3 నెలలుగా జనాలు ఎక్కువగా కొంటున్న మిడ్సైజ్ SUVలు.. టాప్-10 కార్ల పూర్తి సేల్స్ వివరాలు!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్సైజ్ ఎస్యూవీ విభాగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్లలో ఒకటిగా నిలిచింది. గత కొన్నేళ్లుగా వినియోగదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు హ్యాచ్బ్యాక్లు, సెడాన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన కొనుగోలుదారులు, ఇప్పుడు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రత, కుటుంబ ప్రయాణాలకు అనువైన డిజైన్ కారణంగా మిడ్సైజ్ ఎస్యూవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ సెగ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ విభాగంలో పోటీ రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. గాడివాడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, చివరి మూడు నెలల టాప్ 10 మిడ్సైజ్ ఎస్యూవీ సేల్స్ చూద్దాం.
మార్చి నుంచి మే 2026 వరకు నమోదైన మూడు నెలల విక్రయాలను పరిశీలిస్తే, ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ కాలంలో మొత్తం 48,364 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా విక్రయమైన మిడ్సైజ్ ఎస్యూవీగా క్రెటా నిలిచింది. ఈ మూడు నెలల పాటు ప్రతి నెలా 15 వేలకుపైగా యూనిట్లను విక్రయించడం ద్వారా ఈ మోడల్పై వినియోగదారుల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.

క్రెటా తర్వాత రెండో స్థానంలో మారుతి సుజుకి విక్టోరిస్ నిలిచింది. మార్చి నుంచి మే 2026 మధ్య ఈ ఎస్యూవీ మొత్తం 35,616 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. మారుతి బ్రాండ్పై ఉన్న విశ్వాసం, బలమైన హైబ్రిడ్ టెక్నాలజీ, మంచి ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు విక్టోరిస్ భారీగా కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే కుటుంబాల నుంచి ఈ మోడల్కు మంచి ఆదరణ లభిస్తోంది.
ఇదే కాలంలో కియా సెల్టోస్ కూడా తన బలమైన మార్కెట్ స్థానాన్ని కొనసాగించింది. మొత్తం 32,204 యూనిట్ల విక్రయాలతో ఈ ఎస్యూవీ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. నాలుగో స్థానంలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నిలిచింది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం 27,985 యూనిట్ల విక్రయాలను నమోదు చేసిన ఈ హైబ్రిడ్ ఎస్యూవీ కూడా మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ కాలంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరోసారి తన స్థిరమైన మార్కెట్ డిమాండ్ను చాటుకుంది. మార్చి నుంచి మే 2026 మధ్య ఈ ఎస్యూవీ మొత్తం 23,830 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఐదో స్థానం పొందింది. బలమైన హైబ్రిడ్ టెక్నాలజీ, అత్యుత్తమ మైలేజ్, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు ఈ కారుకు నిరంతర డిమాండ్ను తీసుకొస్తున్నాయి. కుటుంబ అవసరాలకు అనువైన ఎస్యూవీగా కొనసాగుతోంది.
ఇక ఇటీవలే భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్ 6వ స్థానంతో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచింది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే మార్చి నుంచి మే మధ్య 22,925 యూనిట్ల విక్రయాలను నమోదు చేయడంతో ఈ కొత్త ఎస్యూవీపై వినియోగదారుల ఆసక్తి ఎంతగా ఉందో స్పష్టమైంది. టాటా అందించిన కొత్త డిజైన్, టెక్నాలజీ, ప్రీమియం క్యాబిన్, భద్రతా ఫీచర్లు సియెర్రాను మార్కెట్లో వేగంగా గుర్తింపు పొందేలా చేశాయి.

స్కోడా కుషాక్ మూడు నెలల వ్యవధిలో మొత్తం 5,468 యూనిట్లు అమ్ముడవగా, తరువాతి స్థానంలో రెనాల్ట్ డస్టర్ మూడు నెలల్లో 5,028 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. టాటా కర్వ్ జాబితాలో 9 వ స్థానాన్ని పొందింది. మొత్తం 4,685 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, ఫోక్స్వ్యాగన్ టైగన్ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. మార్చి నుంచి మే 2026 మధ్య మొత్తం 3,732 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications