మారుతి అండతో దూసుకుపోతున్న టయోటా! అమ్మకాల్లో తొలిసారి ఆ మ్యాజిక్ నంబర్ దాటేసింది!
భారతీయులకు టయోటా అంటే ప్రత్యేకమైన అభిమానం. మారుతి సుజుకితో స్నేహం కుదిరిన తర్వాత టయోటాకు అన్నీ మంచి శుభవార్తలే వస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం ముగియడంతో టయోటా అమ్మకాల గణాంకాలు విడుదల అయ్యాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జపనీస్ వాహన తయారీదారు భారతదేశంలో భారీ విజయాన్ని నమోదు చేసింది.
టయోటా ఫార్చ్యూనర్, ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు భారతీయ మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. 2025 మార్చి, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టొయోటా అమ్మకాల గణాంకాలను ఈ కథనంలో వివరంగా పరిశీలిద్దాం.

2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,37,148 యూనిట్లను విక్రయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,63,512 యూనిట్లతో పోలిస్తే ఇది 28 శాతం వృద్ధిని సూచిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఎన్నడూ లేనంత అత్యధిక వార్షిక విక్రయాలను నమోదు చేసింది. 2025 మార్చిలో కంపెనీ 30,043 కార్లను విక్రయించింది. 2024 మార్చిలో విక్రయాలు 27,180 యూనిట్లు మాత్రమే. వార్షిక ప్రాతిపదికన ఇది 11శాతం వృద్ధి.
2025 మార్చిలో కంపెనీ దేశీయంగా 28,373 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 1,670 యూనిట్లను ఎగుమతి చేసింది. టయోటా అభిప్రాయం ప్రకారం...కంపెనీ విజయంలో SUVలు, MPVలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గ్లాంజా హ్యాచ్బ్యాక్, హైలక్స్ పిక్-అప్ ట్రక్, కామ్రీ సెడాన్ మినహా టయోటా చాలా మోడల్స్ SUV లేదా MPV తరగతికి చెందినవే.

గతేడాదితో పోలిస్తే ఈ విభాగాలలో టయోటా 35 శాతం వృద్ధిని సాధించింది. ఇది భారతీయ డ్రైవింగ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉన్న మోడల్స్కు బలమైన డిమాండ్ను ప్రతిబింబిస్తుంది. కంపెనీ ఎగుమతులు 59శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా టయోటా వ్యూహాత్మక ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా భారతదేశం స్థానం పెరుగుతోందనడానికి ఈ విజయాలు సూచన.
భారతదేశంలోని టైర్ 2 , టైర్ 3 నగరాల్లో టొయోటా కార్లకు డిమాండ్ పెరిగిందని కంపెనీ చెబుతోంది. రీబ్యాడ్జ్ చేసిన మారుతి సుజుకి మోడల్స్ సహాయంతో టయోటా కార్లు మరింత అందుబాటులోకి ఈ ప్రాంతాలలో ఎక్కువ అమ్మకాలు సాధించడానికి సహాయపడుతోందని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో అత్యధిక అవకాశాలు ఉన్నది ఇక్కడే.

ప్రస్తుతం భారతదేశంలో పదకొండు టొయోటా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్ను కూడా కలిపితే అది పన్నెండు అవుతుంది. అయితే, అత్యంత సరసమైన ధరలో లభించే నాలుగు మోడల్స్ రీబ్యాడ్జ్ చేసిన మారుతి సుజుకి కార్లే. అవి గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, రూమియన్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్.
అసలైన టయోటా లైనప్ ఇన్నోవా హైక్రాస్తో ప్రారంభమవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.19.09 లక్షలు కాబట్టి సాధారణ భారతీయులు దీని గురించి ఆలోచించకపోవచ్చు. LC 300, కామ్రీ హైబ్రిడ్ అనేవి టయోటా ఇటీవల విడుదల చేసిన కార్లు. అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి ప్రజాదరణ పొందిన ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంది.

''టీ కేర్, టీ గ్లోస్ వంటి సమగ్రమైన ఓనర్షిప్ సొల్యూషన్స్ ద్వారా కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచగలిగాము. హైబ్రిడ్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్, వృద్ధి కూడా దీనికి కారణమని TKMలోని సేల్స్-సర్వీస్-యూస్డ్ కార్ బిజినెస్ అండ్ ప్రాఫిట్ ఎన్హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వ తెలిపారు.
విదేశీ మార్కెట్లలో కూడా భారతీయంగా తయారైన టయోటా కార్లకు బలమైన డిమాండ్ ఉంది. 2027 నాటికి ఇంజనీర్ల సంఖ్యను 200 నుంచి 1,000కి పెంచే ప్రణాళికలతో టొయోటా భారతదేశంలో తన మొదటి పరిశోధన , డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించబోతోంది. హైబ్రిడ్ కార్లతో సహా వాటికి ప్రాధాన్యతనిస్తూ స్థాపించనున్న ఈ కేంద్రం దేశానికి ఒక ఆస్తిగా మారుతుంది.


Click it and Unblock the Notifications








