ఆటోమొబైల్ రంగాన్ని వణికించే బ్యాడ్ న్యూస్.. ఏకంగా లక్ష మంది ఉద్యోగులను పీకేయనున్న ఫోక్స్వ్యాగన్
ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్వ్యాగన్ (Volkswagen) గ్రూప్ నుంచి ఆటోమొబైల్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. కంపెనీ తన అంతర్గత ఖర్చులను భారీగా తగ్గించుకోవడానికి, వ్యాపారాన్ని రీస్ట్రక్చర్ (పునర్వ్యవస్థీకరణ) చేయడానికి సుమారు 1,00,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కంపెనీ సీఈఓ ఒలివర్ బ్లూమ్ (Oliver Blume), సీఎఫ్ఓ ఆర్నో యాంట్లిట్జ్ కలిసి ఈ భారీ లేఆఫ్స్ స్కెచ్ వేశారు. మొదట కేవలం 50,000 మందిని తీసేయాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా ఆ సంఖ్యను ఏకంగా ఒక లక్షకు పెంచినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఫోక్స్వ్యాగన్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల కంపెనీలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడనుంది. నివేదికల ప్రకారం, ఫోక్స్వ్యాగన్ గ్రూప్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6,67,164 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 43 శాతం మంది కేవలం జర్మనీలోనే ఉన్నారు.
ఇప్పుడు కంపెనీ ప్రకటించబోయే లక్ష మంది లేఆఫ్స్ గనుక అమలులోకి వస్తే, ఫోక్స్వ్యాగన్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 15 శాతం మందిని ఒకే దెబ్బకు తొలగించినట్లు అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత విధించడం ఈ కార్ల కంపెనీ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
జర్మనీలోని 4 ప్రధాన ప్లాంట్లు క్లోజ్
కేవలం ఉద్యోగుల తొలగింపుతోనే ఆగకుండా, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ జర్మనీలో ఉన్న తన నాలుగు అతిపెద్ద ప్రొడక్షన్ ప్లాంట్లను శాశ్వతంగా మూసివేయాలని ఆలోచిస్తోంది. ఫోక్స్వ్యాగన్కు చెందిన హ్యానోవర్ (Hanover), జ్వికావు (Zwickau), ఎమ్డెన్ (Emden) ప్లాంట్లతో పాటు, వారి అనుబంధ బ్రాండ్ అయిన ఆడి (Audi) కి చెందిన నెకార్సల్మ్ (Neckarsulm) ప్లాంట్ లో కూడా ఉత్పత్తిని ఎప్పటికీ నిలిపివేయనున్నారు.

అయితే ఈ ప్లాంట్ల మూసివేత రాత్రికి రాత్రే జరగదని, ప్రస్తుతం అక్కడ తయారవుతున్న కార్ల మోడల్స్ ప్రొడక్షన్ లైఫ్ పూర్తిగా ముగిసిన తర్వాత, ఆయా యూనిట్లకు శాశ్వతంగా తాళాలు వేస్తామని యాజమాన్యం తెలిపింది.
పెట్టుబడుల్లో భారీ కోత, సంక్షోభానికి కారణాలు
ఆర్థిక నష్టాల నుండి బయటపడటానికి ఫోక్స్వ్యాగన్ రాబోయే ఐదేళ్ల కోసం తన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడుల) ప్లాన్ లో 15 శాతం కోత పెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల కంపెనీ పెట్టుబడి 130 బిలియన్ యూరోలకు (దాదాపు 148 బిలియన్ డాలర్లు) పడిపోనుంది.
అసలు ఫోక్స్వ్యాగన్ కు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా చైనాలో స్థానిక ఈవీ (EV) కార్ల కంపెనీల నుంచి వస్తున్న గట్టి పోటీనే. దీనికి తోడు అమెరికాలో పెరిగిన కొత్త ఇంపోర్ట్ టారిఫ్ రూల్స్, యూరప్ మార్కెట్లో తగ్గిన విక్రయాలు, సాంప్రదాయ డీజిల్-పెట్రోల్ ఇంజిన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి అవుతున్న భారీ ఖర్చుల వల్ల కంపెనీ లాభాలు దారుణంగా పడిపోయాయి.
రోడ్డెక్కనున్న కార్మిక సంఘాలు.. యాజమాన్యానికి వార్నింగ్
ఫోక్స్వ్యాగన్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై జర్మనీలో ఇప్పటికే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘం ఐజీ మెటల్ (IG Metall), వర్క్స్ కౌన్సిల్ ఈ లేఆఫ్స్, ప్లాంట్ల మూసివేత ప్రతిపాదనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
2024లో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ దశాబ్దం ముగిసేవరకు (2030 వరకు) ఎలాంటి ప్లాంట్లను మూసివేయకూడదనే నిబంధన ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకెళ్లి ఉద్యోగాలను తీసేస్తే, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు, సమ్మెలు చేపట్టి కంపెనీని స్తంభింపజేస్తామని యూనియన్లు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.


Click it and Unblock the Notifications