31 రోజుల్లో 34,236 కార్లు కొనేశారు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కంపెనీ కార్లే కావాలంటున్నారు
పండుగ సీజన్కు గేట్వేగా ఆగస్టు నెల నిలిచింది. పండుగ సీజన్ స్టార్ట్ కావడంతో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేసి లేదా బుక్ చేసి ఉంటారు. ఈ నేపథ్యంలో గత నెల అమ్మకాల గణాంకాలను తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది. టయోటా కిర్లోస్కార్ మోటార్ (TKM) 2025 ఆగస్టు నెల అమ్మకాల నివేదికను ఇప్పుడు విడుదల చేసింది.
గత కొన్ని నెలలుగా ఈ జపనీస్ వాహన తయారీ సంస్థ భారతదేశంలో భారీ అమ్మకాలు సాధిస్తోంది. ఆగస్టులో కూడా ఇది కొనసాగింది. 2025 ఆగస్టులో టయోటా అమ్మకాల నివేదిక గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2025 ఆగస్టు నెలలో టయోటా కిర్లోస్కార్ మోటార్స్ మొత్తం 34,236 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో 29,302 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించగా, 4,934 యూనిట్లను ఎగుమతి చేసింది. 2024 ఆగస్టులో కంపెనీ 30,879 యూనిట్లను విక్రయించగా, 2025 ఆగస్టులో 11 శాతం వార్షిక వృద్ధి సాధించి 34,236 యూనిట్లకు చేరుకుంది.
2024 ఆగస్టులో భారతీయ మార్కెట్లో టయోటా అమ్మకాలు 28,589 యూనిట్లు కాగా, 2025 ఆగస్టులో వార్షికంగా 2.49 శాతం వృద్ధి సాధించి 29,302 యూనిట్లకు పెరిగాయి. 2025 జూలైతో పోలిస్తే స్వల్ప వృద్ధి ఉంది. గత నెలలో అంటే 2025 జూలైలో దేశంలో టయోటా అమ్మకాలు 29,159 యూనిట్లు.

2025 జనవరి నుండి ఆగస్టు వరకు అమ్మకాలను పరిశీలిస్తే, టొయోటా ఇప్పటివరకు మొత్తం 2,41,696 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే (2,12,785 యూనిట్లు) 13.59% ఎక్కువ. ఈ గణాంకాలు కంపెనీ వృద్ధిని సూచిస్తున్నాయి. కస్టమర్ల నమ్మకమే తమ అతిపెద్ద బలం అని టయోటా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్) వరీందర్ వాధ్వా అన్నారు.
ఆగస్టులో తాము 34,236 యూనిట్లను విక్రయించామని, ఇప్పుడు పండుగ సీజన్లో వినియోగదారులకు మరింత సులభంగా, ప్రత్యేకమైన కార్ల కొనుగోలు అనుభవాన్ని అందించడంపై దృష్టి పెడుతున్నామని చెప్పారు.

ఆగస్టు నెలలో టయోటా ముఖ్యమైన హైలైట్స్ చూస్తే కంపెనీ అర్బన్ క్రూయిజర్ టైసర్ (Urban Cruiser Taisor)ని అప్డేట్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీకి ఇప్పుడు కొత్త బ్లూయిష్ బ్లాక్ రంగు, అన్ని వేరియంట్లలో స్టాండర్డ్గా 6 ఎయిర్బ్యాగ్లు లభించాయి. దీనితో పాటు, క్యామ్రీ హైబ్రిడ్ స్ప్రింట్ ఎడిషన్ (Camry Hybrid Sprint Edition)ను కూడా ఇటీవల విడుదల చేసింది. ఈ వాహనం రూ. 48.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి వచ్చింది.
క్యామ్రీ రెండు దశాబ్దాల భారతీయ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎడిషన్ రూపొందించబడింది. ఇందులో డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్, మ్యాట్ బ్లాక్ అలోయ్ వీల్స్, ముందు వెనుక బాడీ కిట్లు, వెనుక స్పాయిలర్ వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంకా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ అయిన ఇన్నోవా తన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఎంపీవీ సెగ్మెంట్లో కింగుగా నిలిచిన ఇన్నోవా ఇప్పటికే 12 లక్షల మంది కస్టమర్లను చేరుకుంది. క్వాలిస్ మోడల్ స్థానంలో వచ్చిన ఇన్నోవా మొదట రూ. 7 లక్షలకు లాంచ్ అయింది.
ఇప్పుడు దాని ధర రూ. 40 లక్షలకు చేరింది. అయితే, దాని సౌకర్యం, వారసత్వం కారణంగా ఎంత ధర ఉన్నా కొనుగోలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొత్త తరం ఇన్నోవా హైబ్రిడ్ ఇంజిన్తో మరింత మెరుగైన మైలేజీని అందిస్తోంది.


Click it and Unblock the Notifications








