ఆభరణాల కోసం కాదు..కార్ల కోసమే వెండి కొంటున్నారట..ధరలు పెరగడం వెనుక అసలు నిజం ఇదే
వెండి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మెరిసే ఆభరణాలు, పూజా సామాగ్రి లేదా వెండి నాణేలు. సాధారణంగా మనం వెండిని ఒక పెట్టుబడి సాధనంగానో లేదా శుభకార్యాల్లో బహుమతులుగా ఇచ్చే వస్తువుగానో చూస్తాం. కానీ పారిశ్రామిక రంగంలో వెండికి ఉన్న విలువ అమూల్యమైనది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని ఎక్కువగా వాడుతుంటారు.
అయితే ఇప్పుడు ఆటోమొబైల్ రంగం వెండి వినియోగంలో అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఆధునిక కార్లలో టెక్నాలజీ పెరిగేకొద్దీ, వెండి అవసరం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. నేటి కార్లు కేవలం యంత్రాలు మాత్రమే కాదు, అవి చక్రాల మీద నడిచే సూపర్ కంప్యూటర్లుగా మారుతున్నాయి. ఈ కంప్యూటర్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే వెండి అత్యవసరం.

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంజెల్ వన్ పరిశోధన ప్రకారం.. మనం వాడే ప్రతి కారులో వెండి ఉంటుంది. అయితే మనం వాడే కారు రకాన్ని బట్టి ఈ వెండి పరిమాణం మారుతుంటుంది. ఒక సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కారులో సగటున 15 నుంచి 20 గ్రాముల వెండిని ఉపయోగిస్తారు. అదే హ్యాట్రిక్ టెక్నాలజీ ఉన్న హైబ్రిక్ కార్ల విషయానికి వస్తే ఈ పరిమాణం 18 నుంచి 34 గ్రాములకు పెరుగుతుంది.
ఇక ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, ఒక్కో ఈవీలో 25 నుంచి 50 గ్రాముల వరకు వెండి అవసరమవుతుంది. అంటే సాధారణ ఇంధన కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లలో సుమారు 70 శాతం కంటే ఎక్కువ వెండిని వాడుతున్నారు. ఈ లెక్కన చూస్తే, భవిష్యత్తులో ఈవీల సంఖ్య పెరిగితే వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

కారులోని ఏ భాగంలో వెండి ఉంటుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి కారులోని ఎలక్ట్రానిక్ విడిభాగాలన్నింటిలోనూ వెండి ప్రాముఖ్యత ఉంటుంది. కారులో మనం పాటలు వినే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే ఎయిర్బ్యాగ్ సిస్టమ్, బ్రేకింగ్ వ్యవస్థలోని ఏబీఎస్ (ABS), కారు అద్దాలు వాటంతట అవే పైకి కిందకు వెళ్లే పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కారు చుట్టూ ఉండే అనేక సెన్సార్లలో వెండిని ఉపయోగిస్తారు.
ముఖ్యంగా ఇంజన్ కంట్రోల్ యూనిట్లో వెండి వాడకం చాలా ఎక్కువ. ఎలక్ట్రిక్ కార్లలో అయితే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, హై-వోల్టేజ్ కనెక్షన్లు, ఛార్జింగ్ సిస్టమ్లలో వెండి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. వెండిని కార్లలో వాడటానికి ప్రధాన కారణం దాని విద్యుత్ వాహకత(Electrical Conductivity). లోహాలన్నింటిలోనూ వెండి విద్యుత్తును అత్యంత వేగంగా, తక్కువ నష్టంతో ప్రసరింపజేస్తుంది. కార్లలోని సెన్సార్లు సెకనులో వందో వంతు కాలంలో స్పందించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు కారు ప్రమాదానికి గురైనప్పుడు ఎయిర్బ్యాగ్లు వెంటనే తెరుచుకోవాలి. ఇలాంటి అత్యంత వేగవంతమైన సిగ్నల్స్ ప్రసారానికి వెండిని మించిన లోహం మరొకటి లేదు. అందుకే ఖరీదైనదైనా సరే, వాహన తయారీ సంస్థలు వెండికే మొగ్గు చూపుతాయి. వెండి వాడకం వల్ల కారులోని ఎలక్ట్రానిక్ స్విచ్లు, సర్క్యూట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. తుప్పు పట్టకుండా ఉంటాయి.
ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో వెండి డిమాండ్ ఏటా 3.4 శాతం చొప్పున పెరగనుంది. 2025 నుండి 2031 మధ్య కాలంలో ఈ పెరుగుదల మరింత వేగంగా ఉండబోతోంది. ప్రస్తుతానికి ప్రపంచ ఆటో ఇండస్ట్రీ ఏడాదికి సుమారు 1700 నుండి 2500 టన్నుల వెండిని వినియోగిస్తోంది. కానీ 2031 నాటికి ఇది ఏడాదికి 3000 టన్నులకు చేరుకోవచ్చని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరిగి, అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుండటంతో వెండికి ఉన్న గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో వెండి ఆభరణాల ధరల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వెండి అనేది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఆధునిక రవాణా వ్యవస్థను నడిపించే ఒక ఇంధనంగా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications








