కియా కార్ల సునామీ..ఒక్క నెలలోనే డబుల్ గ్రోత్..ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న కొరియన్ దిగ్గజం
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా (Kia India) 2025 ఏడాదిని ఘనంగా ముగించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో కంపెనీ తన చరిత్రలోనే అత్యుత్తమ డిసెంబర్ అమ్మకాలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కియా సోనెట్, సెల్టోస్ వంటి పాపులర్ మోడళ్లతో పాటు కొత్తగా వచ్చిన సైరోస్ (Syros) కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
కియా ఇండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 2025 డిసెంబర్ నెలలో ఈ సంస్థ మొత్తం 18,659 కార్లను విక్రయించింది. 2024 డిసెంబర్ (8,957 యూనిట్లు)తో పోలిస్తే ఇది ఏకంగా 105 శాతం పెరుగుదల కావడం విశేషం. ఈ అద్భుతమైన అమ్మకాలతో భారతదేశంలో అత్యధిక కార్లు అమ్ముతున్న కంపెనీల జాబితాలో కియా ఆరో స్థానానికి చేరుకుంది. మొత్తం 2025 క్యాలెండర్ ఇయర్లో కియా 2.80 లక్షల కార్లను విక్రయించి, వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధిని సాధించింది.

కియా కార్లలో సోనెట్ (Sonet) మరోసారి తన పట్టును నిరూపించుకుంది. డిసెంబర్ నెలలో ఏకంగా 9,418 సోనెట్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే కియా మొత్తం అమ్మకాల్లో సగానికి పైగా ఈ ఒక్క మోడల్ నుంచే రావడం గమనార్హం.
గత ఏడాది డిసెంబర్ అమ్మకాలతో పోలిస్తే సోనెట్ 182 శాతం వృద్ధి చెందింది. ఇక సెల్టోస్ (Seltos) విషయానికి వస్తే, 4,369 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల విడుదలైన 2026 కొత్త సెల్టోస్ రాకతో రాబోయే నెలల్లో ఈ అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ ధీమాగా ఉంది.

సైరోస్, కేరెన్స్ క్లావిస్ ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన కియా సైరోస్ (Syros) తన సత్తా చాటుతోంది. నవంబర్ నెలలో 544 యూనిట్లు మాత్రమే అమ్ముడైన ఈ కారు, డిసెంబర్ లో ఏకంగా 1,116 యూనిట్ల మార్కును అందుకుని 105 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసింది.
అటు కేరెన్స్ క్లావిస్ (Carens Clavis), దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా 3,681 యూనిట్ల అమ్మకాలతో కంపెనీకి మంచి తోడ్పాటునిచ్చాయి. అయితే, లగ్జరీ కార్నివాల్ (Carnival) మాత్రం 75 యూనిట్లకే పరిమితమైంది. మార్కెట్ వాటా పెరుగుదల అమ్మకాలలో నెలవారీగా (నవంబర్ తో పోలిస్తే) 27 శాతం స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, వార్షిక ప్రాతిపదికన కియా మార్కెట్ వాటా గణనీయంగా పెరిగింది.

గత ఏడాది డిసెంబర్ లో కేవలం 2.8 శాతంగా ఉన్న కియా మార్కెట్ షేర్, ఇప్పుడు 4.6 శాతానికి చేరింది. భవిష్యత్తులో సైరోస్ ఈవీ (Syros EV)ని కూడా లాంచ్ చేసేందుకు కియా సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త మోడళ్లు, ఎలక్ట్రిక్ వేరియంట్ల రాకతో 2026లో కూడా కియా తన దూకుడును కొనసాగించేలా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే 2025 సంవత్సరం కియా ఇండియాకు కేవలం ఒక విజయవంతమైన ఏడాది మాత్రమే కాదు, అది ఆ సంస్థ బ్రాండ్ పవర్ ఏంటో నిరూపించిన సంవత్సరం. ఒకప్పుడు కేవలం సెల్టోస్తో మొదలైన కియా ప్రయాణం, ఇప్పుడు సోనెట్, కేరెన్స్, సరికొత్త సైరోస్ (Syros) వంటి వైవిధ్యమైన మోడళ్లతో ప్రతి ఇంటికీ చేరువయ్యింది. ముఖ్యంగా డిసెంబర్ అమ్మకాల్లో 105% వృద్ధి సాధించడం అంటే భారతీయ కస్టమర్లు కియా నాణ్యతను, టెక్నాలజీని ఎంతలా నమ్ముతున్నారో స్పష్టమవుతోంది.
టెక్నాలజీలో దూసుకుపోతున్న కియా, రాబోయే రోజుల్లో సైరోస్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ మోడళ్లతో భారత రోడ్లపై మరింతగా తన ఆధిపత్యాన్ని చాటుకునేలా కనిపిస్తోంది. కేవలం ఐదేళ్లలోనే టాప్-6 స్థానాల్లో ఒకటిగా నిలవడం కియా తిరుగులేని వ్యూహానికి నిదర్శనం. భవిష్యత్తులో ఈ కొరియన్ స్మార్ట్ పవర్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం!


Click it and Unblock the Notifications








