భారత రైల్వే చరిత్రలోనే పెను సంచలనం..కంపెనీ హిస్టరీలోనే ఫస్ట్ టైం..రైలెక్కిన 5.85 లక్షల కార్లు
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం కార్ల అమ్మకాల్లోనే కాదు, వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసే విధానంలో కూడా మారుతి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో ఏకంగా 5.85 లక్షల కార్లను కేవలం రైళ్ల ద్వారా రవాణా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కంపెనీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనివల్ల పర్యావరణానికి కలిగిన మేలు, ఆదా అయిన ఇంధనం, రవాణాలో మారుతి వేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా తన కార్లను డీలర్షిప్లకు చేరవేసేందుకు గత కొన్నేళ్లుగా రైల్వే మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తోంది. 2016వ సంవత్సరంలో మారుతి కేవలం 77 వేల కార్లను మాత్రమే రైళ్ల ద్వారా పంపించేది. కానీ, గడిచిన పదేళ్లలో ఈ సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2017లో లక్ష కార్లు, 2018లో 1.46 లక్షలు, 2019లో 1.72 లక్షలు ఇలా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020లో కరోనా కారణంగా కొంచెం తగ్గుదల కనిపించినా, 2021 నుంచి మారుతి స్పీడు పెంచింది.

2021లో 2.22 లక్షల కార్లను రైళ్ల ద్వారా రవాణా చేసిన మారుతి, 2023 నాటికి 4.22 లక్షల మార్కును అందుకుంది. అయితే, 2025 సంవత్సరం మాత్రం మారుతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గతేడాది ఏకంగా 5.85 లక్షల కార్లను రైళ్ల ద్వారా పంపించి, 2024తో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కార్లను రైళ్లలో రవాణా చేయడం ఏ ఆటోమొబైల్ కంపెనీకైనా గొప్ప విషయమే.
మారుతి సుజుకి ఈ నిర్ణయం వెనుక కేవలం వ్యాపార కోణమే కాదు, సామాజిక బాధ్యత కూడా దాగి ఉంది. కార్లను లారీలు లేదా ట్రక్కుల ద్వారా రవాణా చేస్తే భారీగా ఇంధనం ఖర్చవుతుంది. కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి. కానీ రైళ్ల ద్వారా రవాణా చేయడం వల్ల పర్యావరణానికి కలిగిన ప్రయోజనాలు ఇవే..

కార్బన్ ఉద్గారాల తగ్గింపు: 2025 ఏడాదిలో రైల్వే రవాణాను ఎంచుకోవడం ద్వారా మారుతి సుజుకి సుమారు 87,904 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఉద్గారాలను పర్యావరణంలో కలవకుండా నిరోధించింది.
ఇంధన ఆదా: ట్రక్కుల ద్వారా జరగాల్సిన రవాణా రైళ్ల ద్వారా జరగడం వల్ల ఏకంగా 68.7 మిలియన్ లీటర్ల (687 లక్షల లీటర్లు) ఇంధనం ఆదా అయింది. ఇది దేశ ఇంధన అవసరాల దృష్ట్యా కూడా చాలా గొప్ప విషయం.
కేవలం పర్యావరణం కోసమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి మారుతి సుజుకి ఒక పక్కా ప్లాన్ వేసింది. రోడ్డు రవాణాలో ట్రాఫిక్, ప్రమాదాలు, వాతావరణ పరిస్థితుల వల్ల డెలివరీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ రైళ్ల ద్వారా కార్లు మరింత భద్రంగా, నిర్ణీత సమయంలో డీలర్లకు చేరుతాయి.
ఒకేసారి వందల సంఖ్యలో కార్లను పంపడానికి రైల్వే కోచ్లు అనుకూలంగా ఉంటాయి. మారుతి ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే వ్యాగన్లను ఉపయోగిస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు ఉండటం మారుతికి వరంగా మారింది. హర్యానా, గుజరాత్ ప్లాంట్ల నుంచి నేరుగా రైళ్ల ద్వారా దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు కార్లను పంపిస్తున్నారు.

మారుతి సుజుకి సంస్థ కేవలం ఇండియాలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా పర్యావరణ హితమైన రవాణాకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. భవిష్యత్తులో ఈ 5.85 లక్షల సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రైల్వే శాఖతో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటోంది. లారీ డ్రైవర్ల కొరత, డీజిల్ ధరల పెరుగుదల వంటి సమస్యల నుంచి తప్పుకుని, మరింత వ్యవస్థీకృతమైన రైల్వే రవాణా వైపు మొగ్గు చూపడం మారుతికి కలిసొచ్చే అంశం.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం ప్రకారం.. మారుతి సుజుకి ఎంచుకున్న ఈ గ్రీన్ లాజిస్టిక్స్ విధానం ఇతర వాహన తయారీ సంస్థలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఇది కేవలం కంపెనీకి లాభాలను అందించడమే కాకుండా, దేశం పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు రైల్వే ట్రాక్ పైకి తమ కార్లను ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








