ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్గా పరిశీలించింది. బీమా పాలసీ షరతులు, వాహన యజమాని బాధ్యతలు, బీమా పరిధి వీటన్నింటినీ క్షణ్ణంగా పరిశీలించింది. చివరికి, హైకోర్టు తీర్పుకే సమ్మతం తెలిపింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించడంతో, బీమా కంపెనీకి పరిహారం చెల్లించే బాధ్యత ఉండదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు వాహన బీమా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. వాహన యజమానులు జాగ్రత్తగా వాహనం నడపకపోవడం, బీమా షరతులను అర్థం చేసుకోకపోవడం ఏ విధమైన పరిణామాలకు దారితీస్తుందో దీనివల్ల స్పష్టమైంది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికీ శ్రద్ధ అవసరమని ఇది మరోసారి గుర్తు చేసింది.

వాహన బీమా అనేది ఒక రక్షణ కవచం మాత్రమే, కానీ అది అన్ని పరిస్థితుల్లో పనిచేస్తుందనుకోవడం పొరపాటు. బీమా పాలసీ ముఖ్య ఉద్దేశం, అనుకోని ప్రమాదాల నుండి ఆర్థిక నష్టాన్ని తక్కువ చేయడం. కానీ ఆ ప్రమాదం మీ స్వంత నిర్లక్ష్యం వల్ల, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించడం వల్ల, లేదా వేగం పరిమితులను దాటడం లాంటివి చేయడం వల్ల జరిగితే, బీమా కంపెనీకి పరిహారం చెల్లించే బాధ్యత ఉండదు.


Click it and Unblock the Notifications








