టెస్లాకు పోటీగా వియత్నాం ఎలక్ట్రిక్ కారు.. ఇండియాలో భారీ ప్లాంట్.. 7-సీటర్ ఎస్యూవీ కోసం పేటెంట్!
ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి ఇప్పుడు మంచి సమయం నడుస్తోంది. స్వదేశీ బ్రాండ్లతో పాటు, కొన్ని ప్రపంచ స్థాయి విదేశీ కంపెనీలు కూడా భారత మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. అమెరికన్ ఈవీ దిగ్గజం టెస్లా రాక దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే, టెస్లాకు విదేశీ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఇప్పుడు భారతదేశంలో కూడా అడుగుపెట్టింది.
టెస్లా విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలనుకుంటుంటే, విన్ఫాస్ట్ మాత్రం ఏకంగా ఇక్కడే తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలను ప్రారంభించడం విశేషం. ఈ వ్యూహం కంపెనీకి ఎంతగానో లాభం చేకూర్చే అవకాశం ఉంది. విన్ఫాస్ట్ తమిళనాడులోని టూటికోరిన్లో తమ ఈవీ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ను ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.

భారత మార్కెట్లో తమ ఉనికిని పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో విన్ఫాస్ట్ అనేక ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మొదటగా, VF 6 మరియు VF 7 అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ కార్లను ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లోని కొన్ని మాల్స్లో ప్రదర్శించింది. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో డీలర్షిప్లను కూడా తెరిచింది.
విన్ఫాస్ట్ కంపెనీ తమ VF 6, VF 7 మోడల్స్కు సంబంధించిన కొన్ని వివరాలను ఇప్పటికే వెల్లడించింది. అయితే, ధరల వివరాలను మాత్రం ఇంకా రహస్యంగా ఉంచింది. త్వరలోనే ధరలను ప్రకటిస్తామని, డెలివరీలు కూడా ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఈ రెండు మోడల్స్ ధరలు వరుసగా రూ. 25 లక్షలు మరియు రూ. 50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. తూత్తుకూడిలోని ప్లాంట్లో ఈ కార్ల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైనట్లు విన్ఫాస్ట్ వెల్లడించింది.

విన్ఫాస్ట్ భారత ఈవీ మార్కెట్లో ప్రారంభ దశలోనే సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తమ పోర్ట్ఫోలియోను విస్తరించాలని చూస్తోంది. తాజాగా, మూడు వరుసల సీట్లు ఉండే ఒక ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం కంపెనీ పేటెంట్ దరఖాస్తు చేసుకున్నట్లు టీమ్ బీహెచ్పీ నివేదిక తెలిపింది. ఇది 6 లేదా 7 సీట్ల ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం భారతదేశంలో 7-సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. కానీ, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఈ తరహా కార్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అవసరాన్ని గుర్తించి విన్ఫాస్ట్ ఒక ఫ్యామిలీ ఈవీని తీసుకొస్తే, కచ్చితంగా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. విన్ఫాస్ట్ తూత్తుకూడిలోని తమ ప్లాంట్లో కేవలం భారత మార్కెట్ కోసమే కాకుండా, విదేశాలకు కూడా కార్లను తయారు చేయనుంది.

ఇతర అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీల మాదిరిగానే, ఈ ప్లాంట్ను ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా దేశాలకు కార్లను ఎగుమతి చేసే ముఖ్యమైన కేంద్రంగా మార్చాలని విన్ఫాస్ట్ యోచిస్తోంది. ఒకవేళ కంపెనీ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న 7-సీటర్ ఎస్యూవీని నిజంగానే మార్కెట్లోకి తీసుకొస్తే, దాని ఉత్పత్తి కూడా తమిళనాడులోని ఈ ప్లాంట్లోనే జరుగుతుంది. ఈ భారీ ప్రణాళికలతో విన్ఫాస్ట్ భారత ఆటోమొబైల్ రంగంలో ఒక బలమైన శక్తిగా ఎదగాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications








