ప్రపంచం మెచ్చిన టాటా పనితనం..ఇండోనేషియా గడ్డ పై టాటా మోటార్స్ సునామీ..70వేల వాహనాలకు ఆర్డర్
గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో భారతీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. ఇండోనేషియా దేశం నుంచి ఏకంగా 70,000 కమర్షియల్ వెహికల్స్ కోసం భారీ ఎగుమతి ఆర్డర్ను దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక ఆర్డర్ మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై మేక్ ఇన్ ఇండియా సత్తాకు నిదర్శనం.
భారతీయ వాణిజ్య వాహన రంగానికి ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఇండోనేషియా ప్రభుత్వం తన దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారతీయ దిగ్గజం టాటా మోటార్స్ను ఎంచుకుంది. ఆ దేశ ప్రభుత్వ సంస్థ అగ్రినాస్ పాంగన్ నుశాంత్ర(Agrinas Pangan Nusantara) ద్వారా ఈ భారీ ఒప్పందం కుదిరింది.

ఇండోనేషియాలో సహకార సంఘాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న KDKMP (Koperasi Desa/Kelurahan Merah Putih) పథకం కింద ఈ 70,000 వాహనాలను సరఫరా చేయనున్నారు. ఈ భారీ ఆర్డర్లో 35,000 టాటా యోధా (Tata Yodha) పిక్-అప్ ట్రక్కులు, 35,000 టాటా అల్ట్రా T.7 (Tata Ultra T.7) ట్రక్కులు ఉండటం గమనార్హం.
ఇండోనేషియా దేశం అనేక చిన్న చిన్న ద్వీపాలతో కూడిన సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతం. అక్కడ పండించే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు చేరవేయడం పెద్ద సవాలు. ఈ సమస్యను అధిగమించడానికి టాటా యోధా పిక్-అప్ ట్రక్కులను ఆ దేశం ఎంచుకుంది. యోధా ట్రక్కులు అత్యంత కఠినమైన రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించగలవు.

వీటి పవర్ఫుల్ ఇంజిన్, స్ట్రాండ్ బాడీ పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలకు సరిగ్గా సరిపోతాయి. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ బరువు మోయగల సామర్థ్యం ఉండటం వల్ల ఇండోనేషియా రైతులు ఈ వాహనాలపై మక్కువ చూపుతున్నారు.
భారీ రవాణా అవసరాల కోసం టాటా అల్ట్రా T.7 ట్రక్కులను ఇండోనేషియా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇవి లేటెస్ట్ టెక్నయాలజీతో రూపొందించబడ్డాయి. సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లకు అలసట లేకుండా ఉండేలా వీటి క్యాబిన్ను ఎంతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.

అంతేకాకుండా, ఈ ట్రక్కులు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని (Mileage) కలిగి ఉండటం వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇండోనేషియాలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా వీటిని టాటా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసింది.
ఇటీవలే మహీంద్రా కంపెనీ కూడా ఇండోనేషియాకు వాహనాలను ఎగుమతి చేసే ఆర్డర్లను పొందింది. అయితే, టాటా మోటార్స్ దక్కించుకున్న 70,000 వాహనాల ఆర్డర్ మహీంద్రా పొందిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. ఇది గ్లోబల్ మార్కెట్లో టాటా బ్రాండ్కు ఉన్న క్రేజ్ను తెలియజేస్తుంది.
టాటా మోటార్స్ కేవలం వాహనాలను అమ్మడమే కాకుండా, ఇండోనేషియాలో తన అనుబంధ సంస్థ PT Tata Motors Distribusi Indonesia ద్వారా మెరుగైన సర్వీస్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసింది. ఇది ఆ దేశ వినియోగదారుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసింది.
ప్రస్తుతం టాటా మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో తన ఉనికిని చాటుతోంది. 1 టన్ను లోపు చిన్న వాహనాల నుంచి 60 టన్నుల భారీ హెవీ డ్యూటీ ట్రక్కుల వరకు టాటా తయారు చేస్తోంది. దక్షిణాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో టాటా వాహనాలు ఇప్పుడు మొదటి ప్రాధాన్యతగా మారుతున్నాయి. ఇండోనేషియా నుంచి అందిన ఈ మెగా ఆర్డర్ రాబోయే నెలల్లో దశలవారీగా సరఫరా చేయబడుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఒక భారతీయ కంపెనీ విదేశీ గడ్డపై ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్ సాధించడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. క్వాలిటీ, నమ్మకం, సరసమైన ధరలు కలిసి ఉన్నప్పుడే ఇలాంటి భారీ విజయాలు సాధ్యమవుతాయి. టాటా మోటార్స్ సాధించిన ఈ విజయం ఇతర భారతీయ కంపెనీలకు కూడా స్ఫూర్తినిస్తుంది. ఇండోనేషియా రోడ్ల మీద ఇక నుంచి టాటా బ్రాండ్ రెపరెపలాడటం ఖాయం.


Click it and Unblock the Notifications








