క్రెటా, XUV 7XOలకు వణుకు పుట్టిస్తున్న నిస్సాన్.. మార్కెట్లోకి రెండు సరికొత్త బ్రహ్మస్త్రాలు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలె గ్రావైట్ (Gravite) MPV కారును విజయవంతంగా లాంచ్ చేసిన ఈ జపాన్ సంస్థ, ఇప్పుడు సరికొత్తగా రెండు అద్భుతమైన ఎస్యూవీలను రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తోంది.
ఇందులో ఒకటి ఐదు సీట్ల మిడ్-సైజ్ ఎస్యూవీ టెక్టాన్ (Tekton) కాగా.. మరొకటి ప్రీమియం త్రీ-రో 7-సీటర్ ఎస్యూవీ. ఈ రెండు కార్ల రాకతో మార్కెట్లో ఇప్పటికే రారాజులుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా XUV 7XO వంటి మోడళ్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిస్సాన్ టెక్టాన్ కారు వచ్చే నెల జూలై 9వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త కారు అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) మోడల్కు రీబ్యాడ్జ్డ్ వర్షన్గా వస్తోంది.
ఈ కారు ఎక్స్టీరియర్ లుక్ నిస్సాన్ పాపులర్ గ్లోబల్ మోడల్ పాట్రోల్ (Patrol) నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది. కారు లోపలి భాగంలో డస్టర్ లాంటి మోడ్రన్ ఫీచర్లను అందించబోతున్నారు. టెక్టాన్ మార్కెట్లోకి వస్తే మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

నిస్సాన్ టెక్టాన్ కారు రెండు విభిన్న పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా.. రెండోది మరింత శక్తివంతమైన 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. చిన్న ఇంజిన్ మోడల్లో కేవలం మాన్యువల్ గేర్బాక్స్ మాత్రమే లభిస్తుంది. అదే సమయంలో పెద్దదైన 1.3 లీటర్ ఇంజిన్తో పాటు మాన్యువల్, డీసీటీ (DCT) ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. రైడర్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ వేరియంట్లను డిజైన్ చేశారు.
టర్బో పెట్రోల్ మోడళ్లతో పాటు నిస్సాన్ కంపెనీ ఈ ఏడాది పండుగ సీజన్ (Festive Season)లో టెక్టాన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ను కూడా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ను జత చేయనున్నారు. ఈ సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీ సహాయంతో, సిటీ ట్రాఫిక్లో ఈ కారు ఏకంగా 80 శాతం వరకు కేవలం ఈవీ (EV) మోడ్లోనే నడుస్తుందని కంపెనీ చెబుతోంది. దీనివల్ల కస్టమర్లకు ఊహించని రేంజ్లో మైలేజ్ లభించే అవకాశం ఉంది.

టెక్టాన్ లాంచ్ అయిన తర్వాత నిస్సాన్ సంస్థ తన ఫ్లాగ్షిప్ 7-సీటర్ ఎస్యూవీని వచ్చే ఏడాది (2027) మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ భారీ కారు మార్కెట్లో మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కజార్ వంటి పాపులర్ కార్లకు ప్రత్యర్థిగా నిలవనుంది.
దీని డిజైన్ దాదాపు టెక్టాన్ లాగే ఉన్నప్పటికీ.. సైజ్ పరంగా ఇది చాలా పెద్దదిగా, అదనంగా థర్డ్-రో సీటింగ్తో వస్తుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.8 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉండనున్నాయి. 5-సీటర్ మోడల్తో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.
ఈ రెండు కార్లతో పాటు నిస్సాన్ తన గ్లోబల్ ఫ్లాగ్షిప్ మోడల్ నిస్సాన్ పాట్రోల్ (Nissan Patrol)ను కూడా భారత్కు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ లగ్జరీ ఎస్యూవీ 2027 మధ్య నాటికి ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది 3.8 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ V6 ఇంజిన్, 3.5 లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇండియాకు ఏ వేరియంట్ వస్తుందనేది ఇంకా స్పష్టత లేదు. లాంచ్ అయ్యాక ఇది టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications