ఇది కచ్చితంగా ఆటో డ్రైవర్ల కడుపు నింపుతుంది.. లక్షల్లో లాభం.. 5 ఏళ్ల వారంటీ కూడా
భారతీయ రోడ్లపై ఆటో రిక్షా అంటే కేవలం ఒక వాహనం కాదు, అది లక్షలాది మంది సామాన్యుల జీవనాధారం. అలాంటి త్రీ వీలర్ వాహన రంగంలో పెను సంచలనం సృష్టిస్తూ, దేశీయ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా WEGO P9018ను మార్కెట్లోకి విసిరింది. ఫిబ్రవరి 09, 2026న పుణె వేదికగా జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రేంజ్ విషయంలో ఉన్న అన్ని అపోహలను పటాపంచలు చేస్తూ, ఏకంగా 296 కిలోమీటర్ల రేంజ్తో ఇది రేంజ్ రాజాగా కీర్తించబడుతోంది.
బజాజ్ WEGO P9018ను ఒక సాధారణ ఆటోగా చూడలేము. దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఇంజనీరింగ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లోనూ లేని విధంగా, ఇందులో 17.7 kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. ఈ బ్యాటరీ సాయంతో ఐడియల్ కండిషన్స్లో 296 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. రియల్ వరల్డ్ కండిషన్స్లో కూడా ఇది 240-250 కి.మీ. వరకు సునాయాసంగా ఇస్తుందని అంచనా.

ఇది ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. రాత్రిపూట ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుంటే, మరుసటి రోజు రోజంతా నిరంతరంగా ప్రయాణించవచ్చు. పగలు ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం దీనితో తప్పుతుంది. ఇందులో అత్యాధునిక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) ఉంది. ఇది బ్యాటరీ వేడెక్కకుండా చూడటమే కాకుండా, సెల్ బ్యాలెన్సింగ్ ద్వారా బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది.
బజాజ్ తన ఆటోలను కేవలం డ్రైవర్ల కోసం మాత్రమే కాదు, ప్రయాణికుల సౌకర్యం కోసం కూడా డిజైన్ చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేర్లు ఉండటం అరుదు. కానీ బజాజ్ ఇందులో టూ-స్పీడ్ గేర్బాక్స్ను అందించింది. దీనివల్ల ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు లేదా ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. ఈ ఆటోకు 36 శాతం గ్రేడబిలిటీ ఉంది. అంటే ఫ్లై ఓవర్లు లేదా కొండ ప్రాంతాల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నా వెనక్కి తగ్గకుండా దూసుకుపోతుంది.

మీరు బ్రేక్ వేసిన ప్రతిసారీ లేదా ఎత్తు నుంచి కిందకు దిగుతున్నప్పుడు, ఆ శక్తిని విద్యుత్తుగా మార్చి బ్యాటరీకి పంపిస్తుంది. దీనివల్ల రేంజ్ మరింత పెరుగుతుంది. ఒక సాధారణ పెట్రోల్ లేదా సీఎన్జీ ఆటోతో పోలిస్తే, బజాజ్ WEGO P9018 డ్రైవర్లకు నెలకు వేల రూపాయల లాభాన్ని అందిస్తుంది. ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం 50 నుంచి 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. అదే పెట్రోల్ ఆటోలో అయితే ఇది రూ.4 నుంచి రూ.5 వరకు ఉంటుంది.
ఇందులో ఇంజన్, పిస్టన్స్, ఆయిల్ ఫిల్టర్లు వంటి సమస్యలు ఉండవు. కాబట్టి సర్వీసింగ్ ఖర్చు చాలా తక్కువ. కస్టమర్లలో నమ్మకాన్ని పెంచేందుకు బజాజ్ ఈ వాహనంపై 5 ఏళ్ల వారంటీని ప్రకటించింది. అంటే ఐదేళ్ల వరకు బ్యాటరీ లేదా మోటార్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు.
బజాజ్ WEGO P9018 ఎక్స్-షోరూమ్ ధరను రూ.4,41,247 గా నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలు (FAME-II వంటివి) దీనికి అదనంగా వర్తిస్తాయి. దీనివల్ల ఆన్-రోడ్ ధర డ్రైవర్లకు అందుబాటులోకి వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ డీలర్షిప్ల ద్వారా ఫిబ్రవరి మూడవ వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
బజాజ్ ఆటో అర్బన్ బిజినెస్ ప్రెసిడెంట్ సమర్దీప్ సుబంధ్ మాట్లాడుతూ, "భారతదేశం ఎలక్ట్రిక్ గమ్యం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. WEGO బ్రాండ్ ద్వారా మేము కేవలం వాహనాలను మాత్రమే కాదు, ఒక కొత్త జీవనోపాధిని అందిస్తున్నాము. ప్యాసింజర్ విభాగంలోనే కాకుండా, త్వరలోనే ఇదే ప్లాట్ఫారమ్పై కార్గో (సరుకు రవాణా) ఆటోలను కూడా తీసుకురాబోతున్నాం" అని తెలిపారు.
ఇప్పటికే 2 ట్రిలియన్ రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన మొదటి టూ-వీలర్ కంపెనీగా బజాజ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో రంగంలో 'వీగో'తో సరికొత్త విప్లవానికి తెరలేపింది.


Click it and Unblock the Notifications








