విన్ఫాస్ట్ సూపర్ఫాస్ట్.. ఏడాదిలోనే 10,000 ఎలక్ట్రిక్ కార్లు.. టాటా, మహీంద్రాకు కొత్త ఛాలెంజ్!
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి, ఎంజీ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ (Vinfast) కూడా వేగంగా తన ఉనికిని చాటుకుంటోంది. భారత మార్కెట్ను అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ సంస్థ, స్థానిక తయారీకి ప్రాధాన్యం ఇస్తూ 'మేడ్ ఇన్ ఇండియా' వ్యూహంతో ముందుకు సాగుతోంది. VF6, VF7 ఎలక్ట్రిక్ SUVలతో ఇప్పటికే ఆసక్తిని పెంచిన విన్ఫాస్ట్, ఇప్పుడు మరో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు చేసిన తన అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి 10,000వ ఎలక్ట్రిక్ వాహనం ఉత్పత్తి అయినట్లు ప్రకటించింది.
ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమైన ఏడాది లోపే ఈ ఘనత సాధించడం కంపెనీ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం. విన్ఫాస్ట్కు భారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, గ్లోబల్ తయారీ కేంద్రంగా కూడా మారుతోంది. వియత్నాం వెలుపల కంపెనీ ఏర్పాటు చేసిన తొలి ఉత్పత్తి కేంద్రం భారతదేశంలో ఉండటం విశేషం. దీనివల్ల దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్తులో ఎగుమతులకు కూడా భారత్ కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

తమిళనాడులోని తూత్తుకుడి సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్క్లో 400 ఎకరాల విస్తీర్ణంలో విన్ఫాస్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లాంట్లో వాహనాల తయారీకి అవసరమైన బాడీ షాప్, పెయింట్ షాప్, ఫైనల్ అసెంబ్లీ లైన్లు, నాణ్యత నియంత్రణ విభాగాలు, అలాగే సమర్థవంతమైన లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉత్పత్తి నుంచి డెలివరీ వరకు అన్ని ప్రక్రియలను ఒకే కేంద్రం నుంచి నిర్వహించే వీలుంది.
ప్రస్తుతం ఈ ప్లాంట్ సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే భారత మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను కంపెనీ సిద్ధం చేసింది. మార్కెట్ స్పందనను బట్టి ఈ సామర్థ్యాన్ని దశలవారీగా సంవత్సరానికి 1.5 లక్షల యూనిట్ల వరకు పెంచే అవకాశం ఉందని విన్ఫాస్ట్ వెల్లడించింది.

ఈ విస్తరణ ద్వారా కంపెనీ దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా, భారత్ను గ్లోబల్ ఎగుమతి కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దీంతో తూత్తుకుడి ప్లాంట్ విన్ఫాస్ట్ అంతర్జాతీయ వృద్ధి వ్యూహంలో కీలక పాత్ర పోషించనుంది. భారత ఈవీ రంగంలో విన్ఫాస్ట్ ప్రయాణం ఇప్పుడే మొదలైనప్పటికీ, కంపెనీ వేగం చూస్తుంటే భవిష్యత్తులో కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తూత్తుకుడి ప్లాంట్లో ప్రస్తుతం విన్ఫాస్ట్ VF6, VF7 ఎలక్ట్రిక్ SUVల ఉత్పత్తి జరుగుతోంది. ధరల విషయానికి వస్తే, VF6 ఎలక్ట్రిక్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.49 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, VF7 ధర రూ. 20.89 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ రెండు మోడళ్లను కంపెనీ భారత వినియోగదారులకు అందిస్తోంది.

ఇటీవల భారత మార్కెట్ కోసం తన మూడో ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా పరిచయం చేసింది. VF MPV 7 పేరుతో వచ్చిన ఈ ఫ్యామిలీ-ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ MPV ధర రూ. 24.49 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. పెద్ద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మోడల్లో 60.13 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ను అందించారు. ఈ బ్యాటరీతో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 517 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.


Click it and Unblock the Notifications