అవసరమైతే కారులో పడుకుని కూడా వెళ్లొచ్చు.. స్మార్ట్ఫోన్ కంపెనీ నుంచి సరికొత్త ఫ్యామిలీ కారు!
చైనా, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల తయారీలో మంచి గుర్తింపు పొందిన షియోమీ (xiaomi), ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ తన ముద్ర వేయడానికి వేగంగా అడుగులు వేస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇప్పటికే అడుగుపెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు పెర్ఫార్మెన్స్తో పాటు లగ్జరీ సెగ్మెంట్పైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా తన కొత్త ప్రీమియం సబ్-బ్రాండ్ స్కైనోమాడ్ (Skynomad) కింద తొలి మోడల్ N90ను తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యాధునిక సాంకేతికత, ఆకట్టుకునే డిజైన్, హై-పెర్ఫార్మెన్స్ పనితీరుతో ఈ కొత్త మోడల్ గ్లోబల్ ఈవీ మార్కెట్లో షియోమీ ఆశయాలను మరింత స్పష్టంగా చాటుతోంది.
స్కై నోమాడ్ N90ను చూస్తేనే ఇది ప్రీమియం లగ్జరీ SUV అని స్పష్టంగా అర్థమవుతుంది. భారీ బాడీ, సరికొత్త డిజైన్, విశాల క్యాబిన్తో కుటుంబంతో కలిసి ప్రయాణాలకు అనువుగా దీనిని తయారు చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం షియోమీ ఇందులో మూడు వరుసల సీట్లు అందించగా, మొత్తం ఏడుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునేలా ఇంటీరియర్ను డిజైన్ చేసింది. కొలతల పరంగా కూడా పెద్ద సంఖ్యలను కలిగి ఉంది.

కొలతల విషయానికి వస్తే, ఈ SUV 5,285 మిమీ పొడవు, 1,998 మిమీ వెడల్పు, 1,825 మిమీ ఎత్తు కలిగి ఉండగా, 3,080 మిమీ వీల్బేస్ కారణంగా లోపల లెగ్రూమ్, హెడ్రూమ్ ఎక్కువగా ఉంటుంది. సుమారు 2.8 టన్నుల బరువు ఉన్నప్పటికీ, ఈ భారీ SUV ప్రయాణికులకు ఫస్ట్-క్లాస్ స్థాయి సౌకర్యాన్ని అందించేలా రూపొందించబడింది. అవసరమైతే లోపల సీట్లను మడిచి విశ్రాంతి తీసుకునేంత విశాలమైన స్థలాన్ని కూడా అందిస్తుంది.
పవర్ట్రెయిన్ విషయంలో షియోమీ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. N90ను రేంజ్-ఎక్స్టెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది సాధారణ పెట్రోల్-హైబ్రిడ్ కారు కాదు. ఇందులో ప్రధాన డ్రైవ్ పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారానే జరుగుతుంది. అందుకోసం పెద్ద సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ను ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో ఉండే పెట్రోల్ ఇంజన్ చక్రాలను నేరుగా నడపదు. అది కేవలం జనరేటర్గా పనిచేసి బ్యాటరీకి పవర్ను ఉత్పత్తి చేస్తుంది.

దీంతో బ్యాటరీ ఛార్జ్ తగ్గినప్పుడు కూడా కారు ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. పవర్ట్రెయిన్కు సంబంధించిన పూర్తి వివరాలను షియోమీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సమాచారం ప్రకారం, 76 kWh బ్యాటరీ ప్యాక్తో, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది రేంజ్-ఎక్స్టెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కావడంతో, బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా ప్రయాణం ఆగిపోదు.
ఇందులో ఉండే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వీల్స్ను నేరుగా నడపకుండా, బ్యాటరీకి పవర్ ఉత్పత్తి చేసే జనరేటర్గా పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సుమారు లీటరుకు 16 కిలోమీటర్ల వరకు అందించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కారులో పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండనుంది. అలాగే, ఇది 5 సీటర్, 7-సీటర్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

భారత మార్కెట్ విషయానికి వస్తే, ప్రస్తుతం షియోమీ ఈ కారును భారత్లో విడుదల చేసే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ముందుగా చైనా మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్న తర్వాతే ఇతర దేశాలకు విస్తరించే ప్రణాళిక ఉందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి భవిష్యత్తులో షియోమీ కార్లు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు లాంచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications