11 రోజుల్లో 4 సార్లు పెరిగిన పెట్రోల్ రేట్లు.. టాటా మోటార్స్ ఈవీ బుకింగ్స్లో సరికొత్త రికార్డు
దేశంలో సామాన్యుడిపై ఇంధన ధరల భారం రోజురోజుకు పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు సెంచరీ దాటి పరిగెత్తుతుండడంతో మధ్యతరగతి వాహనదారుల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. ఈ క్రమంలోనే కారు కొనాలనుకునే కస్టమర్ల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కార్ల (హ్యాచ్బ్యాక్, ఎంట్రీ లెవెల్) విభాగంలో పెట్రోల్ వేరియంట్లను కాదని, జనం అత్యంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఈవీ కార్ల బుకింగ్స్ ఏకంగా రెండున్నర (2.5) రెట్లు పెరగడం ఆటోమొబైల్ రంగాన్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మార్కెట్ ట్రెండ్స్ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. గత 15 రోజుల్లోనే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారతీయ కార్ల మార్కెట్లో ఈవీల వాటా 5.5 శాతంగా ఉంది.

అయితే టాటా మోటార్స్కు వస్తున్న బుకింగ్స్ డేటాను పరిశీలిస్తే.. కంపెనీ అమ్ముతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి కచ్చితంగా ఎలక్ట్రిక్ కారే ఉండటం విశేషం. వెహికల్స్ సప్లై గనుక సరిగ్గా ఉంటే, దేశీయ మార్కెట్లో ఈవీల వాటా త్వరలోనే 8 శాతానికి పైగా దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కస్టమర్లు ఇంతలా ఎలక్ట్రిక్ కార్ల వైపు పరుగులు పెట్టడానికి ప్రధాన కారణం పెట్రోల్ ధరల బాదుడేనని శైలేష్ చంద్ర స్పష్టం చేశారు. కేవలం గత 11 రోజుల్లోనే పెట్రోల్ ధరలు నాలుగు సార్లు పెరిగాయని ఆయన లెక్కలతో సహా వివరించారు.

ఉదాహరణకు లీటర్ పెట్రోల్పై 10 రూపాయలు పెరిగితే, నెలకు 100 లీటర్ల ఇంధనం వాడే సగటు సామాన్యుడిపై నేరుగా రూ.1,000 అదనపు భారం పడుతుంది. ఇది వారి నెలవారీ ఇంటి బడ్జెట్ను దెబ్బతీస్తుంది. అందుకే రూ.15 లక్షల కంటే తక్కువ బడ్జెట్ ఉన్న కస్టమర్లు పెట్రోల్ కార్లను పక్కనబెట్టి సీఎన్జీ లేదా ఈవీ కార్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విశ్లేషించారు.
ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ను మరింత పెంచేందుకు టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ టియాగో ఈవీ(Tiago EV) పై ఒక భారీ మైండ్ గేమ్ ఆడింది. కస్టమర్లలో ఉండే అతిపెద్ద భయం బ్యాటరీ లైఫ్, దాని రీప్లేస్మెంట్ ఖర్చు. ఈ భయాన్ని పోగొట్టేందుకు కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా బ్యాటరీపై లైఫ్టైమ్ వారంటీ (Lifetime Battery Warranty)ని ప్రకటించింది.

కంపెనీ వద్ద ఉన్న 75 వేల మంది టియాగో ఈవీ కస్టమర్ల డేటా ప్రకారం.. వారంతా కలిపి ఇప్పటికే రెండు బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ లెక్కల ఆధారంగా నెలకు 1,500 కిలోమీటర్లు తిరిగే వ్యక్తి, పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే కేవలం 4 నుంచి 5 సంవత్సరాల లోపే తాను పెట్టిన కారు పెట్టుబడి మొత్తాన్ని పొదుపు రూపంలో వెనక్కి రాబట్టుకోవచ్చని టాటా సంస్థ నిరూపించింది.
మరో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ (JSW MG Motor) కూడా ఈవీ విభాగంలో దుమ్మురేపుతోంది. జనవరి, ఫిబ్రవరి నెలల సగటు అమ్మకాలతో పోలిస్తే మార్చి నెలలోనే కంపెనీ ఏకంగా 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక క్యాలెండర్ ఇయర్ (CY) 2024 నుంచి 2025 మధ్య కాలంలో ఎంజీ మోటార్స్ ఈవీ హోల్సేల్ అమ్మకాలు ఏకంగా 111 శాతం పెరిగాయి.
గత ఏడాది జనవరి-ఏప్రిల్ 2025 తో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ 2026 నాటికి కంపెనీ 9 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఎంజీ కంపెనీ తీసుకొచ్చిన విండ్సర్ (Windsor) ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో నంబర్ 1 సెల్లింగ్ ఈవీగా నిలిచి కంపెనీ సక్సెస్లో కీలక పాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications