పెట్రోల్ బాధ లేదు.. మైలేజ్ చింత లేదు.. ఒక్క ఏడాదిలో 7 లక్షల కార్లను ప్రపంచ దేశాలకు పంపిన ఆటో దిగ్గజం
భారతీయ రోడ్ల మీద మారుతీ సుజుకి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సాధారణంగా పెట్రోల్ కార్ల అమ్మకాల్లో మారుతీకి తిరుగులేదన్న సంగతి మనకు తెలుసు, కానీ ఇప్పుడు సీఎన్జీ (CNG) కార్ల సెగ్మెంట్లో కూడా ఈ కంపెనీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారతీయులు మారుతీ సీఎన్జీ కార్ల మీద మనసు పారేసుకున్నారు.
కేవలం 365 రోజుల్లోనే ఏకంగా 7 లక్షలకు పైగా సీఎన్జీ కార్లు అమ్ముడయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో, సామాన్యుడికి మైలేజీతో పాటు భరోసా ఇచ్చే కారు కావాలి. ఆ భరోసా మారుతీ సుజుకి నుంచి లభించడంతో, జనం షోరూమ్లకు క్యూ కట్టారు. కిలో సీఎన్జీకి ఏకంగా 35 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇచ్చే కార్లు ఈ కంపెనీ సొంతం.

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ తన ఫైనాన్షియల్ ఇయర్ 2026 (ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026) రిపోర్టును విడుదల చేసింది. ఈ కాలంలో కంపెనీ ఏకంగా 7,08,096 సీఎన్జీ కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మారుతీ వద్ద 14 రకాల సీఎన్జీ మోడల్స్ ఉన్నాయి.
ఇందులో చిన్న హ్యాచ్బ్యాక్ కార్ల నుంచి, సెడాన్లు, ఎస్యూవీలు, ఏడుగురు కూర్చునే ఎంపీవీ (MPV) కార్లు కూడా ఉన్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఆల్టో నుంచి లగ్జరీ కోరుకునే గ్రాండ్ విటారా వరకు ప్రతి సెగ్మెంట్లో సీఎన్జీ ఆప్షన్ ఉండటమే ఈ భారీ సక్సెస్కు ప్రధాన కారణం.

ఒకప్పుడు సీఎన్జీ అంటే కేవలం చిన్న కార్లకే పరిమితం అని అందరూ అనుకునేవారు. కానీ ఈ ఏడాది ఫలితాలు చూస్తే ఆ ట్రెండ్ మారిపోయిందని అర్థమవుతోంది. మారుతీ సుజుకి ఎర్టిగా (Ertiga) సీఎన్జీ కారు గత ఏడాది అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది. ఏకంగా 1,45,480 మంది భారతీయులు ఈ 7-సీటర్ కారును కొనుగోలు చేశారు.
పెద్ద కుటుంబాలకు ఇది ఒక వరంగా మారింది. దీని తర్వాత మారుతీ డిజైర్ (Dzire) 1,35,330 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మధ్యతరగతికి ఆత్మీయుడైన వ్యాగన్ఆర్ (WagonR) 96,381 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది.
మారుతీ కొత్తగా తీసుకొచ్చిన ఎస్ యూవీలు కూడా సీఎన్జీ విభాగంలో అదరగొడుతున్నాయి. మారుతీ బ్రెజ్జా (Brezza) సీఎన్జీ 71,329 యూనిట్లు, ఎకో (Eeco) 66,675 యూనిట్లు, సరికొత్త ఫ్రాంక్స్ (Fronx) 54,805 యూనిట్ల విక్రయాలను సాధించాయి. గతంలో డామినేట్ చేసిన ఆల్టో, సెలెరియో వంటి కార్లు ఇప్పుడు జాబితాలో కొంచెం కిందకు పడిపోయాయి.

దీన్ని బట్టి చూస్తే భారతీయులు ఇప్పుడు ఫీచర్లు ఎక్కువగా ఉన్న పెద్ద కార్లనే సీఎన్జీ వెర్షన్లలో కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. విక్టోరిస్ (35,677), స్విఫ్ట్ (30,357), బాలెనో (23,228) వంటి మోడల్స్ కూడా తమ వంతు వాటాను అందించాయి. ఎర్టిగా సీఎన్జీ ఇంతగా అమ్ముడవ్వడానికి దాని ఫీచర్లు, పొదుపే ప్రధాన కారణం. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది సీఎన్జీ మోడ్లో కూడా అద్భుతమైన పవర్ను ఇస్తుంది.
కిలో సీఎన్జీకి ఇది 26.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. లోపల 9-అంగుళాల భారీ టచ్స్క్రీన్, స్మార్ట్ప్లే ప్రో టెక్నాలజీ, వాయిస్ కమాండ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్బ్యాగులు కూడా ఇచ్చారు. రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల ధరలో లభించే ఈ కారు కియా క్యారెన్స్, టయోటా రుమియన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.
మారుతీ సీఎన్జీ కార్లంటేనే మైలేజీకి పెట్టింది పేరు. ఆల్టో, సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి కార్లు కిలో గ్యాస్కు 30 నుంచి 35 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. పెట్రోల్ తో పోలిస్తే ప్రయాణ ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది. అందుకే అటు వ్యక్తిగత అవసరాల కోసం, ఇటు ట్యాక్సీ సర్వీసుల కోసం జనం మారుతీ కార్లనే గుడ్డిగా నమ్ముతున్నారు. గతేడాది గ్రాండ్ విటారా (17,370), XL6 (20,962) వంటి ప్రీమియం కార్లలో కూడా సీఎన్జీ సక్సెస్ అవ్వడం గమనార్హం.
మొత్తానికి 2026 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకి సీఎన్జీ సామ్రాజ్యాన్ని నిర్మించిందని చెప్పాలి. పెరుగుతున్న గ్యాస్ స్టేషన్లు, వాహనాల్లో మెరుగైన సేఫ్టీ (ట్విన్ సిలిండర్ టెక్నాలజీ వంటివి) కూడా ఈ అమ్మకాల పెరుగుదలకు తోడ్పడ్డాయి. రాబోయే కాలంలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications