ఈ చిన్న కార్ల కోసం లక్షల మంది వెయిటింగ్.. 1.90 లక్షల పెండింగ్ ఆర్డర్లతో రికార్డు సృష్టించిన ఆటో దిగ్గజం
దేశీయ రోడ్ల మీద మారుతి సుజుకి కార్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య తరగతి కుటుంబాలకు కార్లంటే మారుతి కార్లే. అయితే ఇప్పుడు మధ్య తరగతి ప్రజల కారు కల సాకారం చేసుకోవాలంటే కాస్త ఓపిక పట్టక తప్పదు. ఎందుకంటే మారుతి సుజుకి కార్లకు డిమాండ్ ఏం రేంజులో ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రస్తుతం కంపెనీ దగ్గర దాదాపు 1.92 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగులో ఉన్నాయి. అంటే షోరూంకు వెళ్లి కారు బుక్ చేసుకుంటే అది చేతికి రావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ఇష్టపడే వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల కోసం లక్షలాది మంది కస్టమర్లు క్యూలో ఉన్నారు.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన 2026 ఆర్థిక సంవత్సరపు నివేదికను రిలీజ్ చేసింది. ఈ ఏడాది కంపెనీ ఏకంగా 24 లక్షల కార్లను విక్రయించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసినప్పటికీ కస్టమర్ల డిమాండ్ను పూర్తిగా తీర్చలేకపోయింది. మార్చి 2026 నాటికి కంపెనీ వద్ద 1.90 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి.
ఇందులో సింహభాగం చిన్న కార్లవే కావడం విశేషం. ఆల్టో, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల కోసం దాదాపు 1.30 లక్షల మంది వేచి చూస్తున్నారు. డీలర్ల వద్ద కూడా కేవలం 12 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే అందుబాటులో ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. మార్కెట్ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయని, డిమాండ్ కూడా బలంగా ఉందని తెలిపారు. అయితే, ఉత్పత్తి వ్యయం పెరగడం, ప్రొడక్షన్లో ఎదురవుతున్న కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల సకాలంలో డెలివరీ ఇవ్వడం కష్టమవుతోంది.
ప్రస్తుతం చిన్న కార్ల కోసం సగటు వెయిటింగ్ పీరియడ్ ఒక నెలగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కంపెనీ గుజరాత్లోని ఖోరాజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం పొందింది. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 2.50 లక్షల అదనపు కార్లను తయారు చేయనున్నారు. ఇందుకోసం కంపెనీ సుమారు 10,189 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని పెడుతోంది.

మారుతి సుజుకి ప్రస్తుతం తన ఎరీనా (Arena), నెక్సా (Nexa) డీలర్షిప్ల ద్వారా మొత్తం 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో 10 మోడళ్లు ఎరీనా ద్వారా, 7 మోడళ్లు నెక్సా ద్వారా అందుబాటులో ఉన్నాయి. గతేడాది మార్చిలో కంపెనీ 2.25 లక్షల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది.
అయితే, పెరుగుతున్న ముడి సరుకుల ఖర్చులు కంపెనీకి తలనొప్పిగా మారాయి. కస్టమర్ల పై భారం పడకుండా ఇప్పటివరకు జాగ్రత్త పడ్డ మారుతి, త్వరలోనే కార్ల ధరలను పెంచే యోచనలో ఉంది. ధరలు పెంచాల్సిన అవసరం ఉందా లేదా అన్నది త్వరలోనే సమీక్షిస్తామని పార్థో బెనర్జీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం మారుతి సుజుకికి గురుగ్రామ్, మానెసర్, ఖార్ఖోడా, హన్సల్పూర్ ప్రాంతాల్లో ప్లాంట్లు ఉన్నాయి. వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 24 లక్షల యూనిట్లు కాగా, గరిష్టంగా 26 లక్షల వరకు పెంచుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్లాంట్లు తమ పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి.
అందుకే భవిష్యత్తు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ కార్ల భవిష్యత్తు గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, మారుతి మాత్రం సీఎన్జీ, హైబ్రిడ్ మోడళ్లపై దృష్టి సారిస్తూ మార్కెట్ లీడర్గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications