మహీంద్రా బీఈ 6 అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదేనట... బ్యాటరీ తప్పు లేదని తేల్చి చెప్పిన కంపెనీ
ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బ్యాటరీ పేలిపోతుందేమో.. కారు తగలబడిపోతుందేమో అన్న భయం. ముఖ్యంగా గతంలో కొన్ని చౌకబారు విదేశీ విడిభాగాలతో తయారైన ఎలక్ట్ిక్ స్కూటర్లు తగలబడటంతో ఈ భయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. అయితే తాజాగా మహీంద్రా కంపెనీకి చెందిన అత్యంత ఆధునిక మహీంద్రా బీఈ 6 (Mahindra BE 6) ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉత్తరప్రదేశ్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురికావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈవీల సేఫ్టీ మీద మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మహీంద్ర కంపెనీ అత్యంత పారదర్శకంగా స్పందిస్తూ అసలు మంటలు ఎలా వచ్చాయో సాక్ష్యాధారాలతో సహా వివరించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. అందులో భాగంగా వచ్చినవే XEV 9e, BE 6 మోడల్స్. ఈ కార్లు అత్యాధునిక సెన్సార్లు, సేఫ్టీ ఫీచర్లతో నిండి ఉంటాయి. యూపీలోని హాపూర్ జిల్లా కురానా టోల్ ప్లాజా సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత, కంపెనీ ఇంజనీర్లు వాహనంలోని సాఫ్ట్వేర్, సెన్సార్ డేటాను నిశితంగా పరిశీలించారు. ఈ పరిశోధనలో తేలిందేమిటంటే ఆ ప్రమాదానికి బ్యాటరీకి ఎలాంటి సంబంధం లేదు.

అసలేం జరిగింది? సెన్సార్ డేటా ఏం చెబుతోంది?
బులంద్షహర్ నుంచి హాపూర్ వైపు వెళ్తున్న మహీంద్రా బీఈ6 కారులోని వెనుక కుడి వైపు టైర్ మధ్యలోనే పంక్చర్ అయ్యింది. కారులోని టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వెంటనే స్పందించి, గాలి తక్కువగా ఉందని డ్రైవర్కు పదే పదే హెచ్చరికలు పంపింది. అయితే, డ్రైవర్ ఆ వార్నింగ్లను పూర్తిగా విస్మరించాడు. గాలి లేని టైర్తోనే కారును గంటకు 60 కిలోమీటర్ల వేగంతో సుమారు 10 నిమిషాల పాటు అలాగే నడిపాడు.
పంక్చర్ అయిన టైర్ మీద అంత వేగంగా ప్రయాణించినప్పుడు, టైర్ రబ్బరుకు, తారు రోడ్డుకు మధ్య భయంకరమైన ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణ వల్ల పుట్టిన వేడికి టైర్ రబ్బరు కరిగిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదకర స్థితిని కారులోని సెన్సార్లు ముందుగానే గుర్తించాయి. కారులోని ఈఎస్పీ (ESP - Electronic Stability Program), టిసిఎస్ (TCS - Traction Control System) వ్యవస్థలు పంక్చర్ అయిన టైర్ కదలికలను కంట్రోల్ చేయడానికి నిరంతరం ప్రయత్నించాయి.

టైర్ ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడాన్ని గమనించిన సిస్టమ్, వెంటనే ఇంజన్ (మోటార్) వేగాన్ని తగ్గించి, సిస్టమ్ను ఆటోమేటిక్గా షట్ డౌన్ చేసింది. కారు సురక్షితంగా రోడ్డు పక్కన ఆగడానికి ఇది సహకరించింది. దీనివల్ల కారులోని ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడగలిగారు.
సాధారణంగా ఎలక్ట్రిక్ కారు కాలుతుందంటే అందరూ బ్యాటరీనే నిందిస్తారు. కానీ ఈ ఘటనలో టైర్ వల్ల మంటలు పుట్టి బయట నుంచి తీవ్రమైన వేడి తగిలినప్పటికీ, మహీంద్రా హై-వోల్టేజ్ బ్యాటరీ మాత్రం చెక్కుచెదరలేదు. బ్యాటరీ లోపల ఉండే సెల్స్ వోల్టేజ్ స్థిరంగా ఉందని, మోటార్కు కూడా ఎలాంటి నష్టం కలగలేదని కంపెనీ డేటా సాక్ష్యాలతో సహా నిరూపించింది. రోడ్డుపై ఉన్న ప్రజలు తీసిన వీడియోలు కూడా మంటలు టైర్ నుంచే మొదలైనట్లు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో మహీంద్రా కంపెనీ వాహనదారులకు ఒక కీలక సూచన చేసింది. "మా కార్లు అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో తయారవుతాయి. అయితే కారు ఇచ్చే సెన్సార్ అలెర్ట్స్, వార్నింగ్లను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. టైర్ ప్రెజర్ తక్కువగా ఉన్నా లేదా వేడి పెరుగుతున్నట్లు సిగ్నల్ వచ్చినా వెంటనే కారు ఆపి తనిఖీ చేయండి" అని కోరింది. ఈ వివరణతో ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. సాంకేతిక లోపం కంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమైంది.


Click it and Unblock the Notifications








