లక్షలు కాదు..వేలల్లోనే కార్లు..కానీ రేంజ్ మాత్రం కోట్లలోనే..ఆడి సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
లగ్జరీ కార్ల ప్రపంచంలో జర్మన్ దిగ్గజం ఆడి (Audi) తనదైన శైలిలో దూసుకుపోతోంది. 2025 సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి అనేక సవాళ్లు విసిరినప్పటికీ, ఆడి ఇండియా మాత్రం పక్కా ప్లానింగ్తో సక్సెస్ కొట్టింది. భారీ ధరలు, మారుతున్న ప్రభుత్వ నిబంధనల మధ్య కూడా ఆడి కార్లకు ఉన్న క్రేజ్ తగ్గలేదని తాజా అమ్మకాల గణాంకాలు చెబుతున్నాయి. 2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో, గతేడాది సాధించిన విజయాలు ఈ బ్రాండ్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
ఆడి ఇండియా సంస్థ 2025 సంవత్సరంలో మొత్తం 4,510 లగ్జరీ కార్లను విక్రయించింది. సంఖ్య పరంగా ఇది తక్కువగా అనిపించినప్పటికీ, లగ్జరీ కార్ల సెగ్మెంట్లో ఇది చెప్పుకోదగ్గ వృద్ధి. ముఖ్యంగా పండుగ సీజన్లలో కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్, జిఎస్టి 2.0 వంటి కొత్త నిబంధనలు ఈ అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, కస్టమర్లు తమ బ్రాండ్ పై చూపిన నమ్మకం అద్భుతమని కొనియాడారు.

ఆడి కార్లలో ఎప్పటికీ క్రేజ్ ఉండే Q3, A4, A6, Q5 మోడల్స్ ఊహించిన విధంగానే ఈ ఏడాది కూడా టాప్ గేర్లో అమ్ముడయ్యాయి. వీటితో పాటు ధనవంతుల మనసు గెలుచుకున్న హై-ఎండ్ మోడల్స్ అయిన Q7, Q8, S5 స్పోర్ట్బ్యాక్, RS Q8 పెర్ఫార్మెన్స్ కార్లకు స్థిరమైన డిమాండ్ కనిపించింది. కొత్తగా లాంచ్ చేసిన సిగ్నేచర్ ఎడిషన్లు కస్టమర్లను మరింత ఆకర్షించాయి. లగ్జరీతో పాటు పెర్ఫార్మెన్స్ కోరుకునే వారు ఆడి 'RS' సిరీస్ వైపు మొగ్గు చూపారు.
కేవలం కొత్త కార్లే కాదు, వాడిన కార్ల బిజినెస్ ఆడి అప్రూవ్డ్: ప్లస్(Audi Approved: plus)లో కూడా ఆడి 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 కేంద్రాల ద్వారా 500 కంటే ఎక్కువ నాణ్యమైన సెకండ్ హ్యాండ్ ఆడి కార్లను కంపెనీ విక్రయిస్తోంది. మధ్యతరగతి నుంచి ఎగువ స్థాయికి వెళ్లాలనుకునే వారు ఈ ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల బ్రాండ్ వాల్యూ పెరగడమే కాకుండా, కస్టమర్ బేస్ కూడా విస్తరిస్తోంది.

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారత ఈటె విసిరే వీరుడు నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా చేరడం ఈ ఏడాది హైలైట్ అని చెప్పాలి. నీరజ్ బ్రాండ్ ఇమేజ్ ఆడి విక్రయాలపై సానుకూల ప్రభావం చూపింది. అలాగే కస్టమర్ల కోసం ఆడి ప్రవేశపెట్టిన బై బ్యాక్(Buy Back) పథకం పెద్ద హిట్టయింది. ఈ స్కీమ్ కింద కారు కొన్న కొన్ని ఏళ్ల తర్వాత తిరిగి అమ్మితే, 60 శాతం వరకు గ్యారెంటీ ధరను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీనివల్ల కస్టమర్లకు తమ పెట్టుబడిపై భరోసా లభిస్తోంది.
భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్ముతున్న ఆడి, దేశవ్యాప్తంగా తన చార్జింగ్ నెట్వర్క్ను 6,500 కంటే ఎక్కువ ప్రాంతాలకు విస్తరించింది. కాన్పూర్లో కొత్త షోరూమ్, డెహ్రాడూన్లో సర్వీస్ సెంటర్ను ప్రారంభించి తన నెట్వర్క్ను మరింత బలోపేతం చేసుకుంది. మెర్సిడెస్ బెంజ్, బీఎమ్డబ్ల్యూ వంటి దిగ్గజాలతో పోటీ పడుతూ, ఇండియాలో లగ్జరీ కార్ల మార్కెట్లో ఆడి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 2026లో మరిన్ని కొత్త ఈవీ(EV) మోడళ్లను ప్రవేశపెట్టేందుకు ఆడి సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications








