ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఈవీ కారు కొనేలా అతి తక్కువ ధరకే 400 కి.మీ రేంజ్ కారు వచ్చేస్తుంది
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సాధారణ వాహన వినియోగదారులపై ఇంధన భారం గణనీయంగా పెరిగింది. రోజువారీ ప్రయాణాల కోసం కార్లు ఉపయోగించే మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఎక్కువ మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగిన వాహనాల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతుండటంతో, ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. భారత్లో కూడా ఈవీల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునివ్వడం, దేశీయ ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ (Hyundai) కూడా భారత మార్కెట్పై మరింత దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు ఆధునిక కార్లతో భారత వినియోగదారుల మనసు గెలుచుకున్న హ్యుందాయ్, ఇప్పుడు తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించే పనిలో ఉంది. భవిష్యత్తులో ఈవీ(EV) మార్కెట్లో మరింత బలమైన స్థానాన్ని సంపాదించాలనే లక్ష్యంతో కంపెనీ ఒక కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ SUVను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా, మహీంద్రా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో గట్టి పోటీ ఇస్తుండగా, హ్యుందాయ్ కూడా అదే రేంజ్లో తన కొత్త మోడల్ను తీసుకురావాలని భావిస్తోంది. ముఖ్యంగా 4 మీటర్ల లోపు సెగ్మెంట్లో ఈ ఎలక్ట్రిక్ SUVను రూపొందిస్తున్నట్లు సమాచారం. భారతదేశంలో ఈ సెగ్మెంట్కు విపరీతమైన డిమాండ్ ఉంది. చిన్న కుటుంబాలకు సరిపోయే పరిమాణం, నగరాల్లో ఈజీ డ్రైవింగ్ కోసం కొత్త ఈవీని తెస్తుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVలో ఆధునిక సాంకేతికతలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ తరహా డిజైన్, డిజిటల్ ఫీచర్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, అలాగే ఎక్కువ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ వంటి అంశాలు ఇందులో ఉండే అవకాశముందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే స్టైలింగ్తో పాటు కుటుంబ వినియోగానికి అనువైన సౌకర్యాలను కూడా కంపెనీ అందించనుందని సమాచారం.

ధర పరంగా అందుబాటులో ఉంచేందుకు హ్యుందాయ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ SUVలు అధిక ధర కారణంగా అందరికీ చేరువ కాలేకపోతున్నాయి. అయితే కొత్త బడ్జెట్ EVతో ఆ సమస్యను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. తక్కువ ధరలో మెరుగైన రేంజ్, తక్కువ ఛార్జింగ్ ఖర్చు, ఆధునిక ఫీచర్లు అందిస్తే భారత వినియోగదారుల నుంచి ఈ మోడల్కు మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUVలో లెవెల్-2 ADAS భద్రతా టెక్నాలజీని అందించనున్నారు. దీంతో డ్రైవింగ్ సమయంలో ప్రమాదాల అవకాశాలు తగ్గి, సేఫ్టీ మరింత మెరుగవుతుంది. అందుకే ఈ కారు భారత్ NCAP, గ్లోబల్ NCAP టెస్టుల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే, అడ్వాన్స్డ్ సదుపాయాలు డజన్ల కొద్ది దీనిలో ఉండనున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ SUVలో 42 kWhతో పాటు 49 kWh బ్యాటరీ ఉండనుంది. పూర్తి ఛార్జ్తో 300 నుండి 400 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదని అంచనా. ప్రపంచ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఇన్స్టర్ EV డిజైన్ ఆధారంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం 'He1i' కోడ్ పేరుతో పిలుస్తున్న ఈ కారు 2026 చివరి లేదా 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి రావచ్చు. ధర రూ.12-13 లక్షల మధ్య ఉండొచ్చు.


Click it and Unblock the Notifications