కేంద్ర బడ్జెట్ 2026పై ఆటో రంగం భారీ ఆశలు.. పరిశ్రమ ఎదురుచూస్తున్న కీలక అంశాలు ఇవే!
ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్లో సమర్పించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో ఆశలు మరింత పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో ఆటో రంగం ఒకటైన నేపథ్యంలో, ఈ పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రకటించాలని ఆటో రంగ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రంగం GDPకి గణనీయంగా దోహదపడుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది, కాబట్టి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ప్రోత్సాహాలను అందించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా, గత కొన్ని సంవత్సరాలుగా విధానాల్లో వచ్చిన మార్పుల తర్వాత, ఇప్పుడు స్థిరమైన, స్పష్టమైన పాలసీ దిశ అవసరమని వారు భావిస్తున్నారు.
ఆటో రంగం ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం చేపట్టిన GST 2.0 సంస్కరణలతో రంగం ఒక మేరకు పునర్నిర్మాణాన్ని చూసింది. అయితే, తదుపరి దశ వృద్ధిని సాధించాలంటే కేవలం పన్ను సంస్కరణలే కాకుండా, ముందస్తుగా అంచనా వేయగల విధానాలు, సహాయక డ్యూటీ, తయారీ రంగానికి అనుకూలమైన ఆర్థిక వాతావరణం అవసరం. వినియోగదారుల డిమాండ్ను పెంచే విధంగా పాలసీలు రూపొందిస్తే, దీర్ఘకాలిక వృద్ధికి బలమైన పునాది పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఇప్పటికే మంచి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, ఈ వృద్ధి స్థిరంగా కొనసాగాలంటే మరింత బలమైన ప్రభుత్వ మద్దతు అవసరమని ఆటో రంగం అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనాల(EVలు) కోసం లక్ష్యంగా పెట్టుకున్న ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రవేశపెట్టాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది. ధరలు తగ్గడం, ఛార్జింగ్ మౌలిక వసతులు మెరుగుపడడం వంటి అంశాలపై దృష్టి పెట్టితే, సామాన్య వినియోగదారుల్లో EVల స్వీకరణ వేగంగా జరుగుతుందని భావిస్తున్నారు.
దేశీయ తయారీకి ప్రభుత్వం నిరంతరంగా మద్దతు ఇవ్వడం, అలాగే రోడ్డు, రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయింపులను పెంచడం అత్యంత కీలకమైన అంశాలని స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పియూష్ అరోరా స్పష్టం చేశారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెరిగితే, ఆటోమోటివ్ పరిశ్రమకు అవసరమైన బలమైన పునాది ఏర్పడుతుందని, దాంతో తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు దేశీయ పరిశ్రమ అంతర్జాతీయంగా మరింత పోటీగానూ మారుతుందని అభిప్రాయపడ్డారు.

రాబోయే కేంద్ర బడ్జెట్ ఈ రంగంపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాన్ని అందిస్తుందని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు. స్పష్టమైన విధాన రూపకల్పన ఉంటే పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుందని, దీర్ఘకాలిక వృద్ధికి అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆమె అన్నారు. ఇటువంటి విధానాలతో భారత ఆటోమోటివ్ పరిశ్రమ మరింత స్థిరంగా ఎదిగి, భవిష్యత్ మొబిలిటీ అవసరాలను తీర్చగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
రాబోయే కేంద్ర బడ్జెట్పై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-DRIVE) పథకం కింద ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా లక్ష్య ప్రోత్సాహకాలు ఇవ్వాలని కంపెనీ కోరింది. దీని వల్ల సాధారణ వినియోగదారులకు EVలు మరింత అందుబాటులోకి వస్తాయని, ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగంగా విస్తరిస్తుందని టాటా మోటార్స్ అభిప్రాయపడింది.

అదే సమయంలో, ఫ్లీట్ విభాగంలో ఉపయోగించే ఎలక్ట్రిక్ కార్లకు బడ్జెట్లో మద్దతు అందించాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరుతోంది. క్యాబ్ సర్వీసులు, కమర్షియల్ ఫ్లీట్లలో EVల వినియోగం పెరిగితే, కాలుష్య నియంత్రణతో పాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగవంతం అవుతుందని టాటా మోటార్స్ విశ్వసిస్తోంది. ఈ తరహా ప్రోత్సాహకాలతో భారతదేశంలో EV ఎకోసిస్టమ్ బలపడటంతో పాటు, దీర్ఘకాలిక స్థిరమైన వృద్ధికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








