సామాన్యులకు ఎలక్ట్రిక్ కార్లు చవకవుతాయా? ఇప్పుడు ఈవీ కొనాలా? కొనుగోలుదారులు తెలుసుకోవాల్సిన విషయాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను విజయవంతంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకోగా, ముఖ్యంగా వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహన (EV) పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, ఈ బడ్జెట్లో పర్యావరణ అనుకూల రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.
ముఖ్యంగా సామాన్య ప్రజలకు సరసమైన ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. దేశీయంగా EV తయారీని ప్రోత్సహించడం, స్థానిక సరఫరా గొలుసును బలోపేతం చేయడం వంటి అంశాలు ఈ బడ్జెట్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఖర్చును తగ్గించేందుకు అనుకూల విధానాలు తీసుకురావడం జరిగింది.

ముడి పదార్థాలు, బ్యాటరీ తయారీకి అవసరమైన కొన్ని భాగాలపై సుంకాల తగ్గింపు వంటి చర్యలు కంపెనీలకు దీర్ఘకాలికంగా లాభాన్ని చేకూర్చే అవకాశముంది. దీంతో భవిష్యత్తులో EV పరిశ్రమ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది. అయితే, ఈ తయారీ ఖర్చు తగ్గింపు వల్ల వినియోగదారులకు తక్షణంగా ధరల రూపంలో ప్రయోజనం కనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల ఎక్స్-షోరూమ్ ధరల్లో వెంటనే మార్పులు ఉండే అవకాశం లేదు.
కంపెనీలు ఈ ప్రయోజనాన్ని మొదట తమ తయారీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి వినియోగించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తక్షణ ధరల తగ్గింపులు లేకపోయినా, రాబోయే సంవత్సరాల్లో EVలను మరింత చవకగా, విస్తృతంగా ప్రజలకు చేరువ చేయడానికి ఈ బడ్జెట్ పునాది వేసిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఈ విధానాల ఫలితం వినియోగదారులకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మరింత బలం చేకూర్చే దిశగా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభిస్తూ, ఈ రంగ అభివృద్ధికి రూ.40,000 కోట్ల గ్రాంట్ను కేటాయించారు. ఇది కేవలం టెక్నాలజీ రంగానికే కాదు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు కూడా గేమ్చేంజర్గా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నేటి ఆధునిక వాహనాల తయారీలో సెమీకండక్టర్ల పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను సరళంగా చెప్పాలంటే, అవి చక్రాలపై నడిచే కంప్యూటర్ల్లాంటివి.
బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, మోటర్ కంట్రోల్ యూనిట్, ఇన్ఫోటైన్మెంట్, సేఫ్టీ ఫీచర్లు, సెన్సర్లు అన్నీ సజావుగా పనిచేయాలంటే సెమీకండక్టర్ చిప్లు తప్పనిసరి. ఒక ఎలక్ట్రిక్ కారును తయారు చేయడానికి సుమారు 1,400 నుంచి 3,000 వరకు సెమీకండక్టర్ చిప్లు అవసరమవుతాయని అంచనా. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సెమీకండక్టర్ చిప్ల కొరత కొనసాగుతోంది. కార్ల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఈ కొరత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బుకింగ్ చేసిన తర్వాత తమ కొత్త EVలను పొందడానికి వినియోగదారులు నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరఫరా అంతరాయాలే దీనికి ప్రధాన కారణంగా మారాయి. ప్రస్తుతం భారత్ సెమీకండక్టర్ చిప్ల కోసం జపాన్, తైవాన్, చైనా వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.
ఈ విదేశీ ఆధారపడటమే సరఫరా ఆలస్యాలకు, ఖర్చుల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా దేశీయంగా సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీ నిధులను కేటాయించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా దేశంలో చిప్ తయారీ యూనిట్లు, డిజైన్ సెంటర్లు, సరఫరా గొలుసు వ్యవస్థలు బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
2026-27 కేంద్ర బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా PM e-డ్రైవ్ (Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) పథకానికి రూ. 1,500 కోట్ల గ్రాంట్ను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








