టాటా సేల్స్ సునామీ.. పండుగ సీజన్లో భారీగా వచ్చిన జనాలతో కిక్కిరిసిన షోరూమ్లు
2025 అక్టోబర్ నెల భారత ఆటోమొబైల్ రంగానికి నిజంగా చరిత్రాత్మకంగా నిలిచింది. పండుగ సీజన్ రద్దీ, కొత్తగా ప్రవేశపెట్టిన GST 2.0 విధానం, వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం కలిసి ఈ నెలను పరిశ్రమకు స్వర్ణయుగంలా మార్చేశాయి. ప్రతినెల ముగియగానే మార్కెట్లో వాహనాల సేల్స్కు సంబంధించిన గణంకాలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈక్రమంలో అక్టోబర్ సేల్స్ సంఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. వాహన్ డేటా ప్రకారం, నాలుగు చక్రాల వాహనాల అమ్మకాలు మాత్రమే కాదు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా అద్భుతమైన స్థాయిలో నమోదయ్యాయి. ఈ సానుకూల వాతావరణంలో కంపెనీల ర్యాంకింగ్స్లోనూ ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మారుతి సుజుకి ఎప్పటిలాగే అమ్మకాల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, ఈసారి టాటా మోటార్స్ రెండవ స్థానానికి ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇదే సమయంలో మరో దిగ్గజ కంపెనీలు హ్యుందాయ్, మహీంద్రాలపై ఆధిపత్యాన్ని సాధిస్తూ, టాటా ఈ అక్టోబర్లో అత్యుత్తమ నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది. కంపెనీ మొత్తం 74,705 వాహనాలను విక్రయించింది, ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే అత్యధిక నెలవారీ రిటైల్ అమ్మకాల సంఖ్యగా భావించవచ్చు. ఇది కేవలం ఒక నెలలోనే 81.5% వృద్ధి అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సెప్టెంబర్లో కంపెనీ 41,151 వాహనాలను మాత్రమే విక్రయించింది.

సంవత్సరం ప్రాతిపదికన చూస్తే కూడా ఈ వృద్ధి 12% కంటే ఎక్కువగా ఉంది, ఇది భారత ఆటోమోటివ్ మార్కెట్లో టాటా స్థిరమైన ఎదుగుదలకు సంకేతం. ఇక ట్రెండ్ పరంగా పరిశీలిస్తే, టాటా అమ్మకాలు గత మూడు నెలలుగా నిరంతరంగా పెరుగుతున్నాయి. ఆగస్టులో 38,286 వాహనాలను విక్రయించిన కంపెనీ, అక్టోబర్ నాటికి దాదాపు రెట్టింపు స్థాయికి 74,705 యూనిట్లకు చేరుకుంది. అంటే కేవలం మూడు నెలల్లో 1.9 వేగంతో వృద్ధి సాధించింది.
ఈ అద్భుతమైన ఫలితాల వెనుక టాటా మోటార్స్ విస్తృతమైన ఉత్పత్తి శ్రేణి, కొత్త సేఫ్టీ అప్డేట్స్, గ్రీన్ టెక్నాలజీ వైపు దూసుకుపోతున్న దిశ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పండుగ డిమాండ్, ప్రభుత్వ పన్ను రాయితీలు , పెరుగుతున్న వినియోగదారుల నమ్మకం కలిసి ఈ వృద్ధికి బలమైన పునాది వేశాయి. మొత్తం మీద అక్టోబర్ నెల టాటా మోటార్స్కే కాకుండా భారత ఆటోమొబైల్ రంగానికీ ఒక కొత్త రికార్డుల మైలురాయిగా నిలిచింది.

2025 అక్టోబర్ నెలలో టాటా మోటార్స్ గణనీయమైన అమ్మకాలతో హ్యుందాయ్, మహీంద్రా రెండింటినీ స్పష్టమైన తేడాతో అధిగమించింది. టాటా మొత్తం 74,705 యూనిట్లను విక్రయించగా, ఇది మహీంద్రా కంటే 7,905 యూనిట్లు, హ్యుందాయ్ కంటే 9,660 యూనిట్లు ఎక్కువ. ఈ పెరుగుదలతో టాటా మోటార్స్ రెండో స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా, పరిశ్రమలో తన బలమైన స్థిరత్వాన్ని మరలా నిరూపించింది.
అయితే టాటా మాత్రమే కాకుండా, హ్యుందాయ్, మహీంద్రా కంపెనీలు కూడా ఈ నెలలో మంచి వృద్ధిని నమోదు చేశాయి. సెప్టెంబర్లో 37,659 యూనిట్లను విక్రయించిన మహీంద్రా, అక్టోబర్లో అమ్మకాలను 66,800 యూనిట్లకు పెంచి దాదాపు 77 శాతం వృద్ధి సాధించింది. ఇదే సమయంలో హ్యుందాయ్ అమ్మకాలు కూడా 35,812 యూనిట్ల నుండి 65,045 యూనిట్లకు పెరిగి 81 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమలో టాటా, హ్యుందాయ్, మహీంద్రా ఈ పండుగ సీజన్లో తమ ఉత్పత్తులపై గట్టి డిమాండ్ను సృష్టించడంలో విజయవంతమయ్యారు. SUV సెగ్మెంట్లో వినియోగదారుల ఆసక్తి, కొత్త మోడళ్ల విడుదలలు, బ్యాంకింగ్ ఆఫర్లు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా మారాయి. మొత్తానికి, అక్టోబర్ 2025 భారత ఆటోమొబైల్ రంగానికి అత్యంత చురుకైన నెలగా నిలిచింది, అందులో టాటా మోటార్స్ తన శక్తితో అమ్మకాలను మరింత బలపరచుకుంది.


Click it and Unblock the Notifications








