ఎవర్రా ఇండియా పేద దేశం అన్నది..మనోళ్లు ఒక్క ఏడాదే 18 వేల బీఎండబ్ల్యూలు కొనేశారు
భారత్ పేద దేశమనే రోజులు పోయాయి. ఇక్కడి ప్రజల లైఫ్స్టైల్ మారుతోంది. అందుకు నిదర్శనమే లగ్జరీ కార్ల విపరీతమైన అమ్మకాలు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా (BMW Group India) 2025 సంవత్సరంలో సరికొత్త రికార్డును సృష్టించింది. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, భారతీయులు ఈ బ్రాండ్ కార్లపై విపరీతమైన మక్కువ చూపారు. గత ఏడాది బీఎండబ్ల్యూ షోరూమ్లు అమ్మకాలతో కిక్కిరిసిపోయాయి.
బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా 2025 క్యాలెండర్ ఇయర్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది మొత్తం 18,001 కార్లను విక్రయించింది. ఇది 2024 ఏడాదితో (15,723 కార్లు) పోలిస్తే 14 శాతం అధికం. ఇందులో బిఎమ్డబ్ల్యూ బ్రాండ్ కార్లు 17,271 కాగా, మినీ (MINI) బ్రాండ్ కార్లు 730 ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా బీఎండబ్ల్యూ ఇండియా ప్రతి త్రైమాసికంలోనూ రెండంకెల వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోంది.

భారతీయ కస్టమర్లు వెనుక సీటులో ఎక్కువ సౌకర్యం, స్థలాన్ని కోరుకుంటారు. అందుకే బీఎండబ్ల్యూ లాంగ్ వీల్బేస్ (Long Wheelbase) మోడల్స్ అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయి. వీటి విక్రయాలు ఏకంగా 162 శాతం వృద్ధి చెంది 8,608 యూనిట్లకు చేరుకున్నాయి. బీఎండబ్ల్యూ మొత్తం అమ్మకాల్లో దాదాపు సగం వాటా ఈ లాంగ్ వీల్బేస్ కార్లదే కావడం విశేషం. 2024లో వీటి వాటా కేవలం 29 శాతం మాత్రమే ఉండేది, కానీ 2025 నాటికి అది 50 శాతానికి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, బీఎండబ్ల్యూ ఇండియా కూడా తన ఈవీ విభాగంలో భారీ వృద్ధిని చూసింది. గత ఏడాది ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు దాదాపు 200 శాతం పెరిగాయి. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల నుంచి మొత్తం 3,753 ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ అయ్యాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 2024లో 8 శాతం ఉండగా, 2025లో అది 21 శాతానికి పెరగడం గమనార్హం. భారత లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో బీఎండబ్ల్యూ ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కేవలం కార్లే కాకుండా, బీఎండబ్ల్యూ మోటారాడ్ (BMW Motorrad) విభాగంలో కూడా కంపెనీ మంచి ఫలితాలను సాధించింది. 2025లో మొత్తం 5,841 ద్విచక్ర వాహనాలను డెలివరీ చేసింది. వీటిలో ప్రీమియం మోటార్సైకిళ్ల వాటానే ఎక్కువ. ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన చివరి త్రైమాసికంలో (Q4) అమ్మకాలు రికార్డు స్థాయిలో 6,023 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 17 శాతం వృద్ధి.
2025లో బీఎండబ్ల్యూ గ్రూప్ తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఏకంగా 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో బీఎండబ్ల్యూ iX1 లాంగ్ వీల్బేస్, ఎక్స్3 (X3), 2-సిరీస్ గ్రాన్ కూపే, మినీ కన్వర్టిబుల్ వంటివి ప్రధానమైనవి. అలాగే మోటార్సైకిల్ విభాగంలో R1300 GS మరియు S1000 RR వంటి పవర్ఫుల్ బైక్లను పరిచయం చేసింది. భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ బ్రాండ్ పై ఉన్న నమ్మకం, నిరంతర కొత్త ఉత్పత్తుల విడుదల వల్ల కంపెనీ వచ్చే నాలుగైదేళ్లలో తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








