ఛార్జింగ్ అయిపోతే పెట్రోల్తో ప్రయాణం.. MG నుంచి ఇండియాలోనే తొలి ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీ
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ (SUV)ల హవా కొనసాగుతున్న తరుణంలో, ప్రముఖ వాహన తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తెస్తూ, తన సరికొత్త ఎస్యూవీని ఈ ఏడాది అక్టోబర్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. బ్యాటరీ అయిపోతే పెట్రోల్తో.. పెట్రోల్ లేకపోతే బ్యాటరీతో నడిచే ఈ వినూత్న కారు, భారత రోడ్లపై ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతోంది.
ఏమిటీ పీహెచ్ఈవీ (PHEV) టెక్నాలజీ?
సాధారణ ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ప్రయాణం ఆగిపోతుంది. కానీ ఈ ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ కారులో అటు ఎలక్ట్రిక్ మోటార్, ఇటు పెట్రోల్ ఇంజిన్ రెండూ ఉంటాయి. మీరు దీనిని ఇంట్లోనే ప్లగ్ సాకెట్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం బ్యాటరీ పవర్తో సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ పూర్తయితే, వెంటనే పెట్రోల్ ఇంజిన్ పని చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ప్రయాణం మధ్యలో ఆగిపోతుందనే భయం (Range Anxiety) ఉండదు.

మహీంద్ర XUV 7XO కి గట్టి పోటీ
MG నుంచి వస్తున్న ఈ కొత్త ఎస్యూవీ, ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న మహీంద్ర XUV 7XO తో నేరుగా తలపడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో విజయవంతమైన వులింగ్ స్టార్లైట్ 560 (Wuling Starlight 560) ఆధారంగా ఈ కారును రూపొందిస్తున్నారు. దీనికి అంతర్గతంగా 520 అనే కోడ్ నేమ్ ఇచ్చారు. ఇది కేవలం హైబ్రిడ్ వెర్షన్లోనే కాకుండా, ప్యూర్ ఎలక్ట్రిక్ (EV) మోడల్లో కూడా అందుబాటులోకి రానుంది. పరిమాణం పరంగా కూడా ఇది మహీంద్ర కంటే కాస్త పొడవుగా ఉండటం విశేషం.
మైలేజ్, పర్ఫార్మెన్స్ అదుర్స్
ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 20.5 kWh బ్యాటరీ ప్యాక్ కలయికతో కూడిన హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మొత్తం మీద 197 hp పవర్, 230 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

మొత్తం రేంజ్: పెట్రోల్ ట్యాంక్ (52 లీటర్లు), బ్యాటరీ కలిపితే ఏకంగా 1,100 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు.
వేగం: కేవలం 9.7 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 170 కిలోమీటర్లు.
లగ్జరీ ఇంటీరియర్, ఫీచర్లు
ఈ ఎస్యూవీ సుమారు 4,745 మి.మీ పొడవు, 2,810 మి.మీ వీల్బేస్ కలిగి ఉండటంతో లోపల స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. కారు లోపల 12.8 అంగుళాల భారీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి.

ధర, మార్కెట్ వ్యూహం
ప్రస్తుతం మన దేశంలో పీహెచ్ఈవీ టెక్నాలజీ కేవలం BMW, వోల్వో వంటి ఖరీదైన బ్రాండ్లలో మాత్రమే ఉంది. MG దీనిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల లోపు బడ్జెట్లో (మాస్ మార్కెట్) తీసుకురావడం ద్వారా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కస్టమర్లను ఆకర్షించాలని చూస్తోంది. 2026-27 నాటికి ఆరు కొత్త మోడళ్లను లాంచ్ చేయాలనే MG ప్రణాళికలో ఇది అత్యంత కీలకమైనది. ఎలక్ట్రిక్ కార్లకు మారాలని ఉన్నా, ఛార్జింగ్ సమస్యల వల్ల భయపడే వారికి ఈ కారు ఒక అద్భుతమైన వారధిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications








