ఈ కార్లు కొంటే పెట్రోల్ బంక్ ఓనర్లు ఏడుస్తారు.. ఇండియాలో టాప్ మైలేజీ ఇచ్చే కార్ల జాబితా ఇదే!
భారతదేశంలో ఒక సామాన్యుడు కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు మొట్టమొదట అడిగే ప్రశ్న మైలేజీ ఎంత ఇస్తుంది?. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్న తరుణంలో, వాహన తయారీ సంస్థలు కూడా తమ వ్యూహాలను మారుస్తున్నాయి. కేవలం లుక్స్, ఫీచర్లు మాత్రమే కాకుండా, జేబుకు చిల్లు పడకుండా అత్యధిక ఇంధన సామర్థ్యాన్ని ఇచ్చే హైబ్రిడ్, కొత్త ఇంజన్ టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి.
సిఎన్జీ కార్లు మైలేజీలో ముందున్నప్పటికీ, పెట్రోల్, హైబ్రిడ్ విభాగంలో రాజీ పడకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చే కార్లకు ప్రస్తుతం గిరాకీ పెరిగింది. 2026 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మన దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్-5 కార్ల వివరాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris)
ప్రస్తుతం భారత రోడ్లపై మైలేజీ పరంగా రికార్డులు సృష్టిస్తున్న కారు మారుతి సుజుకి విక్టోరిస్. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో పని చేస్తుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో ఈ కారు లీటరుకు ఏకంగా 28.65 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తోంది. ఇది మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో ఉన్నప్పటికీ, ఒక చిన్న హ్యాచ్బ్యాక్ కారు కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం.
కేవలం మైలేజీ మాత్రమే కాకుండా, ఇందులో లెవల్ 2 ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.16.37 లక్షలుగా ఉంది. హైవేల మీద, సిటీ ట్రాఫిక్లో సమానంగా మైలేజీ ఇచ్చే కారు కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ (Grand Vitara, Toyota Hyryder)
ఈ రెండు కార్లు దాదాపు ఒకే విధమైన టెక్నాలజీని పంచుకుంటాయి కాబట్టి, ఇవి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. 1.5 లీటర్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్తో నడిచే ఈ ఎస్యూవీలు లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఈ కార్లలో అమర్చిన ఈ-సివిటి (e-CVT) గేర్బాక్స్ ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేస్తుంది.
పనోరమిక్ సన్రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లతో పాటు అదిరిపోయే మైలేజీ రావడం వల్ల ఈ మోడళ్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. టయోటా, మారుతి బ్రాండ్ విలువ వీటికి అదనపు బలాన్ని ఇస్తోంది. వీటి హైబ్రిడ్ వేరియంట్ల ధర సుమారు రూ.16.60 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

హోండీ సిటీ e:HEV (Honda City e:HEV)
సెడాన్ కార్ల ప్రేమికుల కోసం మైలేజీలో రారాజుగా హోండా సిటీ హైబ్రిడ్ నిలుస్తోంది. 1.5 లీటర్ల అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో ఈ కారు లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. సెడాన్ విభాగంలో ఇంతటి మైలేజీ ఇచ్చే కారు మరొకటి లేదని చెప్పాలి.
ఇది 125 hp పవర్ను ఉత్పత్తి చేస్తూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గదు. హోండా సెన్సింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారును మరింత సురక్షితంగా మారుస్తున్నాయి. దీని ధర సుమారు రూ.20 లక్షల నుంచి మొదలవుతుంది. లగ్జరీతో పాటు పొదుపును కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
హైబ్రిడ్ కాకుండా కేవలం పెట్రోల్ ఇంజన్తో నడిచే కార్లలో అత్యధిక మైలేజీ ఇచ్చే కారుగా మారుతి సెలెరియో నాలుగో స్థానంలో ఉంది. 1.0 లీటర్ త్రీ-సిలిండర్ కె-సిరీస్ ఇంజన్తో పనిచేసే ఈ కారు లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. బడ్జెట్ ధరలో లభించే ఈ కారు మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన ఛాయిస్గా మారింది.
దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. సిటీలోని ఇరుకైన సందుల్లో కూడా సులభంగా డ్రైవ్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. దీని ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.73 లక్షల వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి ఇది తిరుగులేని కారు.
మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
టాప్-5 జాబితాలో చివరిగా నిలిచింది అందరి ఫేవరెట్ మారుతి స్విఫ్ట్. కొత్త తరం జెడ్-సిరీస్ 1.2 లీటర్ ఇంజన్తో వస్తున్న ఈ కారు లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. స్పోర్టీ లుక్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రీడిజైన్ చేసిన ఇంటీరియర్స్తో స్విఫ్ట్ యువతను ఆకర్షిస్తోంది.
ముఖ్యంగా దీనిలోని ఏఎంటి (AMT) వెర్షన్ అత్యధిక మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.78 లక్షల వద్ద ఉంది. మార్కెట్లో అత్యధిక రీసేల్ వాల్యూ ఉండటం కూడా స్విఫ్ట్కు ప్లస్ పాయింట్. స్టైల్, మైలేజీ రెండూ కావాలనుకునే వారికి స్విఫ్ట్ ఎప్పటికీ ఆల్-టైమ్ ఫేవరెట్.


Click it and Unblock the Notifications








