ఈ20 పెట్రోల్తో మీ కారు మైలేజ్ పడిపోయిందా?.. రూపాయి ఖర్చు లేకుండా ఇలా పెంచేయండిలా
భారతదేశంలో పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 100% ప్యూర్ ఇథనాల్ను ఇంధనంగా ఉపయోగించే ప్రతిపాదనకు సైతం ఆమోదం తెలిపారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ20 (20% ఇథనాల్, 80% పెట్రోల్) ఇంధనంతోనే చాలా మంది వాహనదారులు మైలేజ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
భవిష్యత్తులో ఇథనాల్ శాతం మరింత పెరిగితే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ (శక్తి సాంద్రత) చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంజిన్ ఎక్కువ పవర్ను ఉత్పత్తి చేయడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది, ఫలితంగా మైలేజ్ తగ్గుతుంది. అయితే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా ఈ మైలేజీని మళ్లీ బూస్ట్ చేసుకోవచ్చు.

1. స్థిరమైన వేగంతో కారును నడపడం
చాలా మంది డ్రైవర్లు రోడ్లపై కారును జిగ్-జాగ్ స్టైల్లో నడుపుతుంటారు. హఠాత్తుగా యాక్సిలరేటర్ నొక్కడం, వేగాన్ని పెంచడం, ఒక్కసారిగా బ్రేకులు వేయడం వల్ల కారు మైలేజ్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ అలవాటు వల్ల హైవేలపై 33 శాతం వరకు, నగరాల్లో 5 శాతం వరకు మైలేజ్ తగ్గిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి.
అందుకే కారును ఎప్పుడూ ఒకే క్రమబద్ధమైన వేగంతో నడపాలి. యాక్సిలరేటర్, బ్రేకులను సున్నితంగా ఉపయోగించాలి. హైవేలపై ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు క్రూజ్ కంట్రోల్ ఫీచర్ను ఆన్ చేసుకోవడం వల్ల ఇంధనం బాగా ఆదా అవుతుంది.
2. టైర్లలో సరైన గాలి ఒత్తిడిని నిర్వహించడం
కారుకు మంచి మైలేజ్ రావాలంటే టైర్లలో గాలి శాతం సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు, రోడ్డుపై టైర్ల ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల కారును ముందుకు నెట్టడానికి ఇంజిన్ సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది.
ఇది నేరుగా ఇంధనాన్ని వృధా చేస్తుంది. అందుకే వారానికి కనీసం ఒక్కసారైనా టైర్ల ప్రెజర్ను చెక్ చేయించుకోవాలి. మీ కారు తయారీ కంపెనీ సూచించిన పరిమాణంలోనే గాలిని నింపాలి. ఈ సమాచారం సాధారణంగా డ్రైవర్ వైపు ఉండే డోర్ ఫ్రేమ్పై ఉన్న స్టిక్కర్లో రాసి ఉంటుంది.

3. సిగ్నల్స్ వద్ద ఇంజిన్ను అనవసరంగా ఆన్ చేసి ఉంచకపోవడం
ట్రాఫిక్ జామ్లలో లేదా రెడ్ లైట్ సిగ్నల్స్ పడినప్పుడు కారును అలాగే స్టార్టింగ్లో ఉంచడం వల్ల పెట్రోల్ భారీగా వృధా అవుతుంది. ఒకవేళ మీరు సిగ్నల్స్ వద్ద 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఆగాల్సి వస్తే వెంటనే కారు ఇంజిన్ను ఆఫ్ చేయండి.
ఈ రోజుల్లో వస్తున్న ఆధునిక కార్లలో ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ ఉంటోంది. ఇది బండి ఆగగానే ఇంజిన్ను ఆపేసి, క్లచ్ లేదా యాక్సిలరేటర్ నొక్కగానే మళ్లీ ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది. పాత మోడల్ కార్లు ఉన్నవారు మాన్యువల్గా కీ తిప్పి ఇంజిన్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
4. కారుపై అదనపు, అనవసరమైన బరువును తగ్గించడం
కారు బరువు పెరిగే కొద్దీ ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. నివేదికల ప్రకారం కారులో ప్రతి 45 కిలోల అదనపు బరువు పెరిగినప్పుడు మైలేజ్ 1 నుంచి 2 శాతం వరకు పడిపోతుంది. అందుకే కారు డిక్కీలో లేదా వెనుక సీట్లలో ఉండే అనవసరమైన సామాగ్రిని, ఇనుప వస్తువులను ఇప్పుడే తీసేయండి.
అలాగే కారు పైన అమర్చే ఎక్స్టీరియర్ రూఫ్ రాక్లు లేదా కార్గో క్యారియర్లను వాడనప్పుడు తీసి పక్కన పెట్టడం మంచిది. ఎందుకంటే ఇవి ప్రయాణంలో గాలి నిరోధకతను పెంచి ఇంజిన్పై భారాన్ని పెంచుతాయి.
5. టైమ్కి సర్వీసింగ్, ప్రాపర్ మెయింటెనెన్స్
కారు మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇంజిన్ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుంది. మురికిగా మారిన ఎయిర్ ఫిల్టర్లు, పాతబడిపోయిన ఇంజిన్ ఆయిల్, కార్బన్ పేరుకుపోయిన ఫ్యూయల్ ఇంజెక్టర్ల వల్ల కారు మైలేజ్ దారుణంగా పడిపోతుంది.
అందుకే కంపెనీ సూచించిన సర్వీసింగ్ షెడ్యూల్ను కచ్చితంగా పాటించాలి. ఎయిర్ ఫిల్టర్లను సమయానికి మార్చడం, గుర్తింపు పొందిన సర్వీస్ సెంటర్లలోనే కారు ట్యూనింగ్ చేయించడం వల్ల ఇంజిన్ లోపల ఇంధనం పూర్తిగా దహనమవుతుంది. ముఖ్యంగా ఈ20 పెట్రోల్పై నడిచే కార్లకు ఈ మెయింటెనెన్స్ చాలా అవసరం.


Click it and Unblock the Notifications