ఎలాన్ మస్క్ ప్లాన్ సక్సెస్.. ముంబై, ఢిల్లీలో టెస్లా షోరూమ్స్.. వచ్చే నెలలోనే ఓపెనింగ్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా మనదేశంలో తన మొదటి షోరూమ్ను జులై మధ్య నాటికి ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించడానికి రెడీగా ఉంది. దాదాపు అదే సమయంలో ఢిల్లీలో కూడా మరో షోరూమ్ రాబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కంపెనీ టెస్లా ఇండియా మార్కెట్లోకి వస్తుందని గత కొన్నాళ్లుగా వార్తలు వింటున్నాం.
ఇప్పుడు, వచ్చే 2-3 వారాల్లో టెస్లా కార్ల అమ్మకాలు, కార్యకలాపాలను ప్రారంభించబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముంబై, ఢిల్లీలోని డీలర్షిప్లు మోడల్ వైని భారతీయ కొనుగోలుదారులకు మొదటి టెస్లా ఈవీగా అమ్మడం ప్రారంభిస్తాయి. మోడల్ వై ఎలక్ట్రిక్ ఎస్యూవీల మొదటి సెట్ చైనాలోని కంపెనీ ఫ్యాక్టరీ నుండి ఇండియాకు దిగుమతి అయింది.

కొన్ని యూనిట్ల రియర్-వీల్-డ్రైవ్ మోడల్ వైతో పాటు, టెస్లా తన సూపర్ ఛార్జర్ నెట్వర్క్లోని కొన్ని భాగాలను కూడా అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి ఇండియాకు దిగుమతి చేసుకుంది. అంతేకాదు, స్పేర్ పార్ట్స్, యాక్ససరీస్, మర్చండైస్ కూడా మన దేశంలోకి వచ్చాయి. అంటే, టెస్లా వచ్చే నెలలో అమ్మకాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది.
దేశీయంగా తయారుచేయడం, దిగుమతి సుంకాల విషయంలో ప్రభుత్వంతో విభేదాల కారణంగా టెస్లా ఇండియాలో ఎంట్రీ ఇవ్వడానికి ఇంతకాలం వెనకాడుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత, భారత కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది.

ఈ పాలసీ ప్రకారం ఆటోమొబైల్ కంపెనీలు మూడేళ్లలోపు ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టి, స్థానికంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి ఒప్పుకుంటే, దిగుమతి సుంకాలు తక్కువగా ఉంటాయి.
బ్లూమ్బెర్గ్ ద్వారా అందిన డాక్యుమెంట్ల ప్రకారం.. ఐదు యూనిట్ల టెస్లా మోడల్ వై షాంఘై ఫ్యాక్టరీ నుంచి ముంబైకి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల ఖర్చు రూ.2.77 మిలియన్లు (31,988డాలర్లు) అని చెప్పారు. ఈ ఎస్యూవీలకు పడిన దిగుమతి సుంకం రూ.2.1 మిలియన్లు. మోడల్ వై ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు.

టెస్లా మోడల్ వై ధర ఇండియాలో సుమారు రూ.49 లక్షలు ($56,000) ఉంటుందని అంచనా. అయితే, లాంచ్ తేదీ దగ్గర పడేసరికి కంపెనీ తుది ధరను నిర్ణయిస్తుంది. కానీ, ఇది సుమారు రూ.50 లక్షలు (ఎక్స్-షోరూమ్), అటుఇటుగా ఉండొచ్చు. మోడల్ వై అమెరికా మార్కెట్లో రూ.39 లక్షలకు ($44,990) అమ్ముడవుతోంది. అంతేకాదు, ప్రభుత్వ సబ్సిడీలు, పన్ను రాయితీలు పోగా, కొనుగోలుదారులు సుమారు రూ.32 లక్షలు ($37,490) చెల్లిస్తారు.
ఇండియా విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఇది కేవలం 5 శాతం మాత్రమే. అయితే, ప్రీమియం మోడల్స్ అయితే, మొత్తం కొత్త కార్ల అమ్మకాల్లో కేవలం 2 శాతం మాత్రమే ఉంటాయి. కాబట్టి, మోడల్ వై ధరను తెలివిగా నిర్ణయించడం, కొనుగోలుదారులకు ఇది ఒక వాల్యూ-ఫర్-మనీ డీల్గా కనిపించేలా చేయడం టెస్లాకు అతిపెద్ద సవాలుగా మారనుంది.


Click it and Unblock the Notifications








