అతి తక్కువ ధరకే చైనా ఈవీ కారు.. అక్కడ సూపర్ హిట్ మోడల్ ఇండియాకు రాక!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఒక పెద్ద లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయగలిగే స్థాయిలో అందుబాటులో ఉండే తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం దేశంలో విక్రయానికి ఉన్న చాలా ఎలక్ట్రిక్ కార్లు రూ.10 లక్షల కంటే ఎక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. దీంతో పెట్రోల్ లేదా సీఎన్జీ కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే అనేక మంది వినియోగదారులు ఇంకా వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.15 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్న కంపెనీల సంఖ్య కూడా చాలా పరిమితంగానే ఉంది. ప్రధానంగా టాటా మోటార్స్, ఎంజీ మోటార్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే ఈ విభాగంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి.
అయితే ధరను తగ్గించి రూ.10 లక్షల లోపు పరిశీలిస్తే పరిస్థితి ఇంకా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ విభాగంలో టాటా మోటార్స్, ఎంజీ మోటార్కు చెందిన కొద్ది మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే దేశంలో అత్యధిక మంది కొనుగోలుదారులు ఉన్న బడ్జెట్ కార్ల సెగ్మెంట్లో ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల ఎంపికలు చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో రూ.10 లక్షల లోపు ధర గల పెట్రోల్ కార్ల మార్కెట్ అత్యంత పెద్దది.

మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలు ఈ విభాగంలో లక్షల సంఖ్యలో కార్లను విక్రయిస్తున్నాయి. అయినప్పటికీ ఇదే ధరల శ్రేణిలో ఒక పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా పెద్దగా సాహసం చేయలేదు. కారణం బ్యాటరీ ఖర్చులు, తయారీ వ్యయం, లాభదాయకత వంటి అంశాలే. అందువల్ల తక్కువ ధరలో నాణ్యమైన ఎలక్ట్రిక్ కారు అనేది ఇప్పటికీ భారత మార్కెట్ ఎదురుచూస్తున్న అతిపెద్ద అవకాశంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD పేరు తరచూ వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో వేగంగా ఎదిగిన ఈ సంస్థ, చైనా మార్కెట్లో అత్యాధునిక సాంకేతికత కలిగిన కార్లను ఆశ్చర్యకరంగా తక్కువ ధరలకు విక్రయిస్తోంది. ముఖ్యంగా BYD సొంతంగా బ్యాటరీలను తయారు చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించగలుగుతోంది. ఇదే సంస్థకు ఇతర కంపెనీలపై ఉన్న ప్రధాన ఆధిక్యంగా చెప్పవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా BYD చైనాలో విక్రయిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని భారతదేశానికి తీసుకురావచ్చనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ కారు భారత మార్కెట్లో అడుగుపెడితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల ధరల సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు లేదా ఆ స్థాయికి దగ్గరగా ధర నిర్ణయిస్తే, మధ్యతరగతికి ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మరింత పెరగవచ్చు.
చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన, కంపెనీకి అత్యధిక అమ్మకాలు తెచ్చిపెడుతున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో BYD సీగల్ ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్ను డాల్ఫిన్ మినీ పేరుతో విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ కారును భారత మార్కెట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశాలపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చైనా మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ ధర భారత కరెన్సీలో లెక్కిస్తే సుమారు రూ.9 లక్షల పరిధిలోనే ఉంది.

ఇదే ధరలో భారతదేశంలో విడుదలైతే, సంచలనం సృష్టించవచ్చు. భారత మార్కెట్లో సీగల్ ప్రవేశంపై ఊహాగానాలు పెరగడానికి ముఖ్యమైన కారణం BYD ఇటీవల సీగల్ పేరును భారతదేశంలో ట్రేడ్మార్క్ చేయడం. సాధారణంగా ఏదైనా కంపెనీ కొత్త వాహనాన్ని వేశపెట్టే ముందు ఆ మోడల్ పేరును ట్రేడ్మార్క్ చేయడం ఆనవాయితీ. దీంతో BYD కూడా భవిష్యత్తులో ఈ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందా అనే చర్చ మొదలైంది.


Click it and Unblock the Notifications