మనోళ్లే కాదు విదేశీయులు కూడా ఈ కార్లంటే పిచ్చెక్కి పోతున్నారు.. 24 లక్షల కార్లతో మార్కెట్లో సునామీ
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీ మార్కెట్లోనే కాదు, విదేశీ గడ్డపై కూడా జెండా పాతేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ కళ్లు చెదిరే అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది. ముఖ్యంగా విదేశీయులు మారుతి కార్ల ఫీచర్లు, మైలేజీకి ఫిదా అయిపోతున్నారు. ఏకంగా 4.47 లక్షల మంది విదేశీయులు మారుతి కార్లను కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకుందాం.
విదేశీ మార్కెట్లలో మారుతి మ్యాజిక్
మారుతి సుజుకి ఇండియాకు 2026 ఆర్థిక సంవత్సరం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. సాధారణంగా భారత్లో మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ బ్రాండ్గా పేరున్న మారుతి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన పట్టును నిరూపించుకుంది. ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీ ఏకంగా 4,47,774 యూనిట్లను ఎగుమతి చేసింది. గత ఆర్థిక సంవత్సరం (FY25) లో ఈ సంఖ్య 3,32,585 యూనిట్లుగా ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 1,15,189 కార్లను విదేశీయులు కొనుగోలు చేశారు. 34 శాతం వార్షిక వృద్ధితో మారుతి సుజుకి వరుసగా ఐదవ ఏడాది కూడా భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల ఎగుమతిదారుగా నిలిచే అవకాశం ఉంది.

ఎగుమతుల్లో కొత్త అస్త్రం.. ఈ-విటారా!
ఈ ఏడాది మారుతి సుజుకి సాధించిన అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే అది వారి తొలి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా (e-Vitara) ఎగుమతులు ప్రారంభం కావడం. గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంట్ను మారుతి ఒక గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చింది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేస్తోంది. సెడాన్లు, హ్యాచ్బ్యాక్లు, ఎస్యూవీల శ్రేణికి తోడు ఇప్పుడు ఈవీలు కూడా తోడవ్వడంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మారుతి బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
విదేశీయులు ఇష్టపడుతున్న మోడళ్లు ఇవే..
మారుతి ఎగుమతి చేస్తున్న మోడళ్ల జాబితా చాలా పెద్దది. విదేశీ మార్కెట్లలో ముఖ్యంగా మారుతి ఫ్రాంక్స్ (Fronx), జిమ్నీ (Jimny), బ్రెజా (Brezza), గ్రాండ్ విటారా (Grand Vitara) వంటి ఎస్యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు యువతను ఆకర్షించే బాలెనో, స్విఫ్ట్ వంటి హ్యాచ్బ్యాక్లు, బడ్జెట్ ప్రియుల కోసం ఆల్టో K10, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఇగ్నిస్ కార్లను కూడా కంపెనీ ఎగుమతి చేస్తోంది. సెడాన్ విభాగంలో డిజైర్, సియాజ్ కార్లు కూడా విదేశీ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ల కోసం అరిటిగా, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లు కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

దేశీయ మార్కెట్లోనూ తిరుగులేని రికార్డు
కేవలం ఎగుమతులే కాదు, దేశీయంగా కూడా మారుతి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మార్చి 2026లో మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో 1,66,219 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే 10.27 శాతం వృద్ధి. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 24,22,713 యూనిట్ల మొత్తం అమ్మకాలను (దేశీయ + ఎగుమతులు) సాధించి, తన చరిత్రలోనే అతిపెద్ద వార్షిక అమ్మకాల రికార్డును నెలకొల్పింది. కమర్షియల్ వాహనాల విభాగంలో కూడా కంపెనీ సానుకూల వృద్ధిని కనబరిచింది.
విజయానికి గల కారణాలు.. భవిష్యత్తు ప్రణాళికలు
మారుతి సుజుకి విజయానికి ప్రధాన కారణం వారి విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లను తీసుకురావడం. విదేశీ మార్కెట్లలో మారుతి కార్ల మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వారికి ప్రధాన ఆకర్షణగా మారాయి. రానున్న కాలంలో మారుతి మరింతగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టనుంది. 2030 నాటికి తన మొత్తం అమ్మకాల్లో ఎగుమతుల వాటాను మరింత పెంచుకోవాలని, ముఖ్యంగా యూరప్, జపాన్ వంటి మార్కెట్లలో ఈ-విటారాతో పాగా వేయాలని కంపెనీ వ్యూహరచన చేస్తోంది.


Click it and Unblock the Notifications








