ఒకప్పుడు మార్కెట్ ను ఏలిన కంపెనీ.. ఇప్పుడు జీఎస్టీ తగ్గించినా కొనే దిక్కులేదు.. అసలేం జరుగుతోంది
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్ల మార్కెట్ను ఏలిన దిగ్గజ బ్రాండ్లలో ఒకటైన ఫోక్స్వ్యాగన్ (Volkswagen) కంపెనీకి భారతీయ మార్కెట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మంచి మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఈ కంపెనీ, తాజాగా విడుదలైన సెప్టెంబర్ నెల అమ్మకాల గణాంకాలలో పెద్ద క్షీణతను చూసింది.
సెప్టెంబర్ నెలలో ఫోక్స్వ్యాగన్ అమ్మకాలు ఏకంగా 18 శాతం తగ్గి, అత్యధిక కార్లు విక్రయించిన టాప్ 10 కంపెనీల జాబితా నుండి కూడా నిష్క్రమించింది. ఈ భారీ అమ్మకాల క్షీణతకు కారణాలు ఏమిటి? కంపెనీ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఏంచేయాలి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రముఖ జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్వ్యాగన్, సెప్టెంబర్ 2025 నెలలో అమ్మకాల పరంగా పెద్ద దెబ్బ తింది. గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే, కంపెనీ విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫోక్స్వ్యాగన్ ఇండియా సెప్టెంబర్లో మొత్తం 2,780 వాహనాలను మాత్రమే విక్రయించింది. గత ఏడాది (2024) సెప్టెంబర్లో విక్రయించిన 3,394 వాహనాలతో పోలిస్తే, ఈ అమ్మకాలు 18 శాతం మేర తగ్గిపోయాయి.
ఈ క్షీణత కారణంగా, భారతదేశంలో అత్యధిక వాహనాలను విక్రయించిన టాప్ 10 కంపెనీల జాబితా నుండి ఫోక్స్వ్యాగన్ నిష్క్రమించింది. కంపెనీ గత నెలలో 11వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఫోక్స్వ్యాగన్ కంపెనీకి విర్టస్, టైగన్ మోడళ్లు మాత్రమే కొంతవరకు ఊతమిస్తున్నాయి. సెడాన్ మోడల్ విర్టస్ గత సెప్టెంబర్లో 1,648 యూనిట్లు అమ్ముడై, కంపెనీ అమ్మకాలలో కీలక పాత్ర పోషించింది.

ఎస్యూవీ మోడల్ టైగన్ సెప్టెంబర్లో 1,114 యూనిట్లు విక్రయించింది. అయితే, గత ఏడాది విక్రయాలతో పోలిస్తే టైగన్ అమ్మకాలు ఏకంగా 31 శాతం తగ్గాయి. అయితే, అంతకు ముందు నెల (ఆగస్టు)తో పోలిస్తే మాత్రం మొత్తం అమ్మకాలు 2 శాతం, టైగన్ అమ్మకాలు 11 శాతం పెరగడం కొంచెం ఊరటనిచ్చే అంశం.
అమ్మకాల పెరుగుదలకు ప్రధానంగా జీఎస్టీ తగ్గింపు ఒక ముఖ్య కారణంగా నిలిచింది. ఈ తగ్గింపు కారణంగా ఫోక్స్వ్యాగన్ వాహనాల ధరలు కొద్దిగా తగ్గినా, అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. విర్టస్, టైగన్ మినహా, గోల్ఫ్ జీటీఐ, టిగువాన్ ఆర్లైన్ వంటి ఇతర మోడళ్ల అమ్మకాలు భారత మార్కెట్లో చాలా నెమ్మదిగా సాగుతున్నాయి.

2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం (క్వార్టర్ 3) అమ్మకాల వివరాల ప్రకారం.. ఈ మూడు నెలల్లో కంపెనీ 8,711 వాహనాలను విక్రయించింది. మొత్తం విక్రయాలు 58.76 శాతం పెరిగినా, కీలకమైన టైగన్ కారు విక్రయాలు 28.34 శాతం తగ్గడం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం ఫోక్స్వ్యాగన్ కంపెనీ విక్రయాల విషయంలో ఇబ్బంది పడుతోంది. పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి తదుపరి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: భారతీయ మార్కెట్ను అర్థం చేసుకుని, భారతీయుల అభిరుచులకు, అవసరాలకు తగినట్లుగా వాహనాలను తయారు చేయాల్సిన అవసరం ఫోక్స్వ్యాగన్కు ఉంది. కేవలం కొన్ని మోడళ్లతో కాకుండా, అనేక విభాగాలలో కొత్త వాహనాలను ప్రవేశపెడితేనే, కంపెనీ భారీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications