టాక్సులు తగ్గాయ్.. కార్లు పెరిగాయ్.. మారుతి షోరూమ్ల ముందు క్యూ కట్టిన జనం!
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన ప్రస్థానంలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (Q3) కంపెనీ కలలో కూడా ఊహించని రీతిలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే చిన్న కార్ల విభాగంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం విశేషం. ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'GST 2.0' సంస్కరణలు అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ త్రైమాసికంలో మారుతి సుజుకి సాధించిన విజయాల్లో అత్యంత ముఖ్యమైన అంశం ఫస్ట్ టైమ్ బయర్స్ (మొదటిసారి కారు కొనేవారు). గతంలో ఈ విభాగం వాటా 40 శాతంగా ఉండగా, ఈ క్యూ3లో అది ఏకంగా 47 శాతానికి చేరుకుంది. అంటే, కొత్తగా కారు కొనాలనుకునే ప్రతి ఇద్దరిలో ఒకరు మారుతి సుజుకినే ఎంచుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజలు మళ్ళీ చిన్న కార్ల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ మార్పు సాధ్యమైందని కంపెనీ ఎగ్జిక్యూటివ్లు వెల్లడించారు.

2025 సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన GST 2.0 నిబంధనలు మారుతి సుజుకికి వరంగా మారాయి. అంతకుముందు చిన్న కార్లపై 28 శాతం ఉన్న పన్నును ప్రభుత్వం 18 శాతానికి తగ్గించింది. దీనివల్ల 1200cc లోపు పెట్రోల్ కార్లు, 1500cc లోపు డీజిల్ కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. కొన్ని మోడళ్లపై దాదాపు రూ. 1.3 లక్షల వరకు ధర తగ్గడం సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చింది. ఈ ధరల తగ్గింపు వల్ల ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు దాదాపు 68,328 యూనిట్లు అదనంగా పెరిగాయి.
ఈ క్యూ3లో మారుతి సుజుకి మొత్తం 5,64,669 యూనిట్లను దేశీయంగా విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన 4,66,993 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఇది భారీ వృద్ధి. ఎగుమతులతో కలిపి మొత్తం విక్రయాలు 6,67,769 యూనిట్లకు చేరాయి. ఆర్థికంగా చూస్తే, కంపెనీ నికర అమ్మకాలు రూ.4,75,344 మిలియన్లకు చేరుకున్నాయి. కొత్త లేబర్ కోడ్ నిబంధనల వల్ల ఒకసారి చెల్లించాల్సిన కేటాయింపులు ఉన్నప్పటికీ, కంపెనీ రూ.37,940 మిలియన్ల నికర లాభాన్ని ఆర్జించింది.

భారత మార్కెట్లో మళ్ళీ 50 శాతం వాటాను దక్కించుకోవడమే లక్ష్యంగా మారుతి సుజుకి ముందుకు సాగుతోంది. దీనికోసం గుజరాత్లోని ఖరోజ్లో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే హర్యానాలోని ఖార్ఖోడాలో రెండో ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 40 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది.
మారుతి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా' (e-Vitara) త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం యూరప్, జపాన్ మార్కెట్లలో అమ్ముడవుతున్న ఈ కారును గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. 2025-26 చివరి త్రైమాసికంలో ఇది భారత రోడ్లపై పరుగులు తీయనుంది.
500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్తో రాబోతున్న ఈ కారు, టాటా, మహీంద్రా ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. మొత్తం మీద, జీఎస్టీ తగ్గింపు, కొత్త మోడల్స్ రాకతో మారుతి సుజుకి భారత ఆటో మార్కెట్లో తన 50 శాతం మార్కెట్ వాటాను మళ్ళీ దక్కించుకునేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








