లోడ్ ఎంతున్నా పర్లేదు.. డ్రైవర్లకు కాసుల వర్షం కురిపించే మహీంద్రా పికప్ వచ్చేసింది
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన ఐకానిక్ వాహనాలైన బొలెరో క్యాంపర్ (Bolero Camper), బొలెరో పిక్-అప్ (Bolero Pik-Up) శ్రేణిని 2026 కొత్త మోడళ్లతో అప్డేట్ చేసింది. కేవలం లోడ్ మోయడానికే కాకుండా, డ్రైవర్ల సౌకర్యం, మోడ్రన్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ఈ మార్పులు చేపట్టింది. ఈ కొత్త మార్పులు వ్యాపారస్తుల పనితీరును ఎలా మార్చబోతున్నాయో ఈ కథనంలో చూద్దాం.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ భారతీయ కమర్షియల్ వెహికల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా, తన పాపులర్ మోడల్స్ అయిన బొలెరో కాంపర్, పిక్-అప్లను సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేసింది.

ముఖ్యంగా ఎండాకాలంలోనూ, దూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే డ్రైవర్ల కష్టాలను గుర్తించి, ఈసారి ఎయిర్ కండిషనింగ్ (AC), హీటర్ సదుపాయాలను మరిన్ని వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల డ్రైవర్లు అలసట లేకుండా రోజంతా పని చేసే అవకాశం ఉంటుంది, ఇది వారి ఉత్పాదకతను పెంచుతుంది.
టెక్నాలజీ విషయానికి వస్తే.. 2026 మోడళ్లలో iMAXX టెలిమాటిక్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఇది ఒక స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్. దీని ద్వారా వాహనం ఎక్కడుంది? ఎంత ఇంధనం ఖర్చవుతోంది? ఇంజిన్ హెల్త్ ఎలా ఉంది? వంటి రియల్ టైమ్ డేటాను వాహన యజమానులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు.

భారీ వాహన శ్రేణి (Fleet Management) కలిగిన వ్యాపారస్తులకు ఇది ఒక వరమనే చెప్పాలి. ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, కొత్త గ్రాఫిక్స్ (Decals), బాడీ కలర్ ఉన్న ఓఆర్వీఎంలు (ORVMs), సరికొత్త డోర్ హ్యాండిల్స్ ఈ వాహనాలకు మోడ్రన్ లుక్ ఇచ్చాయి.
లోపలి భాగంలో కంఫర్ట్ కోసం మహీంద్రా గట్టిగానే కసరత్తు చేసింది. డ్రైవర్ సీటును ఇప్పుడు వెనక్కి వాల్చుకోవచ్చు. అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ కూడా ఇచ్చారు. అలాగే కో-డ్రైవర్ సీటును వెడల్పుగా మార్చారు, దీనివల్ల ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
ఎంటర్టైన్మెంట్ కోసం బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉన్న మ్యూజిక్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. సేఫ్టీ పరంగా సెంట్రల్ లాకింగ్, రియర్ సీట్ బెల్టులను అన్ని వేరియంట్లలో ప్రామాణికం చేశారు. ఇంజిన్ సామర్థ్యం పరంగా చూస్తే, రెండింటిలోనూ శక్తివంతమైన 2.5 లీటర్ టర్బోచార్జ్డ్ టీసెల్ ఇంజిన్ను వాడారు. ఇది 80 hp పవర్, 200 Nm టార్క్ను అందిస్తుంది.

5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వచ్చే ఈ ఇంజిన్, బురద ప్రాంతాలు లేదా కొండ ప్రాంతాల్లో కూడా సులువుగా ప్రయాణించడానికి 2WD, 4WD ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మహీంద్రా బొలెరో కాంపర్ శ్రేణిలో వివిధ రకాల అవసరాలకు తగ్గట్టుగా ధరలను నిర్ణయించారు. బేసిక్ మోడల్ అయిన నాన్-ఏసీ 2WD వేరియంట్ రూ. 9.85 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తోంది.
కొంచెం కఠినమైన రోడ్లపై ప్రయాణించాలనుకునే వారి కోసం నాన్-ఏసీ 4WD మోడల్ను రూ.10.13 లక్షలకు అందుబాటులోకి తెచ్చారు. ఇక ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారు గోల్డ్ ZX మోడల్ను రూ.10.20 లక్షలకు, గోల్డ్ RX మోడల్ను రూ.10.25 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ శ్రేణిలో అత్యంత ఖరీదైన, అన్ని సదుపాయాలున్న గోల్డ్ RX 4WD వేరియంట్ ధర రూ.10.49 లక్షలుగా ఉంది.
వ్యాపార అవసరాల కోసం ఎక్కువగా వాడే బొలెరో పిక్-అప్ ధరలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ అయిన పిక్-అప్ MS CBC ధర రూ.9.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి బాడీతో వచ్చే పిక్-అప్ MS FB మోడల్ రూ.9.70 లక్షలకు లభిస్తోంది.
ఈసారి కస్టమర్లు ఎక్కువగా ఎదురుచూస్తున్న ఏసీ సదుపాయం ఉన్న పిక్-అప్ PS FB AC వేరియంట్ ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా, ఆఫ్-రోడ్ సామర్థ్యం, ఏసీ కంఫర్ట్ రెండూ కావాలనుకునే వారి కోసం పిక్-అప్ 4WD AC మోడల్ను కూడా రూ.9.99 లక్షలకే అందిస్తుండటం గమనార్హం.
ఈ అప్డేట్స్ కేవలం వాహనాన్ని మార్చడమే కాదు, చిన్న తరహా రవాణా రంగంలో పని చేసే డ్రైవర్ల జీవనశైలిని కూడా మార్చబోతున్నాయి. గతంలో కేవలం లోడ్ మోసే పనిముట్టుగా చూసిన వాహనాన్ని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్న మోడ్రన్ వెహికల్గా మహీంద్రా తీర్చిదిద్దింది.


Click it and Unblock the Notifications