ఆ ఒక్క ఘటన హ్యుందాయ్ను భారీ దెబ్బ కొట్టింది.. కస్టమర్లు కార్లు కావాలన్న ఇవ్వలేకపోయింది!
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) 2026 జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం, కంపెనీ దేశీయ మార్కెట్లో 39,635 కార్లను విక్రయించగా, విదేశీ మార్కెట్లకు 11,700 యూనిట్లను ఎగుమతి చేసింది. దీంతో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం విక్రయాలు 51,335 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే గత కొద్ది నెలలుగా నిలకడగా కొనసాగిన అమ్మకాల జోరు జూన్లో కొంత మందగించినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది జూన్తో పోలిస్తే దేశీయ అమ్మకాలు 9.97 శాతం తగ్గాయి.
అయితే ఈ తగ్గుదల వెనుక మార్కెట్లో డిమాండ్ తగ్గడం ప్రధాన కారణం కాదని హ్యుందాయ్ స్పష్టం చేసింది. కంపెనీకి కీలకమైన సరఫరాదారుల్లో ఒకరి తయారీ కేంద్రంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కారణంగా విడిభాగాల సరఫరా తాత్కాలికంగా దెబ్బతింది. దీని ప్రభావం నేరుగా ఉత్పత్తిపై పడటంతో, వినియోగదారుల డిమాండ్ ఉన్నప్పటికీ అవసరమైన స్థాయిలో కార్లను తయారు చేయలేకపోయామని కంపెనీ వెల్లడించింది.

ఈ అగ్నిప్రమాదం వల్ల జూన్ నెలలోనే దాదాపు 13,900 వాహనాల ఉత్పత్తి నష్టం జరిగినట్లు హ్యుందాయ్ తెలిపింది. ఉత్పత్తి తగ్గడంతో షోరూమ్లకు కార్ల సరఫరా కూడా ప్రభావితమైంది. ఫలితంగా దేశీయ విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మే 2026లో దేశీయంగా 47,837 కార్లను విక్రయించిన హ్యుందాయ్, జూన్లో 39,635 యూనిట్లకే పరిమితమైంది.
అంటే కేవలం ఒక నెలలోనే 8,202 యూనిట్ల అమ్మకాలు తగ్గి, 17.15 శాతం క్షీణత నమోదైంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాయని హ్యుందాయ్ వెల్లడించింది. అగ్నిప్రమాదం ప్రభావం నుంచి బయటపడి, జూన్ 22, 2026 నుంచి అన్ని తయారీ కేంద్రాలు యథావిధిగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. దీంతో ఉత్పత్తి ప్రక్రియ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోగా, రాబోయే నెలల్లో అమ్మకాలు కూడా తిరిగి వృద్ధి చెందుతాయి.

సరఫరా అంతరాయం కారణంగా కోల్పోయిన ఉత్పత్తిని 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పూర్తిగా భర్తీ చేయాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్పత్తి అంతరాయం గురించి కంపెనీ ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ఫైలింగ్లలో వెల్లడించింది. ప్రస్తుతం తయారీ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో, రాబోయే నెలల్లో ఉత్పత్తి వేగం మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
జూన్ నెలలో అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ, ఏప్రిల్, మే నెలల్లో నమోదైన బలమైన విక్రయాలు కంపెనీ త్రైమాసిక పనితీరుకు అండగా నిలిచాయి. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 5.38 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, వెర్నా, అల్కాజర్, క్రెటా ఎలక్ట్రిక్ మోడళ్లకు వినియోగదారుల నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం ఈ వృద్ధికి ప్రధాన కారణమైంది.

ఇక రాబోయే నెలల్లో హ్యుందాయ్ తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్లో పలు కొత్త మోడళ్లను తీసుకురానుంది. ఇందులో భాగంగా 4 మీటర్ల లోపు కొత్త ఎలక్ట్రిక్ SUVను అభివృద్ధి చేస్తోంది. పెరుగుతున్న సరసమైన EV మార్కెట్లో బలమైన పోటీ ఇవ్వాలన్నదే కంపెనీ లక్ష్యం. అదే సమయంలో వెన్యూ, క్రెటా మధ్య స్థానం దక్కేలా కొత్త మిడ్-సైజ్ ICE SUVపై కూడా హ్యుందాయ్ పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications