గోవాలో థార్ అద్దెకు దొరకడం కష్టమే.. పర్యాటకులకు ఇష్టమైన కారుపై గోవా ప్రభుత్వం సీరియస్
దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రాంతాల్లో గోవా (Goa) ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తూ అక్కడి బీచ్లు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. గోవాలో పర్యాటకులు స్వేచ్ఛగా అక్కడి ప్రాంతాలను చూడటానికి ఎక్కువగా సెల్ఫ్-డ్రైవ్ అద్దె వాహనాలపై ఆధారపడుతుంటారు. ఇలాంటి సేవలు విస్తృతంగా గోవాలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టూవీలర్ వాహనాలతో పాటు ఎస్యూవీలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వీటిలో మహీంద్రా థార్కు (Mahindra Thar) ప్రత్యేక ఆదరణ ఉంది. అడ్వెంచర్ లుక్, ఎలాంటి రోడ్లపైనైనా సులభంగా ప్రయాణించే సామర్థ్యం కారణంగా చాలా మంది పర్యాటకులు థార్ను అద్దెకు తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు.
అయితే ఇప్పుడు గోవాలో సెల్ఫ్-డ్రైవ్ అద్దె థార్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల అద్దెకు తీసుకున్న థార్లతో వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో సెల్ఫ్-డ్రైవ్ రెంటల్ సేవల కోసం కొత్త థార్ వాహనాలకు లైసెన్సులు జారీ చేయడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో గోవాలో అద్దెకు లభించే థార్ వాహనాల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఈ అంశంపై సోమవారం రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం గోవా రవాణా శాఖ మంత్రి మౌవిన్ గొడిన్హో కీలక వ్యాఖ్యలు చేశారు. తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్న హై రిస్క్ రెంటల్ థార్ వాహనాలపై నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర రవాణా అథారిటీ (STA) ముందుకు ప్రత్యేక ప్రతిపాదన తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, సెల్ఫ్-డ్రైవ్ రెంటల్ సేవల కోసం కొత్త మహీంద్రా థార్ వాహనాలకు అనుమతులు ఇవ్వడంపై పరిమితులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నిర్ణయంపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ, గోవాలో పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో గోవాకు వెళ్లే పర్యాటకులు, సెల్ఫ్-డ్రైవ్ రెంటల్ వ్యాపారులు ఈ పరిణామంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఉత్తర గోవాలో అద్దెకు తీసుకున్న థార్ వాహనాలతో వరుసగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా పర్యాటకులు నడిపే సెల్ఫ్-డ్రైవ్ థార్ల కారణంగా జరిగిన కొన్ని ఘోర ప్రమాదాలు ఈ అంశాన్ని మరింత సీరియస్గా మార్చాయి. గత నెలలో మద్యం సేవించి అతివేగంగా నడిపిన ఓ అద్దె థార్ స్కూటర్ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది.
అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్కు చెందిన ఓ పర్యాటకుడు ప్రయాణిస్తున్న కారును థార్ ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అదుపుతప్పిన థార్ వరుసగా పలు వాహనాలను ఢీకొట్టడంతో స్కూటర్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో సెల్ఫ్-డ్రైవ్ రెంటల్ వాహనాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ, గోవాకు వచ్చే పర్యాటకుల్లో థార్కు ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

బీచ్లు, కొండ ప్రాంతాలు, ఆఫ్-రోడ్ మార్గాల్లో సులభంగా ప్రయాణించగల సామర్థ్యం, బలమైన డిజైన్, అడ్వెంచర్ లుక్ కారణంగా దేశీయ, విదేశీ పర్యాటకులు థార్ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందుకే సెల్ఫ్-డ్రైవ్ రెంటల్ కంపెనీల్లో కూడా ఈ SUVకి భారీ డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం థార్ను అద్దెకు తీసుకోవాలంటే రోజుకు సుమారు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు చెల్లించాల్సి వస్తోంది.


Click it and Unblock the Notifications