రూ.1.03 కోట్ల కారు రూ.53 లక్షలకే..? ఇండియా–ఈయూ డీల్తో కార్ల ధరల్లో భారీ తగ్గుదల!
భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య తాజాగా కుదిరిన కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఇప్పుడు ఆటోమోటివ్ రంగంలో భారీ చర్చకు దారితీస్తోంది. మంగళవారం, జనవరి 27, 2027న అధికారికంగా సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించడం విశేషం. దాదాపు 2 బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఈ ఒప్పందం, భారత్-యూరప్ మధ్య వాణిజ్య సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిగా భావించబడుతోంది. ముఖ్యంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇది భారీ మార్పులకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత యూరప్ నుంచి నేరుగా దిగుమతి అయ్యే లగ్జరీ కార్ల ధరల్లో గణనీయమైన తగ్గుదల ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం భారత్లోకి దిగుమతి అయ్యే లగ్జరీ వాహనాలపై 100 శాతానికి మించిన దిగుమతి సుంకాలు విధిస్తున్నారు. దీనికి తోడు 40 శాతం వరకు వస్తువులు, సేవల పన్ను (GST) కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అధిక పన్నుల కారణంగా, ఒక లగ్జరీ కారు భారత్లోకి వచ్చేసరికి దాని అసలు అంతర్జాతీయ ధరతో పోలిస్తే దాదాపు రెండింతలు లేదా అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది.

అయితే, కొత్త FTA ఒప్పందం ప్రకారం భారత్, యూరోపియన్ యూనియన్ ఈ దిగుమతి సుంకాలను క్రమంగా తగ్గించేందుకు అంగీకరించాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, యూరప్లో తయారయ్యే లగ్జరీ కార్లు భారత మార్కెట్లో మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వో వంటి యూరోపియన్ బ్రాండ్ల కార్ల ధరలు సగానికి తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తే దిగుమతి సుంకాల విషయంలో దశలవారీగా భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. తొలి దశలో ప్రస్తుతం ఉన్న సుమారు 110 శాతం దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలనేది ప్రణాళిక. తర్వాతి దశల్లో దీనిని మరింత తగ్గిస్తూ కేవలం 10 శాతానికి తీసుకురావాలనే లక్ష్యాన్ని భారత్-యూరోపియన్ యూనియన్ పెట్టుకున్నాయి. ఈ నిర్ణయంతో CBU ద్వారా దిగుమతి అయ్యే వాహనాల ధరల్లో భారీ తగ్గుదల కనిపించవచ్చు.

నివేదికల ప్రకారం, ఈ కొత్త విధానంతో సంవత్సరానికి దాదాపు 2,50,000 కార్లు ప్రత్యక్షంగా లాభం పొందవచ్చు. ఇప్పటివరకు అధిక ధరల కారణంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేయలేని వినియోగదారులకు, రాబోయే రోజుల్లో కొనే పరిస్థితి ఏర్పడనుంది. ఉదాహరణకు యూరోప్లోని స్లోవేకియాలో తయారై నేరుగా భారత్కు దిగుమతి అయ్యే లగ్జరీ SUV ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ప్రస్తుతం భారత మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధరగా సుమారు రూ. 1.03 కోట్లకు విక్రయించబడుతోంది.
ఇది దిగుమతి సుంకాలు, పన్నుల వల్లే పెరిగిన ధర. కానీ కొత్త వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చి, తొలి దశలో దిగుమతి సుంకం 40 శాతానికి తగ్గితే ఇదే డిఫెండర్ 110 సుమారు రూ.68.6 లక్షలకు తగ్గవచ్చు. ఇది ఇప్పటి ధరతో పోలిస్తే దాదాపు రూ.35 లక్షలు తక్కువ. ఒప్పందం పూర్తిగా అమలై, చివరి దశలో దిగుమతి పన్ను 10 శాతానికి చేరుకుంటే, డిఫెండర్ ధర మరింత భారీగా తగ్గనుంది.

అప్పుడు ఈ లగ్జరీ SUV ధర సుమారు రూ. 53.9 లక్షల వద్ద నిలిచే అవకాశముంది. అంటే ప్రస్తుతం రూ. 1.03 కోట్లకు అమ్ముడవుతున్న వాహనం, భవిష్యత్తులో దాదాపు సగం ధరకు కూడా అందుబాటులోకి రావచ్చు. ఈ మార్పులు అమలులోకి వస్తే, ల్యాండ్ రోవర్ డిఫెండర్తో పాటు ఇతర కంపెనీల యూరోపియన్ లగ్జరీ కార్లు భారత మార్కెట్లో మరింత విస్తృత వర్గాల వినియోగదారులకు చేరువయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








