దీన్ని చూస్తే కోట్లు విలువ చేస్తుందేమో అనుకుంటాం.. కానీ ధర మాత్రం లక్షల్లోనే.. త్వరలో రాబోయే 4 రగ్గడ్ SUVలివే
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీల (SUV) హవా నడుస్తోంది. మునుపటిలా కాకుండా, ఇప్పుడు కస్టమర్లు కేవలం కారు సౌకర్యాలనే కాకుండా, దాని లుక్, రోడ్ ప్రెజెన్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) వంటి గంభీరమైన, బాక్సీ డిజైన్ ఉన్న కార్లంటే మనవాళ్లకు క్రేజ్ ఎక్కువ.
కానీ ఆ కారు ధర కోట్లలో ఉండటంతో సామాన్యులకు అది కలగానే మిగిలిపోతోంది. అయితే, మీ కలలను నిజం చేస్తూ.. డిఫెండర్ లుక్ను తలపించేలా అతి తక్కువ ధరలో కొన్ని రగ్గడ్ ఎస్యూవీలు భారత మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టబోతున్నాయి. టాటా, మహీంద్రా వంటి స్వదేశీ దిగ్గజాలతో పాటు గ్లోబల్ బ్రాండ్లు కూడా ఈ రేసులో ఉన్నాయి.

1. మహీంద్రా విజన్ ఎస్ (Mahindra Vision S)
ఎస్యూవీల తయారీలో మహీంద్రా శైలే వేరు. త్వరలో వారు మహీంద్రా విజన్ ఎస్ (Vision S) పేరుతో ఒక గంభీరమైన కారును తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ దశలో ఉంది. ఇది మహీంద్రా మోడ్రన్ NU IQ ప్లాట్ఫారమ్పై రూపొందింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇందులో XUV 3XO లో వాడే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ను అమర్చే అవకాశం ఉంది. డిఫెండర్ను తలపించే బాక్సీ డిజైన్, పెద్ద వీల్స్ దీనికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి. దీని ధర దాదాపు రూ.10.5 లక్షల నుంచి రూ.17.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

2. టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV):
పాతతరం సియెర్రా కారును కొత్త హంగులతో, సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో టాటా మోటార్స్ తీసుకువస్తోంది. దీనిని 2026 మే నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. సియెర్రా ఈవీ చూడటానికి చాలా మాకో గా (Macho Look), డిఫెండర్ తరహా డిజైన్తో ఉంటుంది.
ఇందులో క్లోజ్డ్ గ్రిల్, పొడవాటి ఎల్ఈడీ లైట్ బార్, విశాలమైన గాజు కిటికీలు ఆకర్షణగా నిలుస్తాయి. టాటా హారియర్ ఈవీ కంటే తక్కువ ధరలోనే దీనిని లాంచ్ చేయనున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం. దీని ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

3. రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్యూవీ (Renault Bridger SUV):
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో నుంచి వస్తున్న బ్రిడ్జర్ ఎస్యూవీ కూడా డిఫెండర్ తరహా రగ్గడ్ లుక్ను కలిగి ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో పాటు పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ను కూడా రెనాల్ట్ ప్లాన్ చేస్తోంది.
దీని ఇంజిన్ సుమారు 113.4 బీహెచ్పీ శక్తిని ఇస్తుంది. ప్రపంచ మార్కెట్లో పేరున్న రెనాల్ట్ క్లియో ఆధారంగా దీనిని రూపొందించారు. ఇది 2027 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీని డిజైన్ కారణంగా ఇప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

4. జేఎస్డబ్ల్యూ జెటూర్ టీ2 (JSW Jetour T2):
ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ (JSW) గ్రూప్ భాగస్వామ్యంతో జెటూర్ టీ2 భారత్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఏడాది దీపావళి నాటికి దీని ఎంట్రీ ఉండవచ్చు. ఇది ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఎస్యూవీ.
ఇందులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో పాటు 26.7 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ పవర్తోనే 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని లుక్ అచ్చం ల్యాండ్ రోవర్ డిఫెండర్లాగే ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ నుండి బ్యాక్ స్పియర్ వీల్ వరకు ప్రతిదీ రగ్గడ్ లుక్ ఇస్తుంది.
ఎందుకు ఈ కార్లను కొనాలి?
భారతదేశంలో రోడ్ల పరిస్థితులకు, పెరుగుతున్న అడ్వెంచర్ టూరిజం క్రేజ్కు ఈ రగ్గడ్ ఎస్యూవీలు సరిగ్గా సరిపోతాయి. హై-గ్రౌండ్ క్లియరెన్స్, పటిష్టమైన బాడీ, మోడ్రన్ ఫీచర్లతో ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటాయి. వీటి ధరలు కూడా ప్రీమియం బ్రాండ్లతో పోలిస్తే అందుబాటులో ఉండటం మరో విశేషం. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ బాక్సీ డిజైన్ కార్ల కోసం కొద్ది రోజులు వేచి చూడటం మంచిది.


Click it and Unblock the Notifications