1.82 సెకన్లలో 100 కి.మీ..రాకెట్ కంటే స్పీడ్..భారత్ సత్తా చాటడానికి మహింద్రా కొత్త రేసింగ్ బీస్ట్ రెడీ
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన మహీంద్రా (Mahindra) ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ప్రపంచంలో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్లో తమ అత్యాధునిక రేసింగ్ కారు ఎం12 ఎలక్ట్రో(M12 Electro)ను విడుదల చేసింది. ఈ కారును 2026 చివరిలో మొదలయ్యే సీజన్ కోసం రూపొందించారు.
ఈ సందర్భంగా 2030 సంవత్సరం వరకు జరగబోయే ప్రతి ఫార్ములా-ఈ రేసులోనూ తాము పాల్గొంటామని మహింద్రా ప్రకటించింది. మహీంద్రా సంస్థ మహింద్రా రేసింగ్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ రేస్ టీమ్ను చాలా సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతోంది. ఈ పోటీ మొదలైనప్పటి నుంచి (గత 12 ఏళ్లుగా) ఇందులో పాల్గొంటున్న ఏకైక భారతీయ జట్టు ఇదే కావడం మన దేశానికి గర్వకారణం.

ఇప్పటివరకు ఈ టీం 29 సార్లు పోడియం దక్కించుకుంది.. 11 పోల్ పొజిషన్లు సాధించింది. గత 11వ సీజన్లో కూడా 4వ స్థానంతో మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ విజయాల స్ఫూర్తితోనే కొత్త కారును మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దింది.
మహీంద్రా తయారు చేసిన ఈ ఎం12 ఎలక్ట్రో కారు డిజైన్ చాలా స్టైలిష్గా, మెటాలిక్ రెడ్, గ్లాసీ వైట్, కార్బన్ బ్లాక్ రంగుల్లో ఉంది. ఈ కారుపై ఉన్న 12 డిజైన్ గీతలు, మహింద్రా ఫార్ములా-ఈలో పాల్గొంటున్న 12 సంవత్సరాల ప్రయాణాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా భారతీయ జట్టుగా తమ దేశం పట్ల గౌరవంతో ఈ కారుపై భారత జాతీయ జెండాను కూడా ముద్రించారు.

ఈ కారులో ఉపయోగించిన టెక్నాలజీ అద్భుతంగా ఉంది. ఇందులో 600KW సామర్థ్యం గల అల్ట్రా ఫాస్ట్ చార్జర్ను ఉపయోగించవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ కారు బ్యాటరీ కేవలం 24 సెకన్లలో 10% ఛార్జ్ ఎక్కుతుంది.
రేసింగ్ కారుకు వేగం చాలా ముఖ్యం. ఎం12 ఎలక్ట్రో విషయంలో మహీంద్రా ఆ విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఈ కారు గరిష్టంగా గంటకు 322 కి.మీ (200 మైళ్లు) వేగంతో దూసుకుపోగలదు. ఇంత వేగం అందుకోవడానికి ఈ కారును లైట్ వెయిట్తో రూపొందించారు. డ్రైవర్తో కలిపినా మొత్తం బరువు 860 కిలోలు మాత్రమే ఉంటుంది.

ముఖ్యంగా ఈ కారు పికప్ అద్భుతం. నిలకడగా ఉన్న కారు కేవలం 1.82 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ (0-60 మైళ్లు) వేగాన్ని అందుకుంటుంది. సాధారణ కార్లలో ఇది సాధ్యం కాదు. ఈ కారులో ఉన్న పవర్, బ్యాటరీ నుంచి వీల్కు దాదాపు 98 శాతం ట్రాన్స్ఫర్ అవుతుంది.
అంతేకాకుండా క్వాలిఫయింగ్ రేసుల సమయంలో ఎక్కువ పట్టు కోసం, దీనిని 4 వీల్ డ్రైవ్ ఆప్షన్తో ఉపయోగించేలా తయారు చేశారు. ఈ అడ్వాన్సుడ్ టెక్నాలజీతో మహింద్రా వచ్చే సీజన్లో టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎం12 ఎలక్ట్రో కారు పనితీరును మరింత మెరుగుపరచడానికి, మహింద్రా సంస్థ వోల్వోలైన్ (Valvoline) అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా వోల్వోలైన్ సంస్థ కారుకు సరికొత్త తరం గేర్ బాక్స్ టెక్నాలజీని అందించనుంది. దీనివల్ల కారు మైలేజ్, వేగం మరింత పెరుగుతుందని అలాగే రేసుల్లో కారు సామర్థ్యం అద్భుతంగా ఉంటుందని మహింద్రా టీం ఆశాభావం వ్యక్తం చేసింది.
గత సీజన్లో సాధించిన 4వ స్థానం కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చి, తప్పకుండా టైటిల్ గెలవాలనే పట్టుదలతో మహింద్రా ఉంది. అందుకే తమ డ్రైవర్ల జట్టును కూడా మార్చకుండా వారితోనే ఈ కొత్త కారులో రేసులకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications








