ప్రీమియం బైక్ ధరకే టాటా ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది.. మరో 3 రోజులే! ఇది దేశంలో అత్యంత చౌకైనది!
దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సాధారణ కార్లు వాడే మధ్యతరగతి కుటుంబాలపై భారీ భారం పడుతోంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఆఫీస్కు వెళ్లేవారు, కుటుంబంతో తరచూ ప్రయాణాలు చేసే వారు ఇప్పుడు ఇంధన ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి కారును బయటకు తీస్తేనే పెట్రోల్ ఖర్చు వేల రూపాయల్లోకి వెళ్లిపోతోందని చాలామంది వాపోతున్నారు. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన పాత పెట్రోల్ కార్లు తక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో తక్కువ ఖర్చుతో ప్రయాణించే మార్గాల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఒకప్పుడు ఈవీ కార్లు ఖరీదైనవిగా భావించినప్పటికీ, ప్రస్తుతం కంపెనీలు వాటిని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్(Tata Motors) తీసుకురాబోతున్న కొత్త టియాగో ఈవీ(Tiago Ev) ఫేస్లిఫ్ట్పై భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దేశంలో అందుబాటు ధరలో లభించే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచిన టియాగో EV, ఇప్పుడు మరింత తక్కువ ధరతో వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం Battery-as-a-Service (BaaS) సబ్స్క్రిప్షన్ మోడల్. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం బ్యాటరీ ఖర్చు. కానీ ఈ కొత్త విధానంలో వినియోగదారుడు బ్యాటరీని ఒకేసారి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. కారు ధరను తక్కువగా ఉంచి, బ్యాటరీ వినియోగానికి ప్రత్యేక సబ్స్క్రిప్షన్ లేదా నెలవారీ చెల్లింపు విధానం ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
దీంతో ఒకేసారి భారీ మొత్తం ఖర్చు చేయలేని మధ్యతరగతి వినియోగదారులకు కూడా ఈవీ కారు కొనుగోలు చేయడం సులభమవుతుంది. టియాగో ఈవీ ఫేస్లిఫ్ట్కు BaaS అమల్లోకి వస్తే దేశంలోని ఎంట్రీ లెవల్ EV మార్కెట్లో పెద్ద మార్పు రావచ్చు. ముఖ్యంగా పెట్రోల్ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలు, రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులు, నగరాల్లో కారును ఎక్కువగా ఉపయోగించే వారు ఈ కొత్త విధానంపై ఆసక్తి చూపే అవకాశముంది.

ప్రస్తుతం ఉన్నటువంటి Tata Tiago EV సుమారు రూ.7.99 లక్షల ప్రారంభ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే బ్యాటరీ లీజింగ్ లేదా Battery-as-a-Service (BaaS) మోడల్ను ప్రవేశపెడితే, కారు ధరను దాదాపు రూ.5 లక్షల వరకు తగ్గించవచ్చని మార్కెట్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త అప్డేట్తో టియాగో పెట్రోల్ వెర్షన్తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా మే 28న విడుదల కానున్నట్లు సమాచారం.
ఈసారి రెండు మోడళ్లలో కూడా గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా EV వెర్షన్లో బ్యాటరీ ప్యాక్లు మరింత అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టియాగో EV 19.2 kWh, 24 kWh అనే బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. వీటిలో చిన్న బ్యాటరీ సింగిల్ ఛార్జ్పై దాదాపు 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుండగా, పెద్ద బ్యాటరీ వేరియంట్ సుమారు 315 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని టాటా చెబుతోంది.

ఇక రాబోయే అప్డేట్లో బ్యాటరీ ప్యాక్లను మరింత పెంచే అవకాశం ఉంది. 24 kWhతో పాటు కొత్తగా 30 kWh బ్యాటరీ ఆప్షన్ను ప్రవేశపెట్టవచ్చని అంచనాలు ఉన్నాయి. అలా అయితే, ఇది ఒకే ఛార్జ్పై దాదాపు 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం సాధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రూ.5 లక్షలు అంటే ఇది కొన్ని ప్రీమియం బైకులతో సమానం. కాబట్టి ఈ కొత్త కారు అందుబాటులోనే బెస్ట్ ఆప్షన్ కానుంది.


Click it and Unblock the Notifications