మహీంద్రా కంపెనీకి శనిలా పట్టిన 7 సీటర్..గత నెలలో ఒక్కటంటే ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు
భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. స్కార్పియో, థార్, ఎక్స్యూవీ 700 వంటి మోడళ్లతో మార్కెట్ను ఏలుతోంది. కానీ ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే, మహీంద్రా కంపెనీలో ఒక మోడల్ మాత్రం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. అది మరేదో కాదు, ఒకప్పుడు ఎంతో ఆశలతో విడుదల చేసిన ఎంపీవీ (MPV) మహీంద్రా మరాజో (Mahindra Marazzo). తాజా అమ్మకాల నివేదికల ప్రకారం, ఈ కారు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. గత ఫిబ్రవరి 2026 నెలలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు. అంటే జీరో (0) సేల్స్ నమోదయ్యాయి.
కస్టమర్ల ఊసే లేదు.. కనుమరుగు కాక తప్పదా?
మహీంద్రా స్కార్పియో వంటి కార్లు నెలకు 15 వేల యూనిట్ల పైగా అమ్ముడవుతూ రికార్డులు సృష్టిస్తుంటే, మరాజో వైపు మాత్రం కస్టమర్లు కన్నెత్తి కూడా చూడటం లేదు. గతేడాది ఫిబ్రవరిలో కనీసం 17 మంది మరాజోను కొనుగోలు చేశారు, కానీ ఈసారి అది సున్నాకి పడిపోవడం కంపెనీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.

2018లో షార్క్ (Shark) డిజైన్ స్ఫూర్తితో ఎంతో ఆర్భాటంగా విడుదలైన ఈ ఎంపీవీ, ఇప్పుడు మార్కెట్లో మనుగడ సాగించడానికి తీవ్రంగా కష్టపడుతోంది. అటు అట్రిగా వంటి బడ్జెట్ కార్లకు, ఇటు ఇన్నోవా వంటి లగ్జరీ కార్లకు మధ్యలో నలిగిపోయి మరాజో తన ఉనికిని కోల్పోయింది.
మరాజోలో లోపమేంటి? అదిరిపోయే ఫీచర్లు ఉన్నా ఎందుకీ దెబ్బ?
నిజానికి ఫీచర్ల పరంగా మరాజో తక్కువ ఏమీ కాదు. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.6 అంగుళాల భారీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక వసతులు ఉన్నాయి. ప్రయాణీకుల సేఫ్టీ కోసం 2 ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లను కూడా మహీంద్రా అందించింది.

ఇంజన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ 120.96 BHP పవర్ను, 300 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 18 నుండి 22 కిలోమీటర్ల మైలేజీని కూడా ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయినప్పటికీ, మార్కెట్లో పెట్రోల్, ఆటోమేటిక్ ఆప్షన్లు లేకపోవడం ఈ కారుకు శాపంగా మారింది.
పోటీ తట్టుకోలేకేనా?
మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Ertiga) మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉండగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) ప్రీమియం అనుభూతిని ఇస్తోంది. ఈ రెండింటి మధ్య మరాజో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకోవడంలో విఫలమైంది.

ఒకప్పుడు ఈ కారును ట్యాక్సీ మార్కెట్లో భారీగా వాడతారని భావించారు, కానీ నిర్వహణ ఖర్చులు, సర్వీసింగ్ సమస్యల వల్ల అక్కడా ఆశించిన ఫలితం రాలేదు. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.06 లక్షల నుంచి రూ.16.38 లక్షల వరకు ఉంది.
భవిష్యత్తు ప్రణాళికల్లో మరాజో లేనట్టేనా?
మహీంద్రా ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా ఎలక్ట్రిక్ ఎస్యూవీలు (EV), పవర్ఫుల్ ఐసీఈ (ICE) వాహనాలపై పెట్టింది. ఇటీవల XEV 9S, XUV 7XO వంటి విప్లవాత్మక మోడళ్లను విడుదల చేసిన మహీంద్రా, రాబోయే ఏడాది కాలంలో 5 కొత్త ఎస్యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఇందులో కొత్త స్కార్పియో-ఎన్ వెర్షన్లు, పవర్ఫుల్ థార్, సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ వేగవంతమైన ప్రయాణంలో, ఎటువంటి అమ్మకాలు లేని మరాజోను కొనసాగించడం కంటే, దాని ప్రొడక్షన్ను ఆపేయడమే మంచిదని కంపెనీ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.


Click it and Unblock the Notifications








